Professor Jayashankar sir | తెలంగాణ మాడల్ ఇప్పుడు భారతదేశ డిమాండ్. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ ఆత్మ సంతృప్తదశకు చేరుకున్న సందర్భం. అవును. నిజం. తెలంగాణను పలవరించి..కలవరించి జీవితాంతం తెలంగాణే శ్వాసగా బతికిన మహనీయుడు జయశంకర్ సార్.
రాజకీయంగా.. ఆర్థికంగా తెలంగాణ కన్నా గొప్పవనుకున్న అనేక రాష్ర్టాలు ఇవ్వాళ తెలంగాణను అనుసరించాలని ఆరాట పడుతున్నాయి. ఆయన బతికుంటే ఇది చూసి ఎంతో సం తోషించేవారు. మహారాష్ట్ర.. మధ్యప్రదేశ్.. ఒడి శా..కేరళ.. ఢిల్లీ.. పంజాబ్ ఇలా ఒకటేమిటి అనేక రాష్ర్టాలు తెలంగాణ తరహానే కలలుగంటున్నాయి. తెలంగాణలోని మానవీయ పురోగతి.. భౌగోళిక వాస్తవికత పురోగతిని చూసి భారతదేశం అబ్బురపడుతున్నది.
మలిదశ తెలంగాణ ఉద్యమం పురుడుపోసుకొని ఉధృతంగా సాగుతున్నదశలో ప్రత్యేక రాష్ట్రం ఆవశ్యకత..భవిష్యత్ చిత్రణపై అనేక అనుమానాలు ముసురుకున్నాయి. ఈ నేపథ్యంలో జయశంకర్ సార్ 2004లో ‘తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్’ అన్న పుస్తకాన్ని వెలువరించారు. తెలంగాణకు దశాబ్దాలుగా జరిగిన..జరుగుతున్న అన్యాయాన్ని, వివక్షను ఆ పుస్తకంలో సోదాహరణంగా వారు వివరించారు. ఆయా రంగాల్లో జరిగిన అన్యాయం, పాలకుల దుర్నీతి, రాజకీయ పార్టీల జిత్తులమారితనం, సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణను పాలకులు, పార్టీలు తమ అవసరాలకు ఏ రకంగా వాడుకున్నాయో జయశంకర్సార్ అక్షరబద్ధం చేశారు. తెలంగాణ రాష్ట్రం కల సాకారమైన 2014 జూన్ 2 నుంచి ఇప్పటిదాకా ఆయా రంగాల్లో సాధించిన పురోగతి ఇవ్వాళ దేశానికే ఆదర్శంగా నిలిచింది.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే అభివృద్ధి కుంటుపడుతుందని, కరెంట్ సమస్య తీవ్రంగా వేధిస్తుందని, పాలనాపరంగా తెలంగాణ వయబుల్ కాదని, అన్ని ంటికన్నా ముఖ్యంగా నక్సలైట్ సమస్య తీవ్రరూపం దాలుస్తుందని ఇలా అనేకానేక సూత్రీకరణలతో ప్ర త్యేకరాష్ట్ర డిమాండ్ను అవహేళన చేశారు. ఆ సమయంలో జయశంకర్ సార్ అవన్నీ అభూతకల్పన లేనని ఆధారసహితంగా ‘తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్’ పుస్తకంలో రుజువు చేశారు. తెలంగాణ రా ష్ట్రం ఆవిర్భవిస్తే దేశంలో 25 రాష్ర్టాల కంటే చాలా పెద్ద రాష్ట్రం అవుతుంది. తెలంగాణ కంటే చిన్నగా ఉన్న రాష్ట్రాల వల్ల దేశ సమగ్రతకు భంగం కలుగనప్పుడు, వాటన్నింటి కంటే పెద్ద రాష్ట్రంగా ఉండే తెలంగాణ వల్ల ఎటువంటి ప్రమాదం ఉండ దు. రాబోదు’ అని ఆయన కుండబద్దలు కొట్టారు. జయశంకర్ సార్ చేసిన విశ్లేషణను ఉద్యమనాయకుడు, సీఎం కేసీఆర్ గడచిన తొమ్మిదేండ్లుగా దేశం లో సుపరిపాలనకు కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతున్నారు. 2014 జూన్ 1 దాకా బాధిత.. బంధిత తెలంగాణగా ఉన్న స్థితి నుంచి దేశానికి బాధ్యతాయు త రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారు. ఫలితంగానే ఇవ్వాళ తెలంగాణ ప్రగతి దేశానికి నమూనాగా నిలిచింది.
