తెలంగాణ ఇప్పుడు క్రాస్రోడ్లో నిలబడి ఉన్నది. ఇప్పటిదాకా నడిచిన దారి ఇక్కడినుంచి రెండుగా చీలనున్నది. ఒకటి నిర్మాణపు రహదారి. రెండవది విధ్వంసపు వినాశక దారి. రెండూ ఒకేలా కనిపించడం ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న కనికట్టు.
ఓటు కూడా యుద్ధంలో భాగంగా చూసి మరీ ఓటెయ్యాలి. యువత ఇందులో ప్రధాన పాత్ర పోషించాలి. ఎట్లున్న తెలంగాణ? ఎట్లయిన తెలంగాణ?ఎట్లుండాల్సిన తెలంగాణ? అన్నదానిపై బరాబర్ చర్చించాలి. తెలంగాణ ఊరంటే.. తెలంగాణలో పోరాటాల ఆరాటాలంటే.. తెలంగాణలో బతుకు సమరమంటే.. తెలంగాణలో అణచివేతలపై జరిగిన తిరుగుబాట్లంటే.. మామూలువి కావు. బిడ్డల్లారా మీరు ఆలోచించండి. కాంగ్రెస్లో పెత్తందారీతనం ఎలగబెట్టిన పెద్దలెవరో.. వాళ్లు తెలంగాణను అరువై ఏండ్లు ఎంత ధ్వంసం చేసిండ్రో తెలుసుకొని అడుగువేయాలి. యువ స్నేహితుల్లారా.. మీకు తెలంగాణలో ఎన్నెల చూడని రాత్రులుండేయి తెలుసా? రాచకొండ గుట్టల నుంచి ‘దారెంట పోతుంటే ఎలమందా వాడు చిన్నా పోరగాడు ఎలమందా’ అన్న పాట ల్లోతుల్లోకి ఒక్కసారి సూడండి. యువ బిడ్డల్లారా.. తెలంగాణలో నరమేధం లాంటి ఎన్కౌంటర్ల నెత్తురు ముద్దల శవాల గుట్టలు ఎవరివి? వాళ్లెవరు? ఎవరి పాలనల్లో ఎన్కౌంటర్ల నెత్తురుతో ఈ నేల మరుభూమిగా మారిందో ఆలోచించాలి. యువ నేస్తాల్లారా… తెలంగాణలో పదిహేనేండ్ల కిందట, ఇప్పుడు మీ వయస్సులో ఉన్న పిల్లలు తుపాకులు పట్టుకొని అడవుల బాటెందుకు పట్టారో ఆలోచించాలి. నేస్తాల్లారా.. మీ వయస్సు బిడ్డలు బొంబాయి, బొగ్గుబాయి, దుబాయిలకు వలసెందుకు పోయారో ఆలోచించండి. యువకుల్లారా.. వలసలకు.. గోదావరి లోయ తీరం వెంబడి ప్రవహించిన నెత్తరుటేర్లు ఏ తల్లి పేగులు తెగిన బిడ్డలవో ఒక్కసారి గుండెపెట్టి ఆలోచించండి.
యువతీ యువకుల్లారా… ‘సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్.. రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదరూ’ అన్న పాట హైస్కూళ్ల నుంచి యూనివర్సిటీల వరకు కంజీర్లపై డప్పుకొడుతూ వీధి వీధి యువత తిరుగుతూ పాటలు పాడటానికి ఏ పార్టీ జెండాల నేతలు కారకులో ఒక్కసారి సింహావలోకనం చేయండి.
కొత్తతరం యువకుల్లారా.. నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు నీళ్లు లేక లక్షలాది ఎకరాలు ఎండిపోతుంటే చూస్తూ కాలక్షేపం చేస్తూ ఎన్నికల్లో మాయమాటలతో గెలుస్తూ 60 ఏండ్లు గద్దెలెక్కి పాలించిన పెత్తందార్లు ఎవరో… జానపాడు సైదులు, మెదక్ చర్చీ, లింగమంతుని జాతర, సమ్మక్కసారక్కల సాక్షిగా ఆలోచించాలి. నవయువకుల్లారా.. పోడు భూముల కోసం ఎంత మంది నేలకొరిగారో ఒక్కసారి వెనక్కి తిరిగి బయ్యారం, కొమరారం గుట్టలనడగండి, ఆదిలాబాద్ గోండన్నల గుండెల నడగండి చెప్తాయి. చివికిపోయి శిథిలావస్థకు చేరుకున్న ప్రభుత్వ బడుల దుస్థితికి అసలు కారకులెవరో లోతుగా ఆలోచించాలి.
