నేడు ప్రపంచ వృద్ధుల దినోత్సవం
ఒకప్పుడు వ్యక్తిగత సమస్యగా ఉన్న వృద్ధుల సంక్షేమం ఇప్పుడు సమాజ, ప్రభుత్వ బాధ్యతగా మారింది. వారికి ఆర్థిక భరోసా అవసరమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం బాధ్యతగా వారికి ఆసరా పింఛన్లు అందిస్తున్నది. వారి ఆరోగ్యం కోసం బస్తీ, పల్లె దవాఖానల్లో తగిన వైద్య సౌకర్యాలను కల్పిస్తున్నది. ఈ కారణంగానే తొలుసూరు బిడ్డ కేసీఆర్ అండగా ఉన్నాడు కదా అన్న భరోసా చాలామంది వృద్ధుల్లో కనిపిస్తున్నది.
వృద్ధాప్యాన్ని రెండో బాల్యం అంటా రు. పెద్దవారిని కూడా చిన్నపిల్లల మాదిరిగానే చూసుకోవాల్సి ఉంటుంది. ఆహారం, ఆరోగ్యంతో పాటు అన్నింట్లోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతుండటం, ఉపాధి కోసం సంతానం దూర ప్రాంతాలకు వెళ్తుండటంతో అవసాన దశలో వారికి కష్టాలు ఎదురవుతున్నాయి. వారి సమస్యలను వివరిస్తూ ఎంతో సాహిత్యం వస్తున్నది. ఇవన్నీ సమాజంలోని వాస్తవాలకు అద్దం పడుతున్నాయి. విరివిగా వృద్ధాశ్రమాలను ఏర్పాటుచేయాలన్న డిమాండ్లు వస్తున్నాయి. స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్రంగంలో ఏర్పాటయ్యే వృద్ధాశ్రమాల సంగతి సరే సరి. ఈ నేపథ్యంలోనే వృద్ధుల సమస్యలు ప్రత్యేకమైనవని, వాటిని పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నదన్న భావనలు నెలకొన్నాయి.
తెలంగాణకు వస్తే ఈ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరిస్తున్న ది. సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్నది. ఈ కారణంగానే తొలుసూరు బిడ్డ కేసీఆర్ అండగా ఉన్నాడు కదా అన్న భరోసా చాలామంది వృద్ధుల్లో ఉన్నది. ఇంటికి పెద్దగా ఉం టూ ఆదుకుంటున్నాడు కదా అని ఎంతో మంది భావిస్తున్నారు. దీనంతటికీ మూలం ఆసరా పింఛన్లు, వృద్ధుల ఆరోగ్యంపై సర్కా రు చూపుతున్న శ్రద్ధే. వయసు మళ్లిన తర్వా త వ్యక్తిగత అవసరాలు, కోరికలు తగ్గిపోతా యి. పిడికెడన్నం తింటే కడుపు నిండినట్టవుతుంది. ఏదో అంత నోట్లో వేసుకోవడం తప్పి స్తే పుష్టిగా మూడుపూటలా తిని అరాయించుకునే పరిస్థితి ఎక్కడిది? అయితే ఇంత అన్నం కూడా దొరకని అభాగ్యులు ఎందరో. ఇందుకు కారణాలు ఎన్నెన్నో. కొందరి పిల్లల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఏమీ వెనకేసుకోలేక కొందరు వృద్ధులు ఒకరిపైన ఆధారపడాల్సి వస్తున్నది. ఈ క్రమంలో మాటలు పడ్డవారు, అవమానాలకు గురైనవారు ఎం దరో. చిన్న చిన్న అవసరాలకు కూడా చేయి చాపాల్సిన పరిస్థితి.
ఈ పరిస్థితి నుంచి వారిని బయట పడేయడానికి కేసీఆర్ సర్కారు ఆసరా పథకం అమలుచేస్తున్నది.
ప్రతి నెలా వృద్ధులకు రూ.2,016 పింఛన్ ఠంచన్గా అందిస్తున్నది. ఇది వారికి ఎంతో భరోసా ఇస్తున్నది. చేతిలో డబ్బులుంటే ఆ ధీమానే వేరు. ఏమైనా కొనుక్కోమ ని మనుమడో, మనుమరాలికో ఐదో, పదో ఇవ్వొచ్చు. తినాలనిపించినప్పుడు పండో, కాయో కొనుక్కోవచ్చు.
