తెలంగాణలో అధికారంలోకి రావడమే ఏకైక ధ్యేయంగా ప్రతిపక్షాల అధికార ఆరాటం ఎక్కువైంది. తాము ఏం చేశామో చెప్పుకోకుండా, రేపటి భవిష్యత్తులో తెలంగాణను ఏం అభివృద్ధి చేస్తామో స్పష్టత లేకుండా ఆర్భాట ప్రచారాలు చేస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, పార్టీల అస్పష్టమైన నిర్ణయాలు ప్రజలకు అర్థం కాకపోవడంతో, ఇప్పుడు ప్రతిపక్షాలు కొత్తరాగం ఎత్తుకున్నాయి. తెలంగాణలో ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉందని అబద్ధపు ప్రచారాన్ని సృష్టిస్తున్నాయి. వాస్తవానికి ఇదంతా కేసీఆర్ మూడోసారి సీఎం అవుతున్నాడనే అక్కసు అని స్పష్టంగా తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ మూడోసారి అధికారం చేపట్టి, దక్షిణ భారతదేశంలో ఓ బలమైన శక్తిగా భవిష్యత్తు లో భారతదేశానికి నాయకత్వం వహించే స్థాయికి ఎదిగే అవకాశం ఉన్నది. ఒకవేళ అదే గనుక జరిగితే తెలంగాణలో, అటు దేశంలో తమ ఆటలు సాగవనే అంచనాకు రెండు జాతీయ పార్టీ లు వచ్చాయి. ఎలాగైనా ఈసారి కేసీఆర్ను, బీఆర్ఎస్ను దెబ్బకొట్టి ఆయన ఉనికి కొంత తగ్గిద్దామనే భ్రమలో విపక్ష పార్టీలు ఉన్నాయి. అందుకోసం, వివిధ అబద్ధ్దపు మాటలు సృష్టిస్తూ, తెలంగాణ ప్రజల్లో కొంత అయోమయాన్ని పెంచే పనిలో కార్యాచరణను మొదలుపెట్టాయి. అయినా ఆ అబద్దపు మాటలను తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరు. కేసీఆర్ను ఎదుర్కోవటం ఆషామాషీ విషయం కాదని వారికి స్పష్టంగా తెలుసు. అందుకే అబద్ధపు ఆరోపణలతో బీఆర్ఎస్ పై దుష్ప్రచారం చేయాలని చూస్తున్నా ప్రజల నుంచి వారికి మిశ్రమ స్పందనే వస్తున్నది.
తెలంగాణ ప్రాంతం అధ్వానంగా మారడానికి ప్రధాన కార ణం కాంగ్రెస్ పార్టీనే. ఆనాడు నాయకత్వ లేమి అనే కారణంతో బలవంతంగా ఆంధ్రతో కలిపిన నాటి నుంచి, మలి విడత తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది ఆత్మ బలిదానాల వరకు కాంగ్రెస్సే కారణం. తెలంగాణ మలివిడత ఉద్యమం కేసీఆర్ నాయకత్వంలో ఉధృతమవుతున్న నేపథ్యంలో కేసీఆర్ అనే రాజకీయ శక్తితో ఆనాడు పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చి సుమా రు పదేండ్లు… తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకుండా… తెలంగాణ ఉద్యమాన్నే నిర్వీర్యం చేయాలనే అతి పెద్ద కుట్రకు దారితీసింది కాంగ్రెస్. అది గమనించిన కేసీఆర్ కాంగ్రెస్ కపట నీతిని గ్రహించి, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. తన బలిదానమే తెలంగాణ విజయం కావాలని ఆమరణ నిరాహారదీక్షకు దిగితే… తెలంగాణ ఇస్తున్నామంటూ ప్రకటన చేసి.. పది రోజులు గడవక ముందే కృత్రిమ ఉద్యమ సాకుతో తెలంగాణ ప్రకటనను వెనక్కి తీసుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్షపై మరోసారి నీళ్లు చల్లారు. ఇలా వీలైనంత తెలంగాణను అడ్డుకునే ప్రయత్నమే చేశారు. సబ్బండ వర్గాలను ఏకం చేసి.. చావుకు తను ముందు నిలబడి చేసిన ఉద్యమంలో కేసీఆర్ తెలంగాణను సాధించి ప్రజల ఆకాంక్షను సాకారం చేశారు.
