బీఆర్ఎస్ వంటి ఫిలాసఫీ గల పార్టీకి ఎప్పుడైనా సామాన్య ప్రజలే మిత్రులు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఈ నెల ఒకటిన కొల్హాపూర్లో మాట్లాడుతూ తాము ‘ఇండియా’, ఎన్డీయేలలో దేనివైపూ లేమని, తమ మిత్రులు తమకున్నారని అన్నారు. ఆ మిత్రులలో ఏవైనా పార్టీలు కూడా ఉన్నాయా అనేది అట్లుంచి, బీఆర్ఎస్ వంటి ఆలోచనలు, లక్ష్యాలు గల పార్టీకి ప్రధానంగా ఉండగల మిత్రులు అశేషమైన జన సామాన్యమే. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లలో స్పందనలు వస్తున్నది ఏయే తరగతుల నుంచి అన్నది గమనించినప్పుడు ఇది స్పష్టమవుతుంది. ఇందుకు సంబంధించిన వార్తలు కొద్ది నెలలుగా వెలువడుతున్నాయి.
ముఖ్యంగా మహారాష్ట్రకు చెందినవారు స్వయంగా హైదరాబాద్ వరకు ప్రయాణించి వచ్చి, లేదా కేసీఆర్ తమ రాష్ట్రంలో పర్యటించినప్పుడు బీఆర్ఎస్లో చేరటమన్నది ఇంచుమించు నిత్యకృత్యమైపోయింది. అట్లా చేరినవారే ఇప్పటికి కొన్ని వేల మంది ఉన్నారు. అక్కడ జరిగిన కేసీఆర్ సభలకు హాజరైనవారు ఇంకా అనేక వేలున్నారు. ప్రస్తుతం సాగుతున్న పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో రాష్ట్రమంతటా కలిపి చేరినవారు ఇప్పటికే 14 లక్షలకు పైగా ఉన్నారు. ఇదంతా కేవలం కొద్దినెలల కాలంలో. యథాతథంగానే ఇదొక అసాధారణ పరిణామం. పైగా ఒక పొరుగు రాష్ట్రపు, వేరే భాషకు చెందిన, ప్రాంతీయ పార్టీ నాయకుడు ఇటువంటి చొరవ తీసుకున్నప్పుడు. ప్రాంతీయ పార్టీల నేతలు జాతీయ పార్టీలను ప్రకటించటం, ఇతర రాష్ర్టాలకు విస్తరించేందుకు ప్రయత్నించటం గతంలోనూ జరిగింది. కానీ, వారికి జన సామా న్యం నుంచి క్షేత్రస్థాయి స్పందనలు ఈ తీరున రావటమన్నది గతంలో ఎన్నడూ, ఎవరి విషయంలోనూ జరగలేదు. గమనించవలసిన విషయం మరొకటి ఉంది. అది చాలా కీలకమైనది. ఒక తమిళపార్టీకి ఇతర రాష్ర్టాలలోని తమిళుల నుంచి, లేదా కులం పార్టీకి ఇతర రాష్ర్టాలలోని అదే కులం వారి నుంచి స్పందనలు వచ్చి ఉండవచ్చు. అట్లానే జరిగింది కూడా.
కానీ బీఆర్ఎస్ విషయంలో జరుగుతున్నది అది కాదు. ఎంతమాత్రం కాదు. ఇవి భాషా ప్రాతిపదికలు, కుల-మత ప్రాతిపదికల స్పందనలు కావు. లక్ష్యాలు, ఆలోచనలు, దార్శనికతలు, సిద్ధాంతం ఇందుకు ప్రాతిపదికలు. ఇట్లా జరగటం లోగడ లేదు. చేరికలపై వెలువడుతున్న వార్తలను సాకల్యంగా చదివే ఎవరికైనా ఈ మాట అర్థమవుతుంది. చేరేవారి మాటలను గమనిస్తే స్పష్టమవుతుంది. అట్లాగే, చేరుతున్న వారి పేర్లను గమనిస్తే వారిలో 95 శాతానికి తగ్గకుండా అత్యధికులు మహారాష్ట్రీయులని కనిపిస్తుంది. 14 లక్షలు దాటిన సభ్యత్వాల్లోకి వెళ్తే అది బహుశా 99 శాతం అవుతుంది. బీఆర్ఎస్ను మహారాష్ట్రలోకి విస్తరించటం మొదలుపెట్టినప్పుడు కొందరు, అదంతా సరిహద్దు ప్రాంతాలలో స్థిరపడిన తెలంగాణవారికి పరిమితమైన విస్తరణ అంటూ కొట్టివేశారు. కానీ అది ఆ తొలిదశలోనూ పూర్తి నిజం కాదు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమాల వార్తలు కొంతకాలంగా మహరాష్ట్రవ్యాప్తంగా నోటిమాట ద్వారా ప్రచారమవుతున్నాయి. ప్రచారం మహారాష్ట్రీయులైన రైతులు, ఇతర గ్రామీణులు, పట్టణ వాసులైన ప్రజలందరిలోనూ జరుగుతూ వస్తున్నదే తప్ప, తెలుగువారికి పరిమితమై కాదు. తార్కికంగా చూసినా అదట్లా ఉండదు. పైన అన్నట్టు, పార్టీలో చేరుతున్న వారి పేర్లను గమనించినా, అంతకన్న ఎక్కువగా, మహారాష్ట్రలో జరిగిన కేసీఆర్ సభలలో పాల్గొంటూ వస్తున్న స్త్రీ, పురుష జన సందోహపు కట్టుబొట్టు తీరును చూసినా ఈ విషయమై ఎటువంటి సంశయాలకు ఆస్కారమే ఉండదు.
