ఏప్రిల్ నెలకు ఏదో మహత్తు ఉందనిపిస్తున్నది. ముగ్గురు మహనీయులు పుట్టిన మాసం ఇది! 5న బాబూ జగ్జీవన్రామ్, 11న మహాత్మా జ్యోతిబా ఫూలే, 14న బాబాసాహెబ్ అంబేద్కర్లు జన్మించిన నెల ఏప్రిల్. ఈ దేశ అణగారిన బిడ్డలను సామాజిక, సాంస్కృతిక దాస్య శృంఖలాల నుంచి విముక్తం చేసేందుకు తమ జీవితాలనే ధారపోసిన ఈ మువ్వురు మహనీయులను స్మరించుకోవడం మన బృహత్ కర్తవ్యం.
‘విద్య లేక వివేకం లేదు, వివేకం లేక నీతి లేదు, నీతి లేక పురోగతి లేదు, పురోగతి లేక విత్తంబు లేదు’ అన్న మహనీయుడు ఫూలేను తన గురు సమానులుగా భావించారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్. ఆ రాజ్యాంగ నిర్మాత స్ఫూర్తియే శిరోధార్యంగా భావించి సమతా మార్గంలో పయనిస్తున్నది కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం. ఇదే ఏప్రిల్లో జలదృశ్యం సాక్షిగా 2001లో పురుడుపోసుకున్న ఒక రాజకీయ పార్టీ అనతి కాలంలోనే ఎన్నో రంగాల్లో దేశానికే రోల్ మోడల్గా వెలిగిపోతున్నదంటే దానికి కారణం బీఆర్ అంబేద్కర్.
‘పక్కనే సచివాలయం, ఎదురుగా తన ఆరాధ్యుడు బుద్ధుని విగ్రహం, మరో దిక్కు త్యాగాలు చేసిన అమరవీరుల స్మారక స్థూపం వీటి నడుమ శిఖరమంత ఎత్తున నిలిచిన అంబేద్కర్ మహానుభావుడు మనల్ని నిత్యం చైతన్యపరుస్తూ పాలక వ్యవస్థకు నిత్య స్ఫూర్తివంతమై దారిచూపుతాడు. నేను ఊహించిన దానికంటే అత్యద్భుతంగా విగ్రహం రూపం ఆవిష్కృతమైంది. ప్రసన్న వదనంతో నిలుచుని ఉన్న అంబేద్కరుడు ఒక తాత్విక జ్ఞానిగా అలరిస్తున్నాడు.’ అన్నరు కేసీఆర్.
‘మెజారిటీవాదం అన్యాయం చేస్తున్నపుడు పీల గొంతుగల మైనారిటీ వాదానికి రాజ్యాంగ రక్షణ, దన్ను అవసరం’ అనే తాత్వికతతో మహనీయుడు అంబేద్కర్ లిఖించిన ఆర్టికల్-3 వల్ల మాత్రమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. ఈ మహత్ సంకల్పానికి నాటి సాక్షి జలదృశ్యానికి కూతవేటు దూరంలో మహోజ్వల దృశ్యం ఈ 14న ఆవిష్కృతం కానున్నది. తమ మార్గదర్శి, భవిష్యత్ వెలుగు రేఖ బాబాసాహెబ్ను తెలంగాణ సమున్నతంగా ప్రతిష్టింపజేసుకొనబోతున్నది. దేశంలోనే మొదటిసారిగా సరికొత్త పాలనా సౌధానికి ఆ మహనీయుని పేరు పెట్టుకొని మురిసిపోతున్నది. తన పేరును చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకోబోతున్నది తెలంగాణ. తమ పథ నిర్దేశకునికి ఒక జాతి ఘటించే నివాళి ఇంతకంటే ఘనంగా మరెక్కడా ఉండబోదు!
అంబేద్కర్ విరచిత రాజ్యాంగం సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని; ఆలోచనలోనూ, భావ ప్రకటనలోనూ, మత విశ్వాసాలలోనూ, ఆరాధనలోనూ స్వేచ్ఛను; జీవనావకాశాల్లో, సామాజిక విషయాల్లో సమానత్వాన్ని; వ్యక్తి గౌరవాన్ని, జాతీయ ఐక్యతను, సమగ్రతను పెంపొందించుకునే విధంగా సౌభ్రాతృత్వాన్ని… కల్పించి, మనకు ఇచ్చింది. అలాంటి అంబేద్కర్ను సమున్నతంగా నిలబెట్టడమంటే రాజ్యాంగ పీఠికను ఔదలదాల్చడం; ఆరునూరైనా, ఏదేమైనా సర్వసమతను స్థాపించడం; సమసమాజ నిర్మాణం చేయడం!
