భ్రమలన్నీ తొలగిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బట్టబయలవుతున్నది. బీసీల అభ్యున్నతి కోసం కృషి చేస్తామని ఎన్నికల సమయంలో ప్రగల్భాలు పలికిన రేవంత్రెడ్డి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ మొండిచెయ్యి చూపిస్తున్నారు. తన సొంత సామాజికవర్గ పక్షపాతిగా వ్యవహరిస్తూ తానెంటో నిరూపించుకుంటున్నారు. బీసీ కులగణన ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందని ఓ వైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ భారత్ న్యాయ్ జోడో యాత్రలో చెప్తూ బీసీల ఓట్ల కోసం ప్రయత్నిస్తుంటే.. రాష్ట్రంలో మాత్రం రేవంత్రెడ్డి అందుకు భిన్నంగా రహస్య ఎజెండాను ముందుకు తీసుకెళ్తున్నారు.
రేవంత్రెడ్డి గతంలో ఏదైతే చెప్పారో సరిగ్గా వాటినే ఇప్పుడు అమలు చేస్తూ బీసీల హక్కులను కాలరాస్తున్నారు. ‘రెడ్లకే పాలించే సామర్థ్యం ఉంటుంది. బీసీలకు పాలన గురించి ఏమాత్రం తెలియదు’ అని పేర్కొని గతంలో బీసీల ఆత్మగౌరవంపై దాడి చేసిన ఆయన సీఎంగా ప్రస్తుతం సరిగ్గా అదే ఆచరిస్తున్నారు.
పరిపాలన విభాగంలో సొంత సామాజికవర్గానికి రేవంత్రెడ్డి పెద్దపీట వేస్తుండటంపై బీసీ, ఎస్సీ, ఎస్టీ మేధావులు ముక్కున వేలేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో బీసీ వర్గానికి చెందిన ఒక్కరికీ ఆయన అవకాశం కల్పించలేదు. పార్టీలో పదవులు మొదలు అడ్మినిస్ట్రేషన్ విభాగం వరకు అన్నింటిలోనూ రెడ్లకే అధిక ప్రాధాన్యం ఇచ్చి సామాజిక న్యాయాన్ని ఆయన తుంగలో తొక్కారు. టీఎస్పీఎస్సీ చైర్మన్, ఇంటెలిజెన్స్ అధిపతి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, ప్రెస్ అకాడమీ చైర్మన్, ఏసీబీ జాయింట్ డైరెక్టర్, నగర పోలీసు కమిషనర్లు, పీఆర్వోలు.. ఇలా కీలకమైన విభాగాల్లో సొంత సామాజికవర్గం వారినే సీఎం నియమించుకున్నారు. పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు మహేందర్రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేసిన రేవంత్.. ఇప్పుడు ఆయన్నే టీఎస్పీస్సీ చైర్మన్గా నియమించడాన్ని బట్టి ఆయనకున్న కులప్రీతిని అర్థం చేసుకోవచ్చు. కులాధిపత్య సామ్రాజ్య విస్తరణ కోసం, ప్రత్యేక ఎజెండా ప్రకారమే రేవంత్రెడ్డి ఇలా చేస్తున్నారనేది సుస్పష్టం.
వివిధ విభాగాల్లో రెడ్లకు ప్రాధాన్యం ఇస్తుండటంపై వ్యతిరేకత వస్తున్నప్పటికీ ఆయన తీరు మార్చుకోవడం లేదు. పైగా ఇటీవల ప్రకటించిన కార్పొరేషన్ చైర్మన్ల నియామకాల్లోనూ బీసీలకు, ఎస్సీలకు మొండిచెయ్యి చూపారు. 37 కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించగా.. అందులో 10 శాతం జనాభా లేని ఒక్క సామాజికవర్గానికే 19 చైర్మన్ పదవులు కట్టబెట్టారు. 52 శాతం ఉన్న బీసీ సామాజికవర్గానికి 11 చైర్మన్ పోస్టులే దక్కాయి. ఇక దళిత సామాజికవర్గానికి ఒకే ఒక్క చైర్మన్ పదవిని ఇచ్చారు. అది కూడా ఎస్సీ కార్పొరేషన్ కావడం గమనార్హం. మరో కార్పొరేషన్ అయితే దాన్ని కూడా రెడ్లతో భర్తీ చేసే వారేమో! ఇలా బీసీ సామాజికవర్గాన్ని రేవంత్రెడ్డి విస్మరిస్తున్నా.. బీసీ సంఘాలు నోరు మెదపకపోవడం విచారకరం.
సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్కు ఓటేయాలని ఎన్నికల్లో ప్రచారం చేసిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మేధావులు కూడా రేవంత్రెడ్డి తీరుపై స్పందించడం లేదు. ఇదేనా సామాజిక న్యాయమని ఒక్కరూ ప్రశ్నించడం లేదు. వంద రోజుల కాంగ్రెస్ పాలనలో బీసీల ఉద్దరణకు ఎలాంటి ముందడుగు పడినట్టుగా కనిపించడం లేదు.
కులగణన చేస్తామని అసెంబ్లీలో తీర్మానం చేసిన కాంగ్రెస్.. విధివిధానాల ప్రకటనలోనే తన చిత్తశుద్ధి ఏంటో నిరూపించుకున్నది. బీసీల కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించి.. బడ్జెట్లో రూ.8 వేల కోట్లు కేటాయించిన ఘనత రేవంత్రెడ్డి సర్కారుది.
ఓయూ బీసీ విద్యార్థి లోకాన్ని కూడా కాంగ్రెస్ మోసం చేసింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును కాంగ్రెస్ వైపు మళ్లించిన ఓయూ విద్యార్థి నేతల కృషిని వాడుకొని గద్దెనెక్కిన రేవంత్రెడ్డి.. వారిలో ఒక్కరికైనా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారా? రేవంత్కు ఓయూ విద్యార్థులంటే అడ్డా మీద కూలీలతో సమానం. అందుకే వారికి పదవులు ఇవ్వలేదు. ఇకనైనా ఓయూ విద్యార్థులు కాంగ్రెస్ను, రేవంత్ను పల్లకిలో మోయడం మానేసి.. కులాధిపత్య రాజకీయాలపై ఉద్యమాన్ని నిర్మించడంపై దృష్టి సారించాలి. తెలంగాణ ఉద్యమం తరహాలో స్వతంత్రంగా ఉద్యమ నిర్మాణం కోసం కృషి చేయడం తప్పితే.. ఓయూ అస్తిత్వానికైనా, బీసీ ఉద్యమానికి అయినా మరో మార్గం లేదు.
తెలంగాణలో దళితోద్యమం, విప్లవోద్యమం వచ్చాయి. ఇప్పుడు రావాల్సిందల్లా బీసీ ఉద్యమమే. అవమానం, అణచివేతతో తిరుగుబాటు జెండాను ఎగురవేసే ఓ చక్కని అవకాశాన్ని రేవంత్రెడ్డి బీసీలకు ఇచ్చారు. ఈ సమయాన్ని బీసీలు సరిగ్గా వాడుకుంటే.. రేవంత్ నిర్మిస్తున్న కులాధిపత్య రాజ్య స్థాపనను ధ్వంసం చేసి బీసీ జెండాను ఎగురవేయడం ఖాయం. అదే జరిగితే దేశానికి తెలంగాణ మళ్లీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.
నక్కా మహేశ్ యాదవ్