బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను దాటి భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా గతేడాది ఆవిర్భవించింది. 2030 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొంది, ప్రపంచంలోనే అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందని పాలకులు ప్రగల్భాలు పలుకుతున్న ప్రస్తుత తరుణంలో అసలు వాస్తవాలపై చర్చించాల్సిన అవసరం ఉన్నది. గత కొన్ని నెలలుగా జీఎస్టీ వసూళ్లు రూ.1.5 లక్షల కోట్ల వరకు నమోదవుతున్నా, సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు రోజురోజుకూ పైపైకి దూసుకుపోతున్నా, ప్రపంచంలోనే అత్యధిక కుబేరులు ఉన్న దేశంగా భారత్ ఎదుగుతున్నా, జీ-20 సమావేశాలు అట్టహాసంగా నిర్వహించినా, భవిష్యత్తులో ఒలింపిక్స్ నిర్వహిస్తాం అని ప్రకటించినా.. ‘మేడిపండు చూడ మేలిమై ఉండు’ అన్న చందంగా మన దేశ ఆర్థిక వ్యవస్థ ఉన్నదని అనడంలో అతిశయోక్తి లేదు.
India | భారత్ అభివృద్ధిలో దూసుకెళ్తున్నదని మన పాలకులతో పాటు ప్రపంచ దేశాలు భావిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. నేటికీ మన దేశంలో సుమారు 28 కోట్ల జనాభా అర్ధాకలితో, 21 కోట్ల మంది అనారోగ్యాలతో, కోట్ల మంది నిరుద్యోగంతో, పోషకాహార లోపంతో సతమతమవుతున్నారు. దేశంలోని 18.7 శాతం జనాభా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. అందులోనూ 15-24 ఏండ్ల మధ్య వయసున్నవారిలో 58.1 శాతం మందిలో పోషకాహార లోపం ఉండటం దేనికి సంకేతం? కుల, మత, ప్రాంతీయ అసమానతలతో, లింగ వివక్షతో కొన్ని కోట్ల మంది దుర్భర జీవితాలను కొనసాగిస్తుండటం అభివృద్ధి అవుతుందా? మహిళలపై అణచివేతలు, వేధింపులు, అఘాయిత్యాలు, అక్రమ రవాణా, మత్తు పదార్థాలు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన సాగిస్తున్న పాలకుల మధ్య అంకెలు, ర్యాంకుల అభివృద్ధి చూసి భారత్ మురిసిపోవడం ముమ్మాటికీ మన దేశానికి ముప్పే.
నేటికీ మన దేశంలో అందరికీ నాణ్యమైన విద్య, ఆరోగ్యం, తాగునీరు అందక అలమటిస్తున్న అభాగ్యులు ఎందరో ఉన్నారు. పేదరికం పెనుశాపంలా దశాబ్దాలుగా వెంటాడుతూనే ఉన్నది. అయినప్పటికీ కుబేరుల సంఖ్య పెరుగుతూ, కొద్దిమంది చేతుల్లో దేశ సంపద కేంద్రీకృతమై ఉన్నదనేది జగమెరిగిన సత్యం. ఒక పక్క సంపద పెరుగుతున్నా, అసమానతల వల్ల పేదరికం నానాటికీ పెరుగుతున్నదనే విషయాన్ని పాలకులు గుర్తెరగాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. భారత్లో క్షయ వ్యాధి మళ్లీ విజృంభించడానికి ప్రధాన కారణం దారిద్య్రం, పోషకాహార లోపమే. 2020-2022 మధ్యకాలంలో 38 లక్షల మంది ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిపోవడాన్ని బట్టి చూస్తే.. దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎంత దుర్భరంగా ఉన్నాయో అర్థం అవుతున్నది. పన్నులు, ఇతర మార్గాల్లో వచ్చే ఆదాయం మొత్తాన్ని ఉచిత పథకాలకు ఖర్చు చేస్తూ, తిరిగి అధికారంలోకి రావడానికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరితపిస్తున్నాయి తప్ప, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే ప్రయత్నం చేయకపోవడం దురదృష్టకరం.
ఇప్పటికే ప్రపంచ దేశాల్లో 3.7 కోట్ల మంది భారతీయులు విదేశీయులుగా మారిపోయారు. 1970-90 మధ్యకాలంలో మేధో వలసలు ఎక్కువగా జరగగా.. నేడు దీనికి తోడు, వ్యాపార వలసలు కూడా జోరందుకున్నాయి. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోకపోవడమే దీనికి కారణం. మౌలిక సదుపాయాల కల్పనలో మన ప్రభుత్వాలు విఫలం అయ్యాయనే చెప్పాలి.
తరచూ మతపరమైన ఉద్రిక్తతలు, సామాజిక సమస్యలు, రాజకీయ విధానాల కారణంగా పారిశ్రామికవేత్తలు మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఇక్కడ పరిశ్రమలు స్థాపించకుండా విదేశాల బాట పడుతున్నారు. 2022లో 7,000 మంది కోటీశ్వరులు విదేశీ పౌరసత్వం తీసుకోవడమే దీనికి నిదర్శనం. 2013-22 మధ్యకాలంలో 48,500 మంది కోటీశ్వరులు విదేశీ పౌరులుగా మారిపోయారు.