సొమ్ము లేక చిన్న కోరికలను కూడా చంపుకోవాల్సిన అవసరం లేదు. ముసలితనంలో కూడా ఆనందంగా గడపొచ్చు. ఇలాంటి చికాకులు తప్పినందునే కేసీఆర్ అంటే వృద్ధులకు అంత ప్రేమ. రాష్ట్రంలో సుమారుగా 15.82 లక్షల మంది వృద్ధులకు పింఛన్ అందుతున్న ది. దరఖాస్తు విధానం కూడా సులభతరమైం ది. ఎలాంటి రుసుములు చెల్లించకుండా మీ-సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం పింఛనులో కేంద్రం వాటా కేవలం రూ.200 మాత్రమే. మిగిలిన రూ.1,816 కేసీఆర్ సర్కారు ఇస్తున్నది.
ఎవరికి భారం కాకుండా జీవితం గడపాలన్నదే వృద్ధుల ప్రధాన కోరికగా ఉంటుంది. అయితే నిర్ణీత వ్యవధిలో బీపీ, షుగర్, ఇతర ఆరోగ్య పరీక్షలు చేయించుకోక తప్పదు. ఇవి చిన్నవిలా అనిపించినా కనిపించని ఖర్చులే. కొన్నిసార్లు అవి తలకుమించిన భారంలా మారుతాయి. కానీ పల్లె, బస్తీ దవాఖానల ఏర్పాటుతో ఆ సమస్య తీరినట్టే. అక్కడికివెళ్తే ఉచితంగానే ఈ పరీక్షలు చేస్తున్నారు. ప్రయాణ చార్జీలు తప్ప, ఇతరత్రా ఖర్చులు లేకపోవడం వృద్ధులకు పెద్ద ఊరట కలిగిస్తున్నది. దాదాపు 500 బస్తీ దవాఖానలు, సుమారు మూడు వేల పల్లె దవాఖానలతో పరిస్థితి మొత్తం మారిపోయిం ది. వృద్ధాప్యంలో కంటి పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. ఇందుకోసం కంటి వెలుగు పథకాన్ని అమలుచేయడంతో ఈ సౌకర్యం కూడా ఉచితంగానే అందుతున్నది. జిల్లాకొక ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటు చేయనుండటం వృద్ధులకు మరో మేలు కలిగించను న్నది. వీటికి అనుబంధంగా ఉన్న దవాఖానలో వృద్ధుల కోసం జిరియాట్రీషియన్లు ఉంటారు. ఇలా వృద్ధుల కోసం వైద్య నిపుణులను నియమించడం దేశంలోనే తొలిసారి అయ్యిండొచ్చు ఇది కూడా తెలంగాణ మాడల్లో భాగమయ్యే అవకాశం ఉన్నది.
వృద్ధాప్యంలో ఆసరాతో పాటు కొంత వ్యాపకం కూడా ఉండాలి. పల్లెటూళ్లలో అయి తే పెరటి తోటల పెంపకమో, ఒకటి, రెండు గొర్రె పిల్లలను మేపడమో, కోళ్లను పెంచడమో ఏదో ఒక రీతిలో కాలక్షేపం జరగాలి. ఇందుకు ప్రభుత్వం సాయమే అవసరం లేకుండా సొం తంగానూ సమకూర్చుకోవచ్చు. వృద్ధులను ఆదుకొనే బాధ్యత ఒక్క ప్రభుత్వానిదే కాదు, ఆయా కుటుంబాలు, మొత్తం సమాజానిది కూడా. మలి వయసులో వారికి కావాల్సింది నాలుగు మాటలు, కొన్ని ముచ్చట్లు.
ఊరిలోని గుడో, రచ్చబండో ఇందుకు వేదికైతే శేష జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వారు ఎవరి కీ భారం కారు. ఆ వయస్సులోనూ తమ వం తుగా ఏదో ఒక రీతిలో సమాజ ప్రగతికి దోహదపడగలరన్న నమ్మకం కలుగుతుంది. దాంతో సమాజానికి పునాది లాంటి కుటుం బవ్యవస్థ బలపడుతుంది.
(వ్యాసకర్త: కన్వీనర్, ఫోరమ్ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్)
గోసుల మల్లికాయాదవ్