ప్రభుత్వ బడులను చంపి కార్పొరేట్ విద్యకు ప్రాణం పోసి, వాటి తలుపులు తెరిచిన పెద్దలెవరో?, ఏ పెత్తందారులో?, ఏ పార్టీ నేతలో ఒక్కసారి ఆలోచించండి. యువకుల్లారా.. కృష్ణా, గోదావరి జలాలు ఎగువ భూములకు వెళ్లవని అరువై ఏండ్లు తెలంగాణను నీళ్లు లేకుండా ఎండబెట్టి కరువు ప్రాంతాలుగా మార్చిందెవరో ఒక్కసారి ఈ సందర్భంగా మననం చేసుకోవాలి. దళిత, బహుజన పేదవర్గాల తల్లుల పగిలిన పాదాల సాక్షిగా తాగు నీళ్ల కోసం కోసుల కొద్దీ పోయి కడవలతో, కుండలతో నడిచిన నడకల దారులు ఏ పల్లెనడిగినా చెప్తాయి వినండి. ఇంటింటికి నల్లా అన్నది పథకం మాత్రమే కాదు, అది తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి సంబంధించిన ముఖ్య విషయం అన్నది గుర్తెరగాలి. గోరటి వెంకన్న నల్ల తుమ్మ చెట్టు పాట సాక్షిగా తెలంగాణ గట్టులు గుట్టలు పచ్చబడి జీవాలకు మేత దొరుకుతుంది. ఒక్క తెలంగాణలోనే ఎండకాలంలో కూడా చెరువులు అలుగులు పారి, మత్తళ్లు దుంకుతున్నాయి. పాలమూరు గంజి కేంద్రాలు పోయి వలసలు ఆగిపోవటం మామూలు విషయం కాదు. యువ సామాజిక శాస్త్రవేత్తల్లారా ఆలోచించండి. ఏ పార్టీల హయాంలో హైదరాబాద్లో మత ఘర్షణలు, కత్తిపోట్ల సంఘటనలు, కర్ఫ్యూలు వచ్చాయో అవగతం చేసుకోవాలి. తెలంగాణ వచ్చినంక గంగా జమునా తెహజీబ్ సంస్కృతికి పట్టం గట్టింది నిజం. తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి. మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రి బాయి ఫూలే ఆలోచనాదారుల్లో 1,002 గురుకులాలు వచ్చాయి. ఇది దేశంలో ఏ రాష్ట్రంలో లేనిది. ఫూలే ఆలోచనాదారుల్లో సంచారజాతుల బిడ్డలు సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా ఎదుగుతున్నారు. తెలంగాణ వచ్చినంక ప్రభుత్వ కొలువుల్లో నియామకాల సంఖ్య పెరిగింది. ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల సంఖ్య పెరిగింది. తెలంగాణ తనను తాను పునర్నిర్మించుకుంటున్నప్పుడు అన్నీ ఒక్కసారిగా జరుగవు. కానీ, అన్నీ జరగాలి. అందరికీ న్యాయం జరగాలి. సమన్యాయం, సమభావం, సమతారాజ్యం దిశగా అడుగులు వేయాలి.
‘సంపద పెంచాలి- సంపద పంచాలి’. అన్నార్తులు, అనాథలుండని ఆకలిరాజ్యాలు లేని సుఖశాంతుల తెలంగాణ పకడ్బందీగా నిర్మించబడాలి. ఇపుడు తెలంగాణలో ఆకలితో చనిపోయేవాళ్లు కనిపించరు. తెలంగాణ దేశానికే ధాన్యాగారమైంది. ఇది మామూలు విషయం కాదు. పల్లె.. పట్టణంగా, పట్టణం.. నగరంగా, హైదరాబాద్ దేశానికే గుండెకాయగా మారటమన్నది రాష్ట్ర అవతరణ తర్వాత జరిగిన పరిణామక్రమంగా చెప్పాలి. పాలనారంగ విప్లవాలు, ఆరోగ్య తెలంగాణ, హరిత తెలంగాణ, పల్లె, పట్టణ ప్రగతులు వేగవంతంగా జరుగుతున్న మార్పులను చూడాలి.
రేపటి ఎన్నికల్లో గట్టెక్కడానికి ఎవరెవరు ఎన్నెన్ని మాటలైనా చెప్పవచ్చును. తెలంగాణకు దార్శనిక ఆలోచనలు గల నాయకుడెవరో చైతన్యవంతమైన తెలంగాణ ప్రజలు గుర్తించగలరు. మాయాలాంతరులా భ్రమింపజేసి అబద్ధాల్ని నిజాలు చేసి, నిజాలను అబద్ధాలు చేసి గందరగోళ ప్రచారాలను చైతన్యవంతమైన తెలంగాణ సమాజం గుర్తించగలదు. ఎన్నికల సభల నుంచి ఇండ్లకు పోయినంక తప్పక ఆలోచించాలి. అప్పటి తెలంగాణకు, స్వరాష్ట్ర తెలంగాణకు తేడాను చర్చించాలి. తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వం ఏ విధంగా తెలంగాణకు కవచమో లోతుగా పరిశీలించాలి. ఇన్నాళ్లు తెలంగాణను విధ్వంసం చేసిందెవరు? తెలంగాణను పునర్నిర్మిస్తున్నదెవరు?అన్న విషయం ఆలోచించే తెలంగాణ తీర్పునిస్తుంది. తెలంగాణ మోసపోదు. పైపై మెరుగులకు భ్రమ పడదు. తన దారేదో తనకు బాగా తెలుసు.
-జూలూరు గౌరీశంకర్