Acne | వేసవికాలంలో చెమట, తేమ, కాలుష్యం, సన్స్క్రీన్ వాడకం వంటి కారణాల వల్ల చర్మం జిడ్డుగా మారడం సహజమే. ఈ సమయంలో చాలామందికి మొటిమలు, చర్మంపై చిన్న చిన్న దద్దుర్లు కనిపించడం మొదలవుతుంది. దీంతో ముఖాన్ని తరచూ కడుక్కోవడం ద్వారా చర్మం శుభ్రంగా ఉంటుందని భావిస్తారు. అయితే ముఖాన్ని అతిగా శుభ్రం చేయడం కూడా మొటిమలకు కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖాన్ని శుభ్రం చేయడం చర్మ సంరక్షణలో ముఖ్యమైన భాగమే అయినప్పటికీ, దాన్ని తప్పు పద్ధతిలో చేయడం వల్ల చర్మం సహజ రక్షణ పొర దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. దీంతో చర్మంలో బ్యాక్టీరియా పెరగడం, అధికంగా ఆయిల్ ఉత్పత్తి కావడం వంటి సమస్యలు తలెత్తి మొటిమలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
ముఖాన్ని రోజుకు రెండు సార్లకు మించి కడుక్కోవడం సాధారణంగా అవసరం ఉండదు. ఎక్కువసార్లు ఫేస్వాష్ ఉపయోగించడం వల్ల చర్మంలోని సహజ నూనెలు తొలగిపోతాయి. ఫలితంగా చర్మం మరింత ఆయిల్ ను ఉత్పత్తి చేసి మొటిమల సమస్యను పెంచుతుంది. మధ్యాహ్నం సమయంలో ముఖం తాజాగా అనిపించాలంటే నీటి మిస్ట్ లేదా ఆయిల్ బ్లోటింగ్ పేపర్లను ఉపయోగించడం మంచిది. వేసవికాలంలో డీప్ క్లీనింగ్ పేరుతో మార్కెట్లో లభించే కొన్ని సబ్బులు, ఫేస్వాష్లు చర్మానికి హానికరంగా మారుతాయి. ఇవి అధిక ఆల్కలైన్ స్వభావం కలిగి ఉండటంతో చర్మం సహజంగా కలిగి ఉండే రక్షణ పొరను దెబ్బతీస్తాయి. చర్మం సాధారణంగా స్వల్ప ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది. అందువల్ల పీహెచ్ 5.5 సమతుల్యతను కాపాడే, సబ్బు రహిత క్లెన్సర్లను ఉపయోగించడం మంచిది. చాలామంది ముఖంపై ఉన్న ఆయిల్ పూర్తిగా తొలగిపోతుందనే ఉద్దేశంతో వేడి నీటితో ముఖాన్ని కడుక్కుంటారు. అయితే ఇది రక్తనాళాలను విస్తరింపజేసి ఇప్పటికే ఉన్న మొటిమలను మరింతగా మంటపెట్టే అవకాశం ఉంటుంది. వేడి నీరు చర్మాన్ని అధికంగా పొడిబార్చి రక్షణ పొరను దెబ్బతీస్తుంది. అందుకే గోరువెచ్చని లేదా చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవడం ఉత్తమం.
మొటిమలు వచ్చినప్పుడు చర్మంలోని మురికి తొలగిపోతుందని భావించి గరుకుగా ఉండే స్క్రబ్లను బలంగా రుద్దడం కూడా చాలామంది చేసే పొరపాటు. ఈ రాపిడి కారణంగా చర్మంలో మంట పెరిగి మొటిమలు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే బ్యాక్టీరియా ముఖంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే తగిన ఎక్స్ఫోలియేషన్ చేయడం సరిపోతుంది. ముఖం కడిగిన తర్వాత మాయిశ్చరైజర్ ఉపయోగించాల్సిన అవసరం లేదని, ముఖ్యంగా జిడ్డు చర్మం ఉన్నవారు భావిస్తుంటారు. కానీ ఇది కూడా చర్మ ఆరోగ్యానికి హానికరం. ముఖం కడిగిన తర్వాత చర్మం తాత్కాలికంగా తన సహజ సమతుల్యతను కోల్పోతుంది. ఈ సమయంలో తేలికపాటి జెల్ ఆధారిత మాయిశ్చరైజర్ ను ఉపయోగించడం ద్వారా చర్మ రక్షణ పొరను కాపాడుకోవచ్చు. ఇది చర్మ తేమను నిలుపుకోవడంతోపాటు మొటిమల సమస్యను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. వేసవిలో చర్మ సంరక్షణ కోసం అతిగా శుభ్రం చేయడం కంటే సరైన పద్ధతులను అనుసరించడం ముఖ్యం. చర్మానికి అనుకూలమైన క్లెన్సర్, తగిన మాయిశ్చరైజర్, మితమైన శుభ్రత అలవాట్లు పాటించడం ద్వారా మొటిమల సమస్యను నియంత్రించుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.