ఇంటికి బరువై, ఊరికి కరువై దేశంబోవుడో, అడవిలో ఆయుధమై పేలిపోవుడో తప్ప ఆనాడు ఆశావహ బతుకులెక్కడివి? ఎగుసం లేక, ఏ పనీ దొరకక పల్లె పల్లేర్ల వనమై, ప్రభుత్వాలు పగబట్టిన యమకింకరులై, కలలను కాటికి పంపిన పదేండ్ల కిందటి పాశవిక దినాలను మన తెలంగాణ మరువగలదా?. ఉరిమిన ఉక్కు పిడికిళ్లకు బేడీలూ.. నిలదీసిన నవలోకానికి చెరసాలలు బహూకరించిన గత సర్కార్లు, రంగుల లోకం కలగనే ఉక్కు కండరాలను నెత్తుటి మడుగుల్లో ముంచేవారు. ఉద్యమ సందర్భంలో కేసీఆర్ తన ప్రసంగంలో చెప్పినట్టు సిద్దిపేటలో బస్సెక్కినోడు, పట్నంలో దిగుతాడనే గ్యారెంటీ లేని రోజులు కదా అవి!.
కొలువుల సంగతి పెరుమాళ్ళకెరుక… మనుషులనే మాయం చేసే సర్కార్లు ఆనాడు రాజ్యమేలాయి. ఎండిన చెరువులో చేపపిల్లలా, తగలబడుతున్న గడ్డి వాములో దాగిన సీతాకోకల్లా తెలంగాణ యువలోకం ఎంత దావాగ్నిని మింగిందో లెక్కేలేదు. ఊపిరి పణంగా పెట్టి విప్లవిస్తేనే గానీ, కొసరి కొసరి విసిరిన పోలీసు, టీచరు నౌకర్లు తప్ప మరే కొలువుల భర్తీ ఉండేదేకాదు. అసలు పునాది రంగాన్ని పండబెట్టి పాతాళానికి తొక్కి, సాగును ఉరికొయ్యకు వేలాడదీసి, పల్లెలను ఆదెరువు లేని అనాథల్లాగా మార్చేశారు.
Telangana | దశాబ్దం కిందట కుడి, ఎడమల దగా తప్ప ధైర్యం కలిగించే, దారిచూపించే విధానాలు ఎక్కడివి?. ఉపాధి ఎండమావై, కడుపులు ఖాళీ కుండలై, ముప్ఫై ఏండ్లు నిండకముందే నుదిటి మీద ముడతలు వచ్చి, వంగి నడిచే దుస్థితికి నవతరం నెట్టివేయబడింది. వరల్డ్ బ్యాంక్ డిజైన్ చేసిన రిక్రూట్మెంట్ మాడల్తో, యువతరం భవితవ్యాన్ని నీళ్లు లేని బావిలోకి తోసేశారు. స్థానిక అవసరాలు, అస్తిత్వం, ప్రాధాన్య రంగాలు, మానవ, మేధో వనరుల గీటురాయిగా కాకుండా, అప్పులిచ్చిన ఆసాములు ఆదేశించిన దారిలో, గాసగాళ్లను తయారుచేసే ఉత్పత్తి కర్మాగారంలా గత గుడ్డెద్దు గవర్నమెంట్లు మసలుకున్నాయి. దానివల్లే తెలంగాణలో చెమటా, నెత్తురూ తప్ప.. పుట్టుక, చావుకు మధ్య మరే మార్పు ఎరుగని తరాలు అనేకం తండ్లాడి వొరిగిపోయాయి. కానీ, నేల పొరల్లోకి, నీటిబొట్లలోకి, నుదుటి గీతల్లోకి, కండ్లతో పాటు మనసునూ వొంపి చూడగలిగే వివేకమున్న, హృదయం కలిగిన కేసీఆర్ సర్కార్ లాంటిది మనుగడలో ఉంటే, మార్పు ఎలా సాకారమౌతుందో ఈ దశాబ్దం మనకు చూపెట్టింది.
