హైదరాబాద్, జూన్ 10(నమస్తే తెలంగాణ): ఓ ప్రభుత్వ అధికారి నిబద్ధత రూ.వెయ్యి కోట్ల విలువైన 15ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది. ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా పనిచేస్తే ఫలితం ఎలా ఉంటుందో నిరూపించింది. నాడు సదరు ఆర్డీవో సమర్పించిన ఆధారాలే నేడు ప్రభుత్వానికి అనుకూల తీర్పు వచ్చేలా చే శాయి. మంగళవారం ఖానామెట్ భూములపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నది. నాటి ఆర్డీవో సమర్పించిన ఆధారా లే నేడు ప్రభుత్వానికి అనుకూల తీర్పు వచ్చేలా చేశాయి. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా రా జేంద్రనగర్ మండలం ఖానామెట్లో సుమారు రూ.వెయ్యి కోట్ల విలువైన 15 ఎకరాల ప్రభుత్వ భూమిని కొల్లగొట్టేందుకు ఇట్టినా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కుట్ర పన్నింది. మాజీ సైనికుల కోటా కింద 1963లో ప్రభుత్వం కేటాయించిన ఈ స్థలాన్ని తాము 2006లోనే కొనుగోలు చేశామని కంపెనీ వాదించింది. దీనిపై హై కోర్టులో కేసు ఫైల్ కాగా విచారణ జరిగింది.
ఈ విచారణ సందర్భంగా నాడు రాజేంద్రనగర్ ఆర్డీవోగా పని చేసిన సురేశ్ పోద్దాటి ఈ కేసులో ప్ర భుత్వం తరఫున పిటిషన్ దాఖలు చేశారు. ఇట్టి నా ప్రాపర్టీస్ కంపెనీ చూపిస్తున్న డాక్యుమెంట్లన్నీ నకిలీవని, ఈ భూములపై ఆ సంస్థకు ఎలాంటి హక్కులేదని పక్కా ఆధారాలు సహా ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఇందుకు సంబంధించిన విషయాలను నాటి ఏజీకి సైతం వివరించారు. అయితే, ఆ సమయంలో ఆధారాలను చేరిపేసేందుకు ఆయనపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని, ఆయనను కొనుగోలు చేసేందుకు సైతం తీవ్రంగా ప్రయత్నించినట్టు తెలిసింది. అయినప్పటికీ ఎలాంటి బెదిరింపులు, ప్రలోభాలకు లొంగకుండా నాటి ఆర్డీవో సురేశ్ కోర్టుకు ఆధారాలు అందజేశారు. వాటి ఆధారంగా కేసు విచారణ జరుగగా అసలు ఆ భూమిని ప్రభుత్వం మాజీ సైనికులకు కేటాయించలేదని తేలింది. అదేవిధంగా ఈ భూమికి సంబంధించి తమకు 1972, 1973లో పట్టా అయినట్టు సంస్థ పేర్కొన్నది. రాజేంద్రనగర్ తహసీల్దార్ కార్యాలయం 1978లో ఏర్పాటైతే కంపెనీకి 1972లో ఎలా పట్టా వస్తుంది? అని హైకోర్టు ప్రశ్నించింది. వీటన్నింటినీ పరిశీలించి కంపెనీ సమర్పించిన పత్రాలన్నీ నకిలీవని, ఆ భూమి ప్రభుత్వానికే చెందుతుందని తీర్పు ఇచ్చింది. నాటి ఆర్డీవో కృషి రూ.వెయ్యి కోట్ల విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడగలిగింది.