అక్షర జ్ఞానానికి ఆమడదూరంలోనే ఉండిపోయిన ఆదివాసులు అందలం ఎక్కేందుకు తొవ్వ దొరికింది. విజ్ఞాన
సముపార్జన దిశగా మరింత వేగంగా అడుగులు వేసేందుకు మార్గం సుగమమైంది. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో కేంద్రీయ గిరిజన వర్సిటీ ఏర్పాటుకు భారత ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఆదివాసీల ఆరాధ్య దైవాలైన సమ్మక్క-సారక్క పేరిట ములుగు జిల్లాలో ఈ జాతీయస్థాయి విశ్వవిద్యాలయాన్ని కేంద్రం నెలకొల్పనున్నది.
గిరిజన వర్సిటీకి సంబంధించిన బిల్లు పార్లమెంట్లోని ఉభయసభల్లో పాస్ అవగా, రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. ములుగు జిల్లా కేంద్రంలో గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించిన బిల్లును తొలుత లోక్సభలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రవేశపెట్టారు. ఈ యూనివర్సిటీ పేరును కేంద్ర విశ్వవిద్యాలయాల జాబితాలో చేర్చుతూ ఇప్పటిదాకా ఉన్న చట్టానికి సవరణ చేయాలని ప్రతిపాదించారు. 2009 సెంట్రల్ యూనివర్సిటీల చట్టాన్ని సవరించి సమ్మక్క-సారక్క విశ్వవిద్యాలయాన్ని అందులో చేర్చనున్నట్టు బిల్లులో పేర్కొన్నారు.
ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ వేరుపడ్డ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టం పేరు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014. ఆ చట్టంలో పొందుపర్చిన హామీల్లో ఉభయ రాష్ర్టాల్లో గిరిజన విశ్వవిద్యాలయాల ఏర్పాటు అంశం ఒకటి. ఆ చట్టాన్ని అనుసరించి కేంద్ర సర్కారు.. ఏపీలో 2019లోనే గిరిజన విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పింది. ఇటు తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటు అంశాన్ని మాత్రం నిర్లక్ష్యం చేసింది.
రాష్ట్రంలో ఇప్పటికే కొనసాగుతున్న హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ) స్థాయిలో సమ్మక్క-సారక్క యూనివర్సిటీని నెలకొల్పేలా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందినప్పటికీ కేంద్రం ఇన్నేండ్లు తాత్సారం చేస్తూ వచ్చింది. భావితరాలను దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ సర్కారు ప్రణాళికలు రూపొందించగా.. గిరిజన విశ్వవిద్యాలయం నెలకొల్పేందుకు అవసరమైన ఏర్పాట్లు, డీపీఆర్ రూపొందించే బాధ్