కాకి అరుపులతో కొలువుల భర్తీపై విషం కక్కిన కబోదులు, అబద్ధాలకు నోరెక్కువ అన్నట్టు సమాజంలో శబ్ద కాలుష్యం రాజేయడంలో కొంత విజయం సాధించగలిగారు. చేసింది సరైన తీరులో చెప్పుకోలేక, చెప్పాల్సిన వారి చెవిలో జోరీగలా మారి ఊదలేక, శంకులో పోస్తేనే తీర్థంలా, చెప్పించాల్సిన వారితో చెప్పించలేక, గులాబీ శ్రేణులు కొంత ఏమరుపాటుతో ఉండటంతో సత్యం శిలువకు వేలాడదీయబడింది. ఎన్నికల గోదాలో… గెలుపు, ఓటములను, ఎన్నో మాయోపాయాలు ప్రభావితం చేసే భ్రమాన్విత రోజులివి. కానీ, వెయ్యేండ్ల తర్వాత తవ్వితీసినా సత్యం మాలిన్యం అంటని ముత్యమే కదా?. మొన్నటినీ, నిన్నటినీ, నేటినీ, చరిత్ర దర్పణంలో కామెర్ల రోగం సోకని నయనాలతో చూసినప్పుడు, నిజాలు నగ్నంగానే దర్శనమిస్తాయి. నినాదాలు నూరుకోవడం, నమ్మించిన ప్రతి జెండా భుజానికెత్తుకొని మర్లబడి మరిగిపోవటం తప్ప, గులాబీ పతాకం పైకెగిరేదాక యువత విముక్తికి వివేకవంతమైన తొవ్వ దొరికిందెన్నడని..?. ఆ పోరాటం, పడిలేచిన ప్రజాస్వామిక సమరంలో నుంచే, కేసీఆర్ తెలంగాణ యువశక్తి శోక విముక్తికి మార్గాలను సిద్ధం చేశాడు.
ఒక్కటో, రెండో రంగాల్లోనే ఉపాధిని చూపే గత సర్కార్ల వక్ర విధానాలను విసిరేసి, తెలంగాణ అవసరాలు, అస్తిత్వం, అభివృద్ధే కొలమానంగా స్వరాష్ట్రంలో కొలువులు సృష్టించబడ్డాయి. దండుగ అని ఏలినవారే డప్పేసిన పునాది రంగమైన వ్యవసాయ రంగంలోనే అద్భుతాలు సాకారమయ్యాయి. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు సహితం సాగు రంగాన్ని ఇష్టపడి ఎంచుకునే కామధేనువుగా వ్యవసాయ వ్యవస్థ తీర్చిదిద్దబడింది. గ్రామీణ యువతకు ఊరిడిసి నే బోదునా, అయ్యో ఉరివోసుకొని నే సద్దునా అనే రోజులూ, రోదనా దూరమైపోయాయి. ఉన్న ఊరిలోనే, కన్నవారితోనే కలిసి, ఆఫీసు పని వేళల్లానే, పొలాల్లో పని చేసుకొనే మంచి దినాలు మన తెలంగాణకు వచ్చాయి.