అంబేద్కర్ దార్శనికతను పుణికిపుచ్చుకున్న మాన్య కాన్షీరాం యాభై ఏండ్ల స్వతంత్ర స్వర్ణోత్సవాల సందర్భంగా ‘భారతదేశంలో బహుజనుల జీవితాలు ఇంకా ఎందుకు కునారిల్లి ఉన్నా యి, ఎందుకు నానాటికీ దిగజారుతున్నాయి’ అనే అంశంపై దేశవ్యాప్తంగా ఐదు సెమినార్లు నిర్వహించారు. ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమరలు సహా ఢిల్లీ నడిబొడ్డున నిర్వహించిన నాటి సెమినార్లు చరిత్రలో నిలిచిపోయాయి. దేశపు నలుదిక్కుల నుంచి బయల్దేరి ఢిల్లీ బహిరంగ సభకు వచ్చిన గొప్ప జీప్ ర్యాలీల ద్వారా స్వతం త్ర భారతంలో ఇంకా పలురకాల బానిసత్వం లో జీవిస్తున్న బహుజన సమూహం గురించి పెద్ద ఎత్తున ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చారు కాన్షీరాం. దక్షిణాది రాష్ర్టాల సెమినార్ను నిర్వహించే భాగ్యం తనకు దక్కిన విషయాన్ని కాన్షీ రాం సహచరుడు, వ్యాస రచయిత రావెల కిషోర్బాబు కేసీఆర్తో ఈ మధ్యే పంచుకున్నారు. అంబేద్కరిజాన్ని పెద్దఎత్తున ప్రచారం చేసి, ఆయన ఆశయాల సాధనకు అవిరళ కృషిచేసిన మాన్య కాన్షీరాం ఉద్యమం నుంచి తానెంతో స్ఫూర్తిని పొందానని, కాన్షీరాం త్యాగపూరిత ఉద్యమాన్ని తానెంతో అభిమానిస్తానని కేసీఆర్ వినమ్రంగా అన్నారు.
‘అధ్యక్షా.. నా అభిప్రాయంలో గత యాభై ఏండ్లలో మన దేశంలో విప్లవాత్మక మార్పులేమీ జరగలేదు. నిజానికి ఆంగ్లేయుల పరిపాలనాకాలంలో దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా సాంస్కృతిక తిరుగుబాటు మొదలైంది. ఆ తిరుగుబాటు 1956 వరకు, అంటే 108 ఏండ్ల వరకు నిరంతరంగా జరిగింది. 1848 నుంచి 1891 వరకు మహాత్మా జ్యోతిరావు ఫూలే నాయకత్వంలో, 1891 నుంచి 1922 వరకు బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ నాయకత్వంలో జరిగిన తిరుగుబాటు! స్వాతంత్య్రం వచ్చిన యాభై ఏండ్లలో ఎక్కువకాలం కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. వారు సం క్షేమ పథకాలు రూపొందించడంలో ఎటువంటి లోపాల్లేవు. కానీ అవి అమలు జరిగేటప్పుడు మాత్రం శ్రద్ధ తీసుకోలేదు. దాని పరిణామాల ఫలితంగానే నేడు కాంగ్రెస్ పార్టీ సంకటస్థితిలో ఉన్నది. వారే కాదు, దేశంలోని ఎన్నో పార్టీలు, వారి ప్రభుత్వాలను చూశాం. ఎవరూ చిత్తశుద్ధితో పనిచేయలేదు.
యాభై ఏండ్ల కింద పార్లమెంట్లో కాన్షీరాం మాట్లాడిన పై మాటలు, ఇపుడు కేసీఆర్ చెప్తున్న మాటల సారాంశమూ ఒక్కటే! ఈ ఇద్దరు అంబేద్కర్ అనుచరుల ఆవేదన ఒక్కటే ఈ దేశం సరైన దారిలో సాగడం లేదని!