ఇది అనుకున్న తర్వాత మరొక రెండు ముఖ్యమైన విషయాలను చెప్పుకోవాలి. ఒకటి, బీఆర్ఎస్ పట్ల ఇంత స్పందిస్తున్న వారి సామాజిక, ఆర్థిక నేపథ్యాలు ఏమిటి అనేది కాగా, రెండవది వారెందుకు ఇంత పెద్ద ఎత్తున, ఇంత వేగంగా స్పందిస్తున్నారన్నది. పైన జరిపిన చర్చతో పాటు ఈ రెండు విషయాలను కూడా చూసినప్పుడు కానీ మనకు బీఆర్ఎస్ పట్ల సామాన్య జనం ఇతర రాష్ర్టాల్లోనూ ఎందుకు ఆకర్షితులవుతున్నారు, పార్టీల మాట ఎట్లున్నా ఆ ప్రజలే బీఆర్ఎస్కు ఎందువల్ల మిత్రులు అనే విషయం బోధపడదు.
బీఆర్ఎస్ పట్ల ఇంతగా స్పందిస్తున్న వారిలో పట్టణవాసుల కన్నా గ్రామీణులు ఇంకా ఎక్కువగా ఉన్నారు. రైతులు, గ్రామీణ ఆర్థికవ్యవస్థపై ఆధారపడిన వివిధ వృత్తులవారు, ఈ కుటుంబాలకు చెందిన స్త్రీలు, యువతీ యువకులు, చిన్న వ్యాపారులు, దళిత బహుజనులు, అల్పసంఖ్యాక వర్గాల వారు, సంక్షేమ చర్యలు అవసరమయ్యే వర్గాల వారు సభలకు హాజరవుతున్నారు, పార్టీ సభ్యత్వాలు తీసుకుంటున్నారు. ఇందులో పై నుంచి కిందివరకు అన్నికులాల వారు, వేర్వేరు మతాల వారున్నారు. విశేషమేమంటే కాంగ్రె స్, ఎన్సీపీ, బీజేపీ, శివసేన వంటి అన్ని పార్టీల వారు చేరుతున్నారు. వివిధ పదవుల్లో ఉన్నవారు, చట్టసభల సభ్యులుగా పనిచేసినవారు కూడా. మరొక విశేషం ప్రముఖమైన రైతుసంఘాలు, కార్మిక, శ్రామిక సంఘా లు, సామాజిక ఉద్యమాలు, ఆదివాసీ ఉద్యమ సంస్థ లు, వృత్తిపరమైన సంఘాలు, రచయితలు, కవులు, కళాకారులు, పాత్రికేయులు, మేధావులు, ప్రొఫెసర్లు, వైద్యులు తదితరులు అనేకులు ఇందులో ఉన్నారు. జరుగుతున్న దానితో విసుగెత్తిన పారిశ్రామికులు, వ్యాపారవర్గాల వారు కూడా.
బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో అడుగు పెడుతూనే వీరందరూ ఇంత విస్తృతంగా, ఇంతవేగంగా స్పందించటానికి మొదటి కారణం, వారు అప్పటికే తెలంగాణ అభివృద్ధి, సంక్షేమాల గురించి విని ఉండటం. పలువురు స్వయంగా వాటిని చూసి ఉండటం. రెండవది తమ రాష్ట్రంలో తరతరాలుగా ఎంతో ఆశించినప్పటికీ అన్నిపార్టీల ప్రభుత్వాలు విఫలమై తమ పరిస్థితి దయనీయంగా మిగలటం. భవిష్యత్తు వైపు చూసినా ఆశలు లేకపోవటం. మూడవది, ప్రజల స్థితిగతులపై, దేశ భవితవ్యంపై, సమస్యలకు పరిష్కారాలపై, లక్ష్యాలపై, దేశంలో గల వనరులూ వాటి వినియోగంపై, సమస్త ప్రజా వర్గాల అభివృద్ధిపై, వారి భాగస్వామ్యాలపై కేసీఆర్ గణాంక వివరాలతో సహా తన అనర్గళ ప్రసంగాలలో, అతి సామాన్యునికి సైతం బోధపడేలా, చేస్తున్న ప్రసంగాలు, వాటితో పాటు ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అంటూ ఇస్తున్న బలమైన నినాదం. వెరసి ఆయన స్ఫూర్తిదాయకమైన దార్శనికత.
ఇవన్నీ కలిపి బీఆర్ఎస్ ఫిలాసఫీ అవుతున్నది. ఆ పార్టీ ఆలోచనలు, లక్ష్యాలవుతున్నాయి. దార్శనికత అవుతున్నది. ఇవి సమస్తం జన సామాన్యానికి సంబంధించినవి. ఈ విషయం మహారాష్ట్రలో ప్రజల సునిశిత దృష్టికి సుదీర్ఘకాల అనుభవ నేపథ్యానికి స్పష్టంగా, వేగంగా అర్థమవుతున్నది. కనుక వారు బీఆర్ఎస్ మిత్రులుగా మారుతున్నారు. ఈ మార్పు పొరుగున గల మధ్యప్రదేశ్కు వ్యాపించటం ఇప్పటికే మొదలైంది. క్రమంగా ఇతరపార్టీలు ఏంచేసినా, చేయకున్నా, ప్రజ లు బీఆర్ఎస్ మిత్రులుగా సమీకృతమవుతారు.
-టంకశాల అశోక్