తొలిసారి 2014లో ఉద్యమ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి ఉద్యమాన్ని నిర్విరామంగా కొనసాగిస్త్తూ వస్తున్నారు. తెలంగాణలో ఆరు సూత్రాల పథకం అమలు చేస్తామని 60 ఏండ్లు మోసానికి పాల్పడి, నేడు ఆరు గ్యారెంటీలంటూ తెలంగాణలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది. 610 జీవో అమలు చేస్తామని, తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ వారికే ఉద్యోగాలు ఇస్తామని ఒక్కటా, రెండా.. రాజకీయ అధికారం కోసం తెలంగాణ ప్రాంతాన్ని ఆశల పునాదుల మీద ఉంచి తెలంగాణ ను ఎడారిగా మార్చిన చరిత్ర కాంగ్రెస్ ది.
తెలంగాణ ఇచ్చింది మేమే… అంటూ మరో ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ… మలివిడత ఉద్యమం మండితే గానీ… ఇవ్వలేదనే సంగతి మరిచిపోయింది. తెలంగాణను అణువణువునా ఆగం జేసిన పార్టీ కాంగ్రెస్. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణకు మాది గ్యారెంటీ అనడాన్ని తెలంగాణ ప్రజలు నమ్మడం లేదు. ఆ ఆరు గ్యారెంటీలతో తెలంగాణ ప్రజల బతుకులు మారవని… తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ఉద్యమ నాయకుని నాయకత్వమే తెలంగాణకు శ్రీ రామ రక్ష అంటూ తెలంగాణ ప్రజలు స్పష్టతకు వచ్చారు. తాము ఆకట్టుకునే ప్రకటనలు చేసినప్పటికీ తెలంగాణ ప్రజలు నమ్మడం లేదని అబద్ధ్దపు ప్రచారంతో లబ్ధిపొందాలని చూస్తుంది కాంగ్రెస్ పార్టీ..
మరోవైపు బీజేపీ తమ అధినాయకత్వాలను దింపి… ఎన్నికల కోసం హడావుడి చేయిస్తున్నది. పదేండ్లు పసుపు బోర్డును పట్టించుకోని నరేంద్ర మోదీ ఎన్నికల సమయానికి ఇందూరుకు వచ్చి పసుపు బోర్డు ప్రకటన చేసి.. కేసీఆర్ కుటుంబంపై అందమైన అబద్ధాలతో ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేసినప్పటికీ ఇక్కడ ఫలించలేదు. తెలంగాణ పై విషం చిమ్ముతూ తెలంగాణ ఏర్పాటును పదే పదే మోదీ వ్యతిరేకిస్తూనే ఇక్కడ అధికారం కోసం ఆరాటపడుతున్నారు.
తెలంగాణ ఇప్పుడు దశాబ్దాల చరిత్ర ఉన్న జాతీయ పార్టీలను ఢీకొట్టే స్థాయికి దశాబ్ద కాలంలోనే ఎదిగింది. ఈ ఉన్నతిని ఇప్పు డు దెబ్బతీయకుంటే కేసీఆర్ అనే రాజకీయ శక్తి భారతదేశ రాజకీయాల్లో సంచలనంగా మారుతుందనే భయం జాతీయపార్టీలకు పట్టుకున్నది. పరిపాలన ఇబ్బందులను, న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటూ, కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. ఈ మధ్యనే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించారు. ఇటువంటి శాశ్వత పథకాలను ప్రారంభిస్తూ… తెలంగాణ సంక్షోభాన్ని సుభిక్షం చేస్తున్నారు. అటువంటి కేసీఆర్ను ఓడించాలంటూ.. మాట్లాడే వారి అధికార దాహన్ని తెలంగాణ స మాజం పసిగట్టాల్సిన అవసరం ఉన్నది. వారి అధికార దాహనికి తెలంగాణ వేదికగా కాకుండా చూడాల్సిన అవసరం ఉంది.
-సంపత్ గడ్డం
7893303516