తెలంగాణ సంపదను తమ వినియోగవస్తువుగా మార్చుకున్న శక్తుల నుంచి ఈ ప్రాంతాన్ని విముక్తం చేసి.. వికసిత తెలంగాణగా మార్చి జయశంకర్ సార్ ఆలోచనలను అక్షరసత్యం చేసిన ఉద్యమకారుడిగా కేసీఆర్ సగర్వంగా నిలుచున్నారు. తన దార్శనిక దృష్టికోణంలో భవిష్యత్ భారతానికి తెలంగాణను కేసీఆర్ దిక్సూచిగా మార్చారనటంలో సందేహం లేదు. బాధిత తెలంగాణను బాధ్యతాయుత తెలంగాణగా తీర్చిదిద్దడానికి గడచిన 9 ఏండ్లుగా కేసీఆర్ కృషి చేస్తున్నారు. ‘స్వీయరాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష’ అని తలపోసిన జయశంకర్ సార్ ఆలోచనల సారాన్ని ఒంటబట్టించుకొన్న తెలంగాణ ఆ మూలసూత్రం నుంచి విడివడలేదు. తెలంగాణ సమాజానికున్న చైతన్యానికి ఇది ప్రతిరూపం.
‘పరిపాలించుకోవటం చేతకాదు’ అని ఈసడించినవాళ్లే ఈర్ష్యపడేలా తెలంగాణ తనను తాను నిరూపించుకున్నది. ఈ ప్రాంత ప్రయోజనాలే పరమావధిగా రాష్ట్రంలో పాలన సాగుతున్నది.
జిల్లాలు, రెవెన్యూడివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీలను పెంచుకొన్నది. ఇలాఅనేక సంస్కరణలు తెచ్చి ప్రజల పరిపాలన అనే కొత్త చరిత్రకు తెలంగాణ నాంది పలికింది. తాగునీరు, సాగునీరు లేక పంట లు ఎండిన దుస్థితి నుంచి అనతికాలంలోనే తెలంగాణ బయటపడింది. ఇంటింటికీ శుద్ధిచేసిన స్వచ్ఛమైన తాగునీటిని నూటికి నూరుశాతం అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ దేశానికి నమూనాగా నిలిచింది. ‘లిఫ్టింగ్ ఎ రివర్’గా ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా కాళేశ్వరం తెలంగాణ ఖలేజాను లోకానికి చాటింది. తెలంగాణలో కొనసాగిన పోరాటాల వల్ల ఇక్కడి ప్రజల్లో చైతన్యం ఎక్కువ. స్వరాష్ట్రంలో అన్నివర్గాల ఆత్మగౌరవమే తన ఆత్మగౌరవంగా తెలంగాణ భావించింది. అందు లో భాగంగానే తెలంగాణలోని సబ్బండ వర్గాల సమ్మిళిత.. సమీకృత.. సమగ్ర మేళవింపుగా సాగుతున్నది. ఇప్పుడు భారత్ తెలంగాణను కలగంటున్నది. ఈనాడు జయశంకర్ సార్ ఉంటే ఎంతో సంతోషించేవారు. ఆయన కలలుగన్న సంపూర్ణ వికాసం వైపు కేసీఆర్ తెలంగాణను నడిపిస్తున్నారు. జయహో జయశంకరా… జయహో.. జనశంకరా!
-నూర శ్రీనివాస్
91827 77011