పల్లెల్లో చేవగలిగిన నవతరానికి 24 గంటల ఉచిత కరెంటు, పెట్టుబడి సహాయం, సాగునీరు నూతన భవితవ్యాన్ని కలిగించాయి. పదేండ్ల తెలంగాణ వ్యవసాయ విప్లవం వందేండ్ల దరిద్రాన్ని కడిగేసింది. చేతినిండా పని, కంటి నిండా నిద్రతో, ఊరూరా నవతరంలో నూతనోత్తేజం పరిఢవిల్లింది. దీనికి తోడు వ్యవసాయాధారిత రంగాల్లోనూ ఉత్పత్తి, ఉపాధి పెంచే ఎన్నో విధానాలను కేసీఆర్ సర్కార్ అమలుచేసింది. ఒక్క గొర్రెల పంపిణీ పథకమే మాంసం దిగుమతి చేసుకునే తెలంగాణను, ఎగుమతి చేసే రాష్ట్రంగా తీర్చిదిద్దింది. ఇలా ఎన్నో నూతన ఉపాధి కల్పన మార్గాలకు గ్రామాలే వేదికలుగా మారిపోయాయి. పడావు పడేసిన బావుల్లా గత ప్రభుత్వాలు వదిలేసిన, మత్స్య, వ్యవసాయ శాఖలకు వైభవమొచ్చింది. ఒకనాడు కానిస్టేబుల్, ప్రైమరీ టీచర్ కొలువులు తప్ప మరేవీ భర్తీకి నోచుకోకపోయేవి. అదొక అణచివేత ప్రభుత్వ పాలసీ. కానీ, వ్యవసాయ విస్తరణ అధికారులు, ఇరిగేషన్, విద్యుత్తు రంగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్లు తదితర ఉత్పాదక, తెలంగాణ సమాజానికి అవసరమైన కీలక, వెన్నెముక రంగాల్లో వేలాది కొలువులు భర్తీ చేయడం వల్ల, ప్రత్యక్షంగా, పరోక్షంగా పునాదిలో సాకారమైన ప్రయోజనాలు వెలకట్టలేనివి. వాటి ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీలు, వివిధ విభాగాల్లో దేశంలోని ఇతర రాష్ర్టాలను వెనక్కి నెట్టి, అనేక కేంద్ర ప్రభుత్వ అవార్డులను గెలుచుకున్నాయి.
తలసరి ఆదాయం, జీఎస్డీపీ ఎన్నో రెట్లు పెరిగి, అభివృద్ధిలో అగ్రస్థానం పొందింది మన తెలంగాణ. ఉపాధిని ప్యాకేజీల కొలమానంతో అంచనా వేయలేం. సుస్థిర అభివృద్ధి, పునాది రంగంలో అనుభవంలోకి వచ్చిన సకారాత్మక మార్పు ద్వారా మాత్రమే, ఉపాధి కల్పన లక్ష్యం నెరవేరుతుందని అభివృద్ధి అంచనా నిపుణులు చెప్తున్నారు. ఆ కోణంలో తెలంగాణ పదేండ్లలోనే ఎన్నో శిఖరాలను అధిరోహించింది. రాష్ట్ర ఆర్థికవ్యవస్థకు వెన్నెముక అయిన వ్యవసాయరంగం ఉపాధి, ఉత్పత్తి రంగంగా ఎదిగి, దానిచుట్టూ ఆరోగ్యకర ఆర్థికవ్యవస్థ నిర్మాణం జరిగింది. సంఘటిత, అసంఘటిత రంగాలపై సమాన దృష్టి కేంద్రీకరించి, సకారాత్మక వృద్ధి నమూనాను ఉపాధి అవకాశాలతో అనుసంధానం చేసింది కేసీఆర్ ప్రభుత్వం. భారతదేశ ఉపాధి కల్పన రంగంలో అమలులో ఉన్న, పైనుంచి కిందికి అనే అశాస్త్రీయ నమూనాను తిరగరాసి, పునాది నుంచి పైకి అనే శాస్త్రీయ దృక్పథాన్ని గులాబీ సర్కార్ అమలుచేసింది. నిజానికి ప్రగతి చరిత్రలో సమాజ ఉత్థాన, పతనాలను పట్టిచూపేది ఊరు, చెరువే. తెలంగాణ గ్రామాలు, చెరువులు భుజం భుజం కలిపి నూతన అధ్యాయం నెలకొల్పాయి. కొన్ని నోళ్లు అశుద్ధం కక్కొచ్చు, మరికొన్ని మైకుల నుంచి మలినం ప్రసారం చేయవచ్చు, కానీ చెరువు, ఊరు ఎప్పుడూ అసత్యమాడవు.
