హైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రణకు మెట్రో రైలు పాత్ర ఎంతో కీలకం. రోజూవారీ పనుల నిమిత్తం మహానగరంలో ఒక వైపు నుంచి మరో వైపునకు ప్రయాణించే మధ్యతరగతి ప్రజలు, వేతన జీవులకు మెట్రో మార్గం వరప్రదాయిని. మెట్రో ప్రాముఖ్యాన్ని గుర్తించిన గత ప్రభుత్వం దాన్ని మరింత విస్తరించేందుకు ప్రణాళికలు రచించింది. అందులో భాగంగా రాయదుర్గం నుంచి విమానాశ్రయం వరకు 31 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాన్ని ప్రతిపాదించింది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ సర్కార్ ఈ మార్గాన్ని రద్దు చేయటం విచారకరం. ఈ మార్గానికి ప్రత్యామ్నాయంగా పాత బస్తీ మీదుగా విమానాశ్రయానికి వెళ్లేందుకు మెట్రో లైన్ను ప్రతిపాదించడం ఆశ్చర్యకరం. హైదరాబాద్ నగర మ్యాప్ను చూస్తే లంగర్హౌజ్, బండ్లగూడ, అత్తాపూర్, నార్సింగి, మణికొండ, గండిపేట, ఖాజాగూడ తదితర నైరుతి వైపున్న ప్రాంతాలకు మెట్రో కనెక్టివిటీ తక్కువ. ఆయా ప్రాంతాలవాసులు మెట్రో కోసం రాయదుర్గం వరకు వెళ్లాలి.
మైండ్స్పేస్ నుంచి మణికొండ, నార్సింగి వైపు వెళ్లే ప్రయాణికులకు రాత్రిళ్లు ఆటోలు, క్యాబ్లు దొరకవు. ఈ ప్రాంతాల నుంచి విద్యార్థులు, ఐటీ ఉద్యోగులతో పాటు ఇతరులు కూడా అధిక సంఖ్యలో హైటెక్ సిటీ, రాయదుర్గం వైపునకు వెళ్తుంటారు. అంతేకాకుండా చారిత్రక ప్రదేశాలైన కుతుబ్షాహీ టూంబ్స్, గోల్కొండ కోట, తారామతి పేట, గండిపేట చెరువును సందర్శించే వారికి మెట్రో ఉపయుక్తంగా ఉంటుంది. రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వైపు వెళ్లేవారికి ఓఆర్ఆర్ ఉంది కాబట్టి మెట్రో రైలు అవసరం లేదని ముఖ్యమంత్రి చెప్పడం సరైనది కాదు. విమానాశ్రయం వరకు లైన్ ఉన్నంతమాత్రాన ప్రతిఒక్కరూ ఎయిర్పోర్టుకే వెళ్లరు. ఆ మార్గమధ్యంలో ఉన్న గ్రామాలు, ఇతర ప్రాంతాలకు పోవడానికి మెట్రో రైలు సదుపాయం అవసరం. పీవీ ఫ్లైఓవర్ కేవలం విమానాశ్రయానికి వెళ్లే వారికే ఉపయోగకరం. ఈ మార్గంలో మెట్రో సాంకేతికంగా వీలుకాదు. కాబట్టి కనీసం సమీపంలోని షేక్పేట, మణికొండ, నార్సింగి, బండ్లగూడలను కలుపుతూ కొత్త లైన్ వేస్తే ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది.
ముఖ్యమంత్రి చెప్పిన ప్రకారం.. మణికొండ నుంచి మెట్రోలో ఎయిర్పోర్టుకు వెళ్లాలంటే రాయదుర్గం నుంచి ఎంజీబీఎస్, చార్మినార్, శాలిబండ మీదుగా వెళ్లాలి. తూర్పున హయత్నగర్, పశ్చిమాన పటాన్చెరు, ఉత్తరాన శామీర్పేట, దక్షిణాన పాతబస్తీ వాసులకు మెట్రో సేవలు అందుబాటులోకి తీసుకొని వచ్చినట్టే నైరుతి ప్రాంతవాసులకు కూడా మెట్రో రైలు సేవలు అందించాలి. కాబట్టి మెట్రో రైలు లైన్ను పూర్తిగా రద్దు చేయకుండా కనీసం నార్సింగి, మంచిరేవుల వరకైనా ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య కొంతవరకు తగ్గుతుంది. ఇతర ప్రాంతాలతో కనెక్టివిటీ మెరుగవుతుంది.
– చంద్రహాస