ఢిల్లీలో డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ జాతీ య డైరెక్టర్గా పనిచేసిన వ్యాస రచయిత రావెల కిషోర్బాబు విభజిత ఆంధ్రప్రదేశ్ సాంఘిక, గిరిజనశాఖ మంత్రిగా పనిచేసి ఉన్నరు. తన హయాంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ను అత్యంత సమర్థవంతంగా అమలుచేసిన ఆయన కూడా కేసీఆర్కు ఉన్న దార్శనికత, బహుజన సమాజం పట్ల ప్రేమ, అంబేద్కర్-కాన్షీరాంల పట్ల ఉన్న ఆరాధనకు ముగ్ధుడయ్యారు. మరొక రచయిత శ్రీశైల్రెడ్డి పంజుగుల ఫూలే, అంబేద్కర్ భావజాల కార్యకర్తగా ఉన్నారు. సౌదా అరుణల కర్తృత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 100కు పైగా సెంటర్లలో ఫూలే, అంబేద్కర్ భావజాలాన్ని నాటకాల ద్వారా ప్రదర్శించి ఉన్నారు. ఈ ఇద్ద రూ గతంలో టీడీపీలో కలిసి పనిచేసి ఉన్నరు, ఇప్పుడు బీఆర్ఎస్లో కూడా కలిసి పనిచేస్తూ ఉన్నరు. కాబట్టే ఈ వ్యాసంలోని విషయాలకు ప్రాసంగికత, సాధికారత ఉన్నది. పార్టీలు, నాయకులు, ఎన్నికలు లాంటివి పక్కకు పెట్టి కూడా సమసమాజ సంక్షేమ లక్ష్యాన్ని గుండె నిండుగా ప్రకటించే ధైర్యం ఎక్కడినుంచి వస్తుందంటే ఫూలే, అంబేద్కర్, కాన్షీరాంలను చదవడం ద్వారా వస్తుంది. వారి ఆశయాలను మన సా వాచా కర్మణా నమ్మిన మనస్సులోంచి వస్తుంది.
కాన్షీరాం స్థాపించిన బీఎస్పీ దురదృష్టవశాత్తు నేడు ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తున్నది. అన్ని వ్యవస్థలనూ ధ్వంసం చేసి, రాజ్యాంగాన్ని చెరబట్టి, ప్రజలను చెప్పుకోలేని ఆర్థిక బాధలకు గురిచేస్తున్న బీజేపీకి బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మౌన సమర్థకురాలిగా మిగిలారు. ఆ పార్టీ తెలంగాణ శాఖాధ్యక్షుడు తెలంగాణను నాశనం చేసిన వైఎస్ వారసులతో కలిసి నడుస్తున్నడు. వీరి విధానాలను తెలంగాణ బహుజనులు తిరస్కరిస్తున్నరు.
స్వాతంత్య్ర భారతంలో ఎన్నో చోట్ల, ఎన్నో ప్రభుత్వాలు అంబేద్కర్ పేరు మీద ఎన్నెన్నో పతకాలు, పథకాలు ప్రకటించి ఉన్నయి. ఎంతో కొంత అమలుచేసి కూడా ఉన్నయి. కానీ, బాబాసాహెబ్ అసలైన స్ఫూర్తిని ఒడిసిపట్టుకొని, కార్యాచరణకు దిగినవాడు మాత్రం ఒక్క కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాత్రమే. దళిత జ్యోతి, బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి అని పిలిపించుకుంటూ వారికి తాత్కాలిక తాయిలాలు విదిలిస్తూ, నిరంతరం తమపై ఆధారపడి మనుగడ సాగించేవారిగానే బహుజనులను ఇప్పటివరకూ రాజకీయపార్టీల నాయకులు చూశారు. కేసీఆర్ అట్లా కాదు. ఆయన హృదయావిష్కరణ విం దాం!
‘జ్యోతిబా ఫూలే అందించిన స్ఫూర్తితో వికాసమే వివక్షకు విరుగుడు’ అనే విధానాన్ని అనుసరిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడుతున్నది. ఇక్కడి దళిత, గిరిజన, బడుగు, బలహీనవర్గాలు, మహిళలు.. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, విద్యాపరంగా మెరుగైన ఫలితాలు సాధించి సామాజిక సమానత్వ దిశగా పురోగమిస్తున్నారు’.
నిజమే కదా? మేము చెప్పినవన్నీ వాస్తవాలే కదా? దేశం మారాలి కదా? అయితే రండి మరి, కలుసుకుందాం అందరం; కలిసి నడుద్దాం అందరి కోసం. జై భీమ్! జై భారత్!!
– రావెల కిషోర్ బాబు
(మాజీ మంత్రి)
– శ్రీశైల్రెడ్డి
పంజుగుల
90309 97371