ఓ పదేండ్ల కిందట తెలంగాణ ప్రాంతంలో ‘రైతు’ అంటే ఆత్మహత్యలకు పర్యాయపదం. తెలంగాణ అంటే నెర్రెలిచ్చిన భూములు, డొక్కలెండిన రైతులకు కేరాఫ్ అడ్రస్. ఏటా విడుదలయ్యే నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో రిపోర్టులో ఆత్మహత్యల్లో తెలంగాణ రైతులే ఎక్కువగా ఉండేవారు. నాటి దుర్మార్గ నాయకుల పాలనకు నిదర్శనం ఇది.
అప్పుడు కూడా ప్రభుత్వాలున్నాయి, పార్టీలున్నాయి, పాలకులున్నారు. ఇప్పుడు మాకు ఒక్క అవకాశాన్నివ్వండి అంటూ వస్తున్న కాంగ్రెస్ పార్టీనే నాడు అటూ ఇటుగా ఐదారు దశాబ్దాల పాటు దేశాన్ని పాలించింది. ఇటు రాష్ట్రంలోనూ వారి పాలనే. ఊళ్లో కోడి కూత వినిపించని రోజులున్నాయేమో గానీ, రైతు ఇంట రోదనలు వినిపించని రోజులు మాత్రం లేవు. పంటకు పట్టిన చీడను చంపడానికి వేయాల్సిన తిమ్మట (థైమెట్) గోళీలు, ఎండ్రిన్ మందు రైతులకు నాడు ఆత్మహత్యా సాధనాలయ్యాయి. నాడు పదెకరాల భూమి ఉన్నా ఆ రైతు కటిక పేదవాడే. ఎందుకంటే అందులో ఎకరం పారేందుకు కూడా నీళ్లు లెవ్వు. వానలు పడితే కరెంటు కష్టాలు కన్నీరు పెట్టించేవి. అటు విత్తనాలు, ఎరువుల తిప్పలు రైతన్నను ఏడిపించని కాలం లేదు. వాటికోసం ప్రాణాలు పణంగా పెట్టాల్సిన పరిస్థితి. తలలు పగిలితే గానీ తట్టెడు ఎరువులు దొరకని దారుణ స్థితి. పంట చేతికిరాక పురుగు మందులే రైతులకు పెరుగన్నమైన రోజులవి. పేరుకే ఎరువులు, విత్తనాల సబ్సిడీలు. అసలు విత్తనాలు, ఎరువులే దొరకనప్పుడు ఆ సబ్సిడీలు ఇచ్చి ఏం ప్రయోజనం? పంట పెట్టుబడికి పైసలుండవు. వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్లి డబ్బులు తెచ్చినా అవి తిరిగికట్టే పరిస్థితి ఉండేది కాదు. ఆ అప్పు కింద ఇళ్లకు తాళాలేసిన రోజులు ఇంకా కండ్లముందే కదలాడుతున్నాయి. బ్యాంకోళ్లు వచ్చి అప్పు కింద ఇంట్లో సామాన్లు.. కరెంటోళ్లోచ్చి ఫ్యూజ్లు పీక్కొనిపోయిన రోజులు మనం చూడనివా? ఎటుచూసినా అన్నదాత ఆక్రందనలే తప్ప ఆనందంగా కనిపించిన రోజులు లేవు.
రైతులు పడ్డ ఇన్ని కష్టాలు కాంగ్రెస్ పాలనలోనే. అదే కాంగ్రెస్ ఇప్పుడు మళ్లీ వచ్చి రైతులకు అది చేస్తాం, ఇది చేస్తాం.. అంటూ ఆరు గ్యారంటీల పేర అలవిగాని హామీలిస్తున్నది. దశాబ్దాల పాటు దేశాన్ని, రాష్ర్టాన్ని పాలించినా రైతుల బతుకులను మార్చని కాంగ్రెస్ ఇప్పుడు మళ్లా అధికారంలోకి వచ్చి ఏం చేస్తుంది. సరైన టైంలో విత్తనాలు, ఎరువులు ఇవ్వాలనే సోయి కాంగ్రెస్కు లేదు. అప్పుల కూపం నుంచి రైతుకు విముక్తి కల్పించే రైతుబంధు వంటి పథకాలకు రూపకల్పన చేయాలనే సోయి లేదు. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేకి అవుతుంది కానీ, రైతుల పక్షపాతి ఎలా అవుతుంది? దశాబ్దాల పాటు దేశాన్ని పాలించినప్పుడే రైతులను పట్టించుకోనోళ్లు.. ఇప్పుడు ఒక్క తెలంగాణలో అధికారం ఇస్తే వారి బతుకులను బంగారుమయం చేస్తామని చెప్తున్న మాటలు మాయమాటలు కాకపోతే ఇంకేమవుతాయి?