తెలంగాణకు ప్రాణమైన ప్రాథమిక రంగం వ్యవసాయంలో గ్రామీణ యువతరానికి ఉజ్వల ఉపాధి కల్పిస్తూనే, మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలోనూ, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనన్ని కొలువులను కేసీఆర్ ప్రభుత్వం భర్తీచేసింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి దశాబ్దన్నర మునుపే, 2000 సంవత్సరంలోనే ఏర్పడిన ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ర్టాల కంటే, ఎన్నో వేల ఎక్కువ ఉద్యోగాలను పదేండ్లలోనే కేసీఆర్ ప్రభుత్వం భర్తీచేసి చూపెట్టింది. దేశంలోని కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాల కంటే, అత్యధిక సర్కార్ కొలువుల భర్తీ తెలంగాణ రాష్ట్రంలో జరిగింది.
విభజన సమస్యలు, కేంద్ర సహాయ నిరాకరణ, జోన్ల జగడం, న్యాయపరమైన చిక్కుముడులు, ఇలా ఎన్నింటినో అధిగమించక తప్పని సంక్లిష్టమైన పరిస్థితిని కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొన్నది. గంపకింద ముండ్ల బాధ ముందు నెత్తికెత్తుకున్నోళ్లే భరించక తప్పదన్నట్టు రాష్ట్ర ఆవిర్భావ తొలినాళ్లలో ఎన్నో సవాళ్లను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎదుర్కోక తప్పలేదు. వాటి పరిష్కారానికి కేసీఆర్ పడ్డ సంఘర్షణ, లంకె బిందెలు కలగని కుర్చీనెక్కినవారికి అర్థమౌతుందని మనమెవ్వరూ అనుకోలేం. అన్ని అవాంతరాలను దాటి 2 లక్షల 32 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పరిపాలనపరమైన అనుమతులు మంజూరు చేసింది. అందులో 1 లక్షా 60 వేల కొలువులను వివిధ ప్రభుత్వ శాఖల్లో భర్తీచేసింది. మరో 30 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చివరి దశలో ఉండగా, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నిలిచిపోయాయి. వాటి నియామక పత్రాలనే అధికారంలోకి రాగానే రేవంత్రెడ్డి సర్కార్ అందజేస్తూ, రాజకీయ చేతివాటపు తనాన్ని ప్రదర్శిస్తున్నది. వ్యవసాయ, సాగునీటి, విద్యుత్తు, రెవెన్యూ, పోలీస్ గురుకులాల లాంటి ఎన్నో ముఖ్యమైన, అవసరమైన ప్రభుత్వ విభాగాలలో ఉద్యోగాల కల్పన జరిగింది.
తెలంగాణ ఉద్యమ నినాదంలోని నియామకాల లక్ష్యాన్ని అందుకోవడానికి కేసీఆర్ ప్రభుత్వం ఎంతగానో శ్రమించడం వల్లే 1 లక్షా 60 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సాకారమైంది. ఇంతచేసినా, నియామకాల అంశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిందలే మోయాల్సి రావడం నిజంగా ఆవేదనాభరితమే. వ్యవస్థాగత దీర్ఘకాలిక రుగ్మతలు ఒకటో, రెండో అవాంఛనీయ సంఘటనలు కల్పిస్తే, వాటిని సర్కార్ కుట్రలుగా విపక్షాలు విష ప్రచారం చేశాయి. అయితే దాన్ని తిప్పికొట్టడంలో ప్రగతివాదులు చూపాల్సిన చొరవ చూపకపోవడం వల్ల, అబద్ధం అందమైన మేకప్ తొడుక్కొని, తెలంగాణ అంతటా ఏకపాత్రాభినయం చేసింది. ఏదేమైనా చాట్లో పోసుకొని చరిత్రను చెరగగలగడం సాధ్యమా?. ఉక్కేదో, తుక్కేదో కాలం కొలిమిలో బట్టబయలు కాకుండా పోదు కదా?. గోబెల్స్ ప్రచారం గోడ దూకగలిగినా, పట్టుబడిపోకుండా ఎంతో కాలం తప్పించుకోలేదు. తెలంగాణ నవతరానికి నూతన భవితను కల్పించాలనే సదాశయమే కేసీఆర్ సర్కార్కు కొలమానంగా ఉండింది. ప్రాణం పణంగా పెట్టి పోరాడిన ఉద్యమనేతకు, నిర్మాణాత్మక వ్యవస్థను నిర్మించాలనే తపన తప్ప మరో ఆలోచన ఎందుకుంటుంది?. రాష్ట్ర సాగు, నీటి, కరెంటు, విద్యావ్యవస్థలు ఆరోగ్యకర ఉత్పత్తి కేంద్రాలుగా మారడం వెనుక నిధుల కేటాయింపుతోపాటు కొలువుల భర్తీ కూడా కారణమే కదా? సత్యం నిత్యం ప్రచారంలో ఉండకపోతే, సమాజానికి ఎంత ప్రమాదమో ఇప్పుడు బుద్ధి జీవులందరికీ అర్థమౌతున్నది.
