సామాజిక, భౌతిక పరిణామాలు కొన్ని సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ స్వరూపాన్ని మారుస్తాయి. అప్పుడు అస్తిత్వ సంఘర్షణ మొదలవుతుంది. ఈ అలజడిలో బాణీ కొత్త దారులు అన్వేషిస్తుంది. అది చరిత్రను తడిమి, శాసనాలను తుడిచి సరికొత్త పాటగా జీవం పోసుకుంటుంది. ఇదీ కాల ధర్మం.
ప్రపంచంలో తెలంగాణదే అతిపెద్ద అస్తిత్వ యుద్ధం. ఇందులో పాటగాళ్లది ముందు వరుస. దిక్కులు పిక్కటిల్లంగ గొంతు చించుకున్నరు. ఆకలి పేగులను మీటి, కమ్మని పాటగ మలిచి.. జన చేతనాన్ని జమచేసిండ్రు. పస్తులతోనే పూటపూటకో పాట పాడి పోరుకు జవసత్వాలు తొడిగిండ్రు.
అరువై ఏండ్ల ఆకాంక్ష సిద్ధించింది. కేసిఆర్ నాయకత్వంలో ఇప్పుడు తెలంగాణ తెప్పరిల్లింది. కృష్ణా, గోదావరి నీళ్లు నలుదిక్కుల నుంచి పంట పొలాలకు మల్లినయి. ఎద్దెగసం మళ్లీ ఇళ్లు జేరినయి. ఇంకా సుదీర్ఘ ప్రయాణం ముందుంది. ఇప్పుడు సృజనకారులు ఎటువైపు అడుగులు వేయాలి? నిజమే! కవులు, రచయితలు, గాయకులు, మేధావులంతా రాజ్యానికి వ్యతిరేకం. ఉండాలి కూడా. కానీ పాలకుడు ప్రజా ఉద్యమాల నుంచి వచ్చినప్పుడు.. ప్రజాపక్షం అయినప్పుడు? పాటగాని పయనం ఎటువైపు సాగాలి?బలవంతంగా ప్రతిపక్షంలో ఉండటమే మేధావితనమా? పోనీ ప్రతిపక్షం గుంపులో ఉన్నదెవరు? ఉద్యమంలో రొమ్ము విరుచుకొని తెలంగాణ కోసం నిలబడ్డవాళ్లా? తెలంగాణ సృజనకారుల మదిని తొలుస్తున్న ప్రశ్నలివి. ఆటగాళ్లకు, పాటగాళ్లకు సందిగ్ధ కాలం ఇది. సంధికాలం ఇది. గొంగళి పురుగు రూపాంతరం చెంది సీతాకొక చిలుకైతదని మనకు తెలుసు. కానీ, మన కంటికి కనిపించే మనోహర రూపాని కంటే ముందే అది మరో 13 సార్లు ప్రసవయాతన అనుభవిస్తుంది. ఇప్పుడు తెలంగాణ కవులు, కళాకారులు అనుభవిస్తున్న పరిస్థితి ఇదే.
ఏపూరి సోమన్న జెండా మార్చిండు. కానీ, పంథా మార్చలేదు. తన బలమే పాట. పాటే ఆయన పంథా. రాజ్యహింస జరిగినప్పుడు గొంతెత్తిన ఆ గాయకుడు ఇప్పుడు మరో రూపంలోకి మారాడు. దీనికి ఎందుకింత రాద్ధాంతం. గోరటి వెంకన్నకు ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు ఇదే రాద్ధాంతం. వేదికల మీద ఇప్పటికీ నిప్పులు పోసుకుంటున్నవాళ్లను చూస్తున్నాం. వెంకన్నను దగ్గరి నుంచి గమనిస్తే..! రాజ్యం.. విప్లవం.. విముక్తం.. కొలువులు.. కొట్లాటల మార్మికం లోతు పాతులు తెలియని బైరాగిలా కనిపిస్తడు. సరే..! బైరాగో… విరాగో.. కానీ అతను ఈ దేశ సాహిత్య సంపద. జాతి స్పృహ ఉన్న బహుజన కవి, గాయకుడు. ఆయనకు చట్టసభలో ఇంత చోటు దొరికితే.. కడుపు మంటతో రగిలిపోవటమెందుకు? వెంకన్నకు దక్కిన గౌరవం సాహిత్య లోకానికి జరిగిన సన్మానం కిందికి రాదా? అది సృజనకారులకు గర్వకారణం కాదా? ఉత్పత్తి జాతులు కట్టుబానిసలుగా.. కట్టప్పలుగానే రాజ్యాధికారానికి ఆవల ఉండాలనే మానసిక భావనను నూరిపోస్తున్నదెవరు?
ఇక్కడో సందర్భాన్ని గుర్తుచేయాలి. ఏపూరి సోమన్న ఊరు మా ఊరుకు రెండు ఆమడల దూరం. మాది కర్విరాల కొత్తగూడెం. ఆయనది వెలిశాల. ఒక్కటే నియోజకవర్గం. ఇక్కడ బతకాలంటే బండైనా కొట్టాలి. హత్యలైనా చేయాలి. రాయలసీమను మించిన ఫ్యాక్షనిజం తుంగతుర్తి పల్లెల్లో ఉండేది. ఎదిగిన పోరలకు పనులు దొరక్క రాజకీయ గ్రూపుల్లో చేరి కత్తి పట్టేటోళ్లు. బీడు భూముల్లో నెత్తుర్లు పారించేది. తెలంగాణ సాయుధ పోరాట కాలం నుంచి.. కర్విరాల కొత్తగూడెంలో బచ్చు వెంకటేశ్వర్లు రాజకీయ హత్య వరకు ఇక్కడి నేల ప్రతి ఇంచు నెత్తురుతోనే తడిసింది. కొత్తగూడెం, గుమ్మడవెల్లి, కుక్కడం, అన్నారం కుంటపల్లి, సంగెం మొదలగు ఏటివతలి గ్రామాల్లో నిత్య హత్యలు జరిగేవి.
తెలంగాణ సిద్ధించిన తర్వాత గోదావరి పంట చేల వైపు మళ్లింది. మిషన్ కాకతీయతో ఊరూరా చెరువులు నిండిన యి. ప్రతి మడి తడిసింది. పల్లె పచ్చబడ్డది. బీడు పండింది. కరువు తీరింది. మలితరం పిల్లలు బడిబాట పట్టిండ్రు. హత్యలు ఆగిపోయినయి. సుఖశాంతులు వెల్లివిరుస్తున్నయి. ఇంతకు మించిన గొప్ప విప్లవం ఇంకేం ఉంటుంది. ఒక్క సోమన్న ఏమిటి? బుద్ధి జీవులంతా ఇటువంటి అద్భుతమైన ప్రగతికి ప్రణమిల్లాల్సిందే కదా? తలపాగ రంగురాళ్లెప్పుడూ గాయకున్ని ప్రభావితం చేయజాలవు. మిడిమేళపు లోకులు విసిరేరాళ్లు కూడా మనోధైర్యాన్ని దెబ్బతీయలేవు. మతోన్మాదం బలవంతంగా మీద పడి తరుముతున్న వేళ, దాన్ని ఆపటానికి ప్రగతిశీల సృజనశక్తుల పునరేకీకరణ జరుగుతున్నది. ఇప్పుడది చారిత్రక అవసరం. మనస్ఫూర్తిగా ఆహ్వానిద్దాం.
(వ్యాసకర్త: రచయిత, మీడియా కో ఆర్డినేటర్, ఏపీ)
-వర్ధెల్లి వెంకటేశ్వర్లు
79892 38178