చదువుల్లో నాణ్యత లేకపోవడం, నైపుణ్యాల లేమితో సతమతమవుతున్న యువతలో ఎక్కువ మంది అసంఘటిత రంగ కార్మికులుగా విదేశీ బాట పడుతున్నారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న 5-10 శాతం మాత్రమే సాఫ్ట్వేర్ తదితర రంగాల్లో ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్తున్నారు. మిగిలిన 90 శాతం మంది డ్రైవర్లుగా, పని మనుషులుగా, వంట మనుషులుగా, భవన నిర్మాణ కార్మికులుగా వలసపోతున్నారు. గల్ఫ్, తైవాన్, ఇజ్రాయెల్, కువైట్ వంటి దేశాల్లో చిన్నచిన్న పనులు చేసుకునే భారతీయులు లక్షల్లో ఉంటారు. ఈ విధంగా సంపన్నులు, వృత్తి నిపుణులు, మేధావులు విదేశాలకు వలసపోతే భవిష్యత్తులో భారత్ పరిస్థితి ఏమిటనేది పాలకులు ఒక్కసారి ఆలోచించుకోవాలి. అధికారం కోసం పాకులాడే పార్టీలు, ప్రభుత్వాలు ఇకనైనా వాస్తవ అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి. వలసల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. ఏటా 25 లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడుతున్నారు. వీరిలో మన తెలుగు రాష్ర్టాల విద్యార్థులు అధికంగా ఉంటున్నారు. స్వదేశంలో సరైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో మెరుగైన జీవనం కోసం వారంతా విదేశాల్లో స్థిరపడేందుకు మొగ్గు చూపుతున్నారు.
మనదేశంలో కొత్త ఉద్యోగాలు లేకపోవడం, పెరిగే ధరలు, పన్నుల భారం, సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు ప్రజలను కుంగదీస్తున్నాయి. పిల్లల చదువులు ఖరీదుగా మారటం, వైద్య ఖర్చులు అధికంగా ఉండటం, ప్రశ్నించేవారిని అణగదొక్కాలని చూడటం, అరెస్టులు, రకరకాల వివక్షలు దేశాభివృద్ధికి సవాల్గా మారుతున్నాయి. ఇవే భవిష్యత్తులోనూ మన దేశం వెనుకబాటుతనానికి కారణం కానున్నాయి. ఏటా పది కోట్ల మంది యువత ఉపాధి మార్కెట్లోకి వస్తున్నా, వారికి సరిపడా అవకాశాలు దొరకడం లేదు. ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్న భారత్.. నిరాశ, నిస్పృహలకు నిలయంగా మారుతున్నది. ‘ఏదో సాధించాం’ అని పాలకులు జబ్బలు చరుచుకోవడం సరికాదు. భవిష్యత్తు పరిణామాలు ఇకనైనా అంచనా వేసి విధానాలను మార్చుకోవాలి. అంకెలు, సూచీల అభివృద్ధి చూసి ఉబలాటపడకుండా, వాస్తవ పరిస్థితిని అంచనా వేసి సరైన ప్రణాళికతో ఉత్పత్తి రంగాల బలోపేతానికి కృషి చేయాలి.
ఉపాధి కల్పించాలి. ఉపాధి రహిత అభివృద్ధి కొంపముంచుతుందని గ్రహించాలి. వ్యక్తిగత కక్ష, రాజకీయ అసమానతలు మానుకోవాలి. యువత శక్తియుక్తులను సమగ్రంగా వినియోగించుకోవాలి. నాణ్యమైన విద్య, వైద్యం అందించాలి. నైపుణ్యాభివృద్ధికి సకల సౌకర్యాలు కల్పించాలి. బడ్జెట్లో నిధులు ఎక్కువగా కేటాయించి, వాటిని ఖర్చు చేయాలి. పరిశోధన, శాస్త్ర సాంకేతిక రంగాలకు అధిక ప్రాధాన్యమివ్వాలి. ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టే సున్నితమైన మతం, కులం, భాషా, ప్రాంతం వంటి అంశాల జోలికి పాలకులు వెళ్లకుండా, ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారీతనంతో పాలన అందించాలి. బడా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ సొమ్మును ధారాదత్తం చేయకుండా, పేద, మధ్యతరగతి ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల కోసం వాటిని వెచ్చించాలి. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించాలి. అప్పుడు మాత్రమే భారత్ వాస్తవ అభివృద్ధి సాధిస్తుంది.
అదే సమయంలో ఎన్నికల్లో ప్రజలు నిజాయితీగా ఓటు వేయాలి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే పార్టీలకు, పేద, శ్రామిక వర్గాల పక్షాన నిలిచే పార్టీలకు జై కొట్టాలి. యువత తమ ఓటుహక్కును సక్రమంగా వినియోగించుకోవాలి. ఎన్నికైన ప్రభుత్వాలు రాజ్యాం గ స్ఫూర్తితో పని చేయాలి. వివక్షకు తావు లేకుండా పారదర్శకంగా పాలించాలి. అప్పుడు మాత్రమే ‘సర్వేజనా సుఖినోభవంతు’ అనే ఆర్యోక్తి భారత ప్రజలకు నూటికి నూరుపాళ్లు సరిపోతుంది.
-ఐ.పి.రావు
63056 82733