రాష్ట్ర అన్నిరంగాల నిర్మాణాత్మక పురోభివృద్ధి యజ్ఞంలో, యువతను క్రియాశీలక ప్రతినిధులుగా తీర్చిదిద్దే పాలనా నమూనా పదేండ్లు అమలుపరుచబడింది. నిర్మాణాత్మక పెట్టుబడి, సుస్థిరాభివృద్ధి విధానాలతో, తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక రంగంలోనూ అవకాశాల విప్లవాన్ని దశాబ్ద స్వల్ప కాలంలోనే సాధించింది. ఐటీ, పరిశ్రమల రంగంలో పక్క రాష్ర్టాలవారికే కాదు, ప్రపంచ పెట్టుబడిదారులకూ గమ్యస్థానంగా తెలంగాణ మారింది. రాష్ట్ర ఏర్పాటునాటి ఐటీరంగ స్థితికి, పదేండ్ల తర్వాత ప్రస్తుత స్థాయికి నక్కకూ నాగలోకానికి ఉన్న వ్యత్యాసం సాకారమైంది. దేశ సగటుతో పోలిస్తే ఐటీ రంగంలో రాష్ట్రం రెట్టింపు వృద్ధిని నమోదు చేసింది. 2013-14లో 58 వేల కోట్లున్న ఐటీ ఎగుమతులు, 2022-23 నాటికి 2,41,275 కోట్లకు చేరుకున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం నాటికి ఐటీ రంగంలో 3 లక్షల 23 వేల 700 మంది ఉద్యోగులు ఉండగా, 2022-23 నాటికి 9,05,715 మంది ఉద్యోగులు పనిచేసే స్థాయికి ఈ రంగం ఎదిగింది. పదేండ్లలో ఒక్క ఐటీలోనే కొత్తగా 5.82 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి. తొలినాళ్లలోనే దీర్ఘదృష్టితో, 2013-14లో పారిశ్రామిక రంగంలో టీఎస్-ఐపాస్ చట్టంతో, నూతన పారదర్శక పారిశ్రామిక విధానాన్ని అమల్లోకి తేవడం వల్ల, వేలాది జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మార్గం సుగమమైంది. ఫలితంగా 19 వేల 837 పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు పొంది, దాదాపు 2,34,836 కోట్ల పెట్టుబడులు రాష్ర్టానికి తరలివచ్చాయి.
ఆరు దశాబ్దాల విధ్వంసక అభివృద్ధి నమూనా తెలంగాణ యువతరానికి ఆశలు, ఆశయాల ఊసే లేకుండా చేస్తే, దశాబ్దకాలం మాత్రం ఎదుగుదలకు ఆకాశమే హద్దును వాగ్దానం చేసింది. స్వల్ప కాలంలో అన్నీ సమకూర్చడం అతీత శక్తులు ఉంటే తప్ప మానవ మాత్రులైన ఎవరికీ సాధ్యపడదు. తరుముతున్న వేగంతో, చేయాల్సినంత చేసినా, అంతా కోల్పోయిన సమూహానికి ఇంకా చేయాల్సింది మిగిలే ఉంటుంది. జరిగింది కొండంత అయితే, మిగిలింది రవ్వంత.
కిటెక్స్, లిపిడ్ ప్రైవేట్ లిమిటెడ్, జాకీ, హాట్సన్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్, వెల్ స్పన్ ఇండియా లిమిటెడ్, అమర్ రాజా బ్యాటరీ లాంటి అనేక కంపెనీలు తమ సొంత ప్రాంతాల నుంచి తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. 50 ఏండ్ల తన వ్యాపార అనుభవంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇండస్ట్రీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ను చూడలేదని ప్రతిష్ఠాత్మక కిటెక్స్ గ్రూప్ ఎండీ సాయి ఎం జాకబ్ వ్యాఖ్యానించినా, బ్రిటన్ అంతర్జాతీయ వాణిజ్య మంత్రి రణిల్ జయవర్ధనే టీఎస్ ఐపాస్ అత్యుత్తమ పారిశ్రామిక పాలసీ అని అభివర్ణించినా, అది పదేండ్ల రాష్ట్ర పారిశ్రామిక రంగ ప్రగతికి తార్కాణం.
వ్యవసాయ, పారిశ్రామిక, సేవల రంగాల్లో, పదేండ్లలో రాష్ట్రం నమోదు చేసిన అభివృద్ధిని అనేక జాతీయ, అంతర్జాతీయ అధ్యయన సంస్థలు ప్రశంసించాయి. ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్న నగరాల్లో, హైదరాబాద్ ఇండియాలోనే మొదటి నగరమని తమ నివేదికల్లో వెల్లడించాయి. జాబ్ గ్యారెంటీ గురూ, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ స్టడీ సెంటర్ లాంటి అనేక సంస్థలు ఐటీ, పారిశ్రామిక రంగాల్లో వేగవంతమైన వృద్ధిని నమోదు చేస్తున్న దేశంలోని మొదటి మూడు రాష్ర్టాలలో, తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని పలు ప్రామాణిక అధ్యయన సంస్థలు, తమ క్షేత్రస్థాయి పరిశీలనలతో వివరించాయి. ఏ కొలమానంలో చూసినా, ఉపాధి అవకాశాల సృష్టిలో, తెలంగాణ రాష్ట్రం మిగతా రాష్ర్టాల్లో కంటే రెట్టింపు స్థాయిలో పనితీరును కనబరిచింది.
దారులు మూసుకుపోయిన నవతరానికి, పదేండ్ల ప్రయాణం నవపథాన్ని పరిచయం చేసింది. జీవితంపై విశ్వాసాన్ని, గెలుపునకు అవకాశాలను కండ్లముందు ఉంచింది. కానీ, కాసిన చెట్టుకే రాళ్ల దెబ్బలు అనే నానుడిలా, సాధించిన విజయాలపై విమర్శలు ప్రభావితం చేయడం విడ్డూరం. ఆరు దశాబ్దాల విధ్వంసక అభివృద్ధి నమూనా తెలంగాణ యువతరానికి ఆశలు, ఆశయాల ఊసే లేకుండా చేస్తే, దశాబ్దకాలం మాత్రం ఎదుగుదలకు ఆకాశమే హద్దుగా వాగ్దానం చేసింది. స్వల్ప కాలంలో అన్నీ సమకూర్చడం అతీత శక్తులు ఉంటే తప్ప మానవ మాత్రులైన ఎవరికీ సాధ్యపడదు. తరుముతున్న వేగంతో, చేయాల్సినంత చేసినా, అంతా కోల్పోయిన సమూహానికి ఇంకా చేయాల్సింది మిగిలే ఉంటుంది. జరిగింది కొండంత అయితే, మిగిలింది రవ్వంత. మొన్నటి ఎన్నికల్లో మళ్లీ తెలంగాణ నెగ్గి ఉండి ఉంటే, యువతకు వెలుగుల విపణి మరింత చెంతకు చేరేది.
(వ్యాసకర్త: రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్)
– డాక్టర్ ఆంజనేయ గౌడ్