కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి. అందులో మౌలికమైన అంశాల్లో తీసుకొచ్చిన మార్పులు. వాటి ప్రభావాలు. పరిణామాలు ఎట్లా ఉన్నాయో దేశ ప్రజల అనుభవంలోకి వచ్చింది. తనను ప్రశ్నించిన వారి విషయంలో ఎట్లా ఉంటున్నారో తాజాగా ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. మోదీ ప్రధాని అభ్యర్థిగా ప్రమోట్ అయిన సందర్భంలో, ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన మీడియాను పెద్దగా పట్టించుకోలేదు. అట్లా అని మీడియా పట్ల విరక్తని కాదు. దాని పట్ల బాగానే మమకారం ఉంటుంది. కాకపోతే పశ్నను ఆయన తట్టుకోలేరు అనేది పలు సందర్భాల్లో రుజువు అవుతూ వచ్చింది.
సీనియర్ జర్నలిస్ట్ కరణ్ థాపర్ కొన్నాళ్ల కింద మోదీని గుజరాత్ అల్లర్లకు సం బంధించిన ప్రశ్నలు వేసినప్పుడు కాలర్ మైక్ తీసేసి ఆయన వెళ్లిపోయిన విషయం ఇప్పటికీ చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఆ రోజు నుంచి నేటివరకు ఆయన నేరుగా మీడియాతో మాట్లాడిన సందర్భాలు ఇండియాలో దాదాపు లేవనే చెప్పొచ్చు. తాను ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో తను చెప్పాలనుకున్న విషయాలు విశదీకరించి మరీ చెప్తారు. తాను చెప్పాలనుకున్నది ఓకే కానీ, అడిగే ప్రశ్నలకు జవాబులు కావాలంటే ఎలా? ఇది అనేక మంది జర్నలిస్టులకు ప్రశ్నగానే మిగిలింది. పాలసీకి సంబంధించిన ప్రశ్నల గురించిన ప్రస్తావన మోదీ వినరు. ఎవ్వరినీ వేయనీయరు. ఆ అవకాశమే ఎవ్వరికీ ఇవ్వరు. అందుకే ఇండియాలో ప్రధానమంత్రి కార్యాలయం కా నీ, నెలవారి రిపోర్టుల గురించి ప్రస్తావన కానీ, ప్రభుత్వం సాధించిన ప్రగతి గురించి కానీ ఎక్క డా ఆయన నేరుగా మీడియాతో మాట్లాడలేదు. బహిరంగ సభల్లో మాట్లాడిన విషయాలనే మీడియా రాసుకోవాలి.
తొలిసారి మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఇండియాకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయి పై దాడి జరిగింది. మోదీని ఉద్దేశించి ఏర్పాటుచేసిన సభ గురించి చెప్తూ అక్కడున్నవారిని కొన్ని కీలక ప్రశ్నలు వేశారు. తాను కొంత విశ్లేషణ చేసే ప్రయత్నం చేశారు. అంతే మోదీ అభిమానులు కొందరు ఆయనపై దాడి చేయడం తెలిసిందే.
విదేశీ గడ్దపై స్వదేశీ జర్నలిస్టుపై దాడి గురించి మోదీ కానీ, బీజేపీ పెద్దలు కానీ అప్పట్లో పెద్దగా పట్టించుకోలేదు. అదేంటి మోదీని అక్కడికి వెళ్లి ప్రశ్నిస్తారా అనే సందేహాలను సైతం వ్యక్తం చేశా రు. ఆ తర్వాత ఆయన ఇబ్బందులు పడినట్టు కొన్ని సందర్భాల్లో తన ఆర్టికల్స్ ద్వారా తానే చెప్పుకొన్నారు. ఇండియాలో ఉన్న ఎన్డీటీవీ జర్నలిస్ట్ రవీష్కుమార్లాంటి ప్రశ్నించే జర్నలిస్టుల విషయంలో మోదీ ప్రభుత్వం తీరు ఎట్లా ఉందో తెలుసు. ఆ తర్వాత ఆయన ప్రధాన స్రవంతి మీడియాను వదిలేయాల్సి వచ్చింది. ఇట్లా ఏదో సందర్భంలో మోదీ వర్సెస్ మీడియా అనే చర్చ కొనసాగుతున్నది.
తాజాగా మోదీ అమెరికా పర్యటన సందర్భం గా భారత ప్రజాస్వామ్యం గురించి, అది ఫరిడవిల్లుతున్న తీరు గురించి మోదీ బాగా చెప్పారు. అమెరికా అధినేత బైడెన్, మోదీ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. వీరి భేటీకి సంబంధించిన ఫొటోలు ప్రపంచవ్యాప్త మీడియా దృష్టి ని బాగా ఆకర్షించాయి. వీటికంటే మరో అంశం అంతకుమించి ప్రపంచ మీడియా దృష్టిలో పడింది. అది మోదీని ప్రశ్నించిన జర్నలిస్టుకు వేధింపులకు సంబంధించింది. వాల్ స్ట్రీట్ జర్నలిస్ట్ సబ్రినా సిద్ధిఖీ సైబర్ వేధింపులకు గురవుతున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని వైట్హౌజ్ ఉన్నతాధికారి జాన్ కిర్బీ చెప్పారు. ఆమెపై మో దీ అభిమానులు విపరీతంగా ట్రోల్ చేశారని వైట్హౌజ్ వర్గాలు ప్రకటించడం శోచనీయం.
జర్నలిస్టులపై ఎప్పుడైనా, ఎక్కడైనా ఎలాంటి రకమైన దాడి జరిగినా ఖండించాల్సిందేనని ఇది ఇక్కడి మీడియాకు ఇచ్చే స్వేచ్ఛ అని అదే అమెరికా విధానమని కిర్బీ చెప్పారు. ప్రజాస్వామ్యం లో ఇలాంటి ధోరణి పనికిరాదని కూడా అన్నా రు. ఇంతకు సబ్రినా సిద్ధిఖీ ఏమన్నారు? భారత్లో ముస్లింలు, ఇతర మైనారిటీల పట్ల పక్షపా తం గురించి మీరేమంటారని, ఇండియాలో మై నారిటీల హక్కులను కాపాడేందుకు ప్రభు త్వం తీసుకుంటున్న చర్యలేమిటని ప్రశ్నించారు. దీని కి మోదీ ఈ ప్రశ్నే తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. అందరికీ అభివృద్ధి ఫలాలు ఒకే రీతి లో అందుతున్నాయని, ఎలాంటి పక్షపాతం ఉండదన్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ, ఆ తర్వాత ప్రశ్న వేసిన పాపానికి ఆమెకు వేధింపులు మొదలయ్యాయని, మోదీ నాయకత్వం లో ఉన్న ప్రజాస్వామ్యదేశంలో ఇలాంటి వేధింపులు తమను ఆశ్చర్యానికి గురి చేశాయని అమెరికా వైట్హౌజ్ వేదన చెందడమే బాధాకరం.
అంతెందుకు ఇక్కడ ఒక తెలుగు మహిళా జర్నలిస్ట్పై కూడా ఈ మధ్యకాలంలో విపరీతమైన ట్రోలింగ్ను కొందరు వ్యక్తులు చేసినట్టు సాక్షాత్తు ఆ మహిళా జర్నలిస్టు ఫిర్యాదు చేయడంతో పాటు తనకు స మాజం అండగా నిలవాలని బయటకు వచ్చి కోరుకున్నది. తులసిచందు అనే ఈ మహి ళా జర్నలిస్టు హిందువులకు వ్యతిరేకంగా తన యూట్యూబ్లో రాతలు రాస్తుందని, వీడియోలు చేస్తుందని ఆగ్రహించిన కొందరు వ్యక్తులు రకరకాలుగా ట్రోల్చేసి ఆమెపై వ్యక్తిగత దూషణకు దిగడం, దానిని అనేక మంది ఖండించడం మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ భావప్రకటన స్వేచ్ఛ ఉన్నట్టా, లేనట్టా అంటే ట్రోల్ చేసేవాళ్లు ఈ స్వేచ్ఛ గురించి పట్టించుకోనంత అని మాత్రం చెప్పవచ్చు.
మీడియాకు ప్రశ్నించే హక్కు మాత్రమే కాదు, నైతిక బాధ్యత కూడా ఉంటుంది. లక్ష్మణరేఖ దాటకుండా రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందనే విషయాన్ని జర్నలిస్టులు సైతం గుర్తుంచుకోవాలి. మీడియా ఆ సున్నితమైన రేఖను దాటి ఎప్పుడో… ఎటో వెళ్లిపోయింది. కాబట్టి అన్ని ప్రశ్నలకూ ప్రజాదృష్టి ఉండదు. ప్రజాదృష్టి ఉన్న ప్రశ్నలను మాత్రం వదిలేయకూడదు.
ఎటొచ్చీ మరీ మోదీకి ఎదురవుతున్న ప్రశ్నలన్నీ ఆయనపై కావాలని అడిగేవేనా? అంటే అట్లా ఏమీ లేదు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కోసం చట్టాలు తెచ్చారు. పదుల సంఖ్యలో రైతులు చనిపోయిన తర్వాత వాటిని వెనక్కి తీసుకున్నారు. ఇంకా చాలా విషయాల్లో ఆయన వేగంగా ముందుకువెళ్లారు. క్షేత్ర స్థాయి సమస్యలను సామాజిక కోణంలో ఆయనకు సహజంగానే ప్రశ్నల రూపంలో వస్తాయి. వాటి కి స్పందించాలి. సమాధానం ఇవ్వా లి. అప్పుడే అమెరికాలో మోదీ చెప్పినట్టు ప్రజాస్వామ్యానికి అస్సలు నిర్వచనమే కాదు, సరికొత్త జీవం పోసినట్టవుతుంది. అన్నట్టు మోదీ ప్రభుత్వం డిజిట ల్ ఇండియా బిల్లును తేవాలనుకుంటున్నట్టు ఆ మధ్య వార్తలొచ్చాయి. ఆ పని చేస్తే వాట్సప్ వర్సిటీలకు కళ్లెం వేయొచ్చని ప్ర జాస్వామ్యవాదులు కోరుకుంటున్నారు. హద్దుల్లేని తప్పుడు ప్రచారాలకు నైతిక బాధ్యత అనే చట్టంతో కళ్లెం వేస్తారని కూడా వేయికండ్లతో చూస్తున్నారు. ఇ ది ప్రశ్నకాదు, విజ్జప్తి మాత్రమే.
(వ్యాసకర్త: ప్రధాన కార్యదర్శి, టీయూడబ్ల్యూజే)
-అస్కాని మారుతీసాగర్
90107 56666