మోసేవాడికే తెలుస్తుంది కావడి బరువు అన్నట్టు ఓ రైతుకే ఆ రైతు బాధేంటో తెలుస్తుంది. బ్లాక్ మెయిలర్లకు, బ్రోకర్లకు, పెట్టుబడిదారులకు, ప్రజల సొమ్మును నొక్కేసి, బ్యాంకులకు ఎగనామం పెట్టేసి వ్యాపారాలు చేసేవాళ్లకు తెలువదు రైతు బాధ. కేసీఆర్ స్వయంగా ఓ రైతు. అందుకే ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఎక్కువగా శ్రద్ధపెట్టింది వ్యవసాయరంగంపైనే. వచ్చీ రాగానే కరెంటు సమస్య తీర్చారు. నీళ్ల కష్టాలు తీర్చారు. ఇప్పుడు విత్తనాలు, ఎరువుల కోసం తిప్పలు లేవు. రైతులకు పంట పెట్టుబడి కష్టాలు లేకుండా, రైతన్నలు అప్పుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరిగి ఆర్థికంగా చితికిపోకుండా రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చారు. కానీ, ప్రతీది డబ్బుల కోణంలోనే చూసే వ్యక్తి, డబ్బుల కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఇవన్నీ ఏం తెలుసు? దేశానికి అన్నం పెట్టే రైతన్నను గౌరవించాలనే కనీస సోయి కూడా ఆయనకు లేదు. రైతుల గౌరవాన్ని పెంచేలా ప్రభుత్వం ఇస్తున్న రైతుబంధును బిచ్చం అంటూ మాట్లాడి రైతులోకాన్ని అవమానపరిచాడు. రైతుబంధు రైతుల్లో ఆత్మస్థయిర్యాన్ని నింపింది.
రేవంత్రెడ్డికి మొదటినుంచి రైతులంటే చిన్నచూపే. ఉచిత కరెంటు విషయంలోనూ రైతులకు 3 గంటల కరెంటు సరిపోతుంది, 24 గంటలు ఎందుకంటూ రైతులపై తనకున్న అక్కసును ప్రదర్శించాడు. ఇప్పుడు రైతుబంధు విషయంలోనూ అదేవిధంగా ప్రవర్తిస్తున్నాడు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులను నట్టేట ముంచడం ఖాయంగా కనిపిస్తున్నది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే పొరుగున ఉన్న కర్ణాటక. అక్కడ కూడా ఇలాగే గ్యారంటీలని గప్పాలు కొట్టి ఇప్పుడు చేతులెత్తేసింది హస్తం పార్టీ. ఒక్కమాటలో చెప్పాలంటే పదేండ్ల కింద తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం ఎలాంటి దుస్థితిలో ఉన్నామో.. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్కు ఓటేసిన పాపానికి అక్కడి రైతులు అదే దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మా కర్మగాలి కాంగ్రెస్కు ఓటేశామని కన్నడిగులే స్వయంగా చెప్తున్నారంటే హస్తం ఎప్పటికీ భస్మాసురహస్తమే కానీ, అభయ హస్తం కాబోదని మరోసారి తేటతెల్లమైంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో వ్యవసాయం పండుగైంది. సాగునీటి పరవళ్లు, కరెంటు వెలుగులు, ధాన్యపు రాశులు తొణికిసలాడుతున్నాయి. ఇలాంటి తెలంగాణను తీసుకెళ్లి భస్మాసుర హస్తంలో పెడితే తెలంగాణ ఆగమవ్వడం ఖాయం. ఎందుకంటే రేవంత్రెడ్డి అనే వ్యక్తి తెలంగాణకు, తెలంగాణ రైతాంగానికి బద్ధ వ్యతిరేకి. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్నవారిని తుపాకీతో కాల్చి చంపుతానని ఉరికిన నీచుడు. ఉద్యమాన్ని ఉరకలెత్తించిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను తాగుబోతులని అవమానించిన ఓ దురహంకారి. ఇలాంటి నాయకుల చేతిలోకి తెలంగాణ వెళ్తే రాష్ట్ర ప్రజలకు మిగిలేదేమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
(వ్యాసకర్త: రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ చైర్మన్)
– వై.సతీష్రెడ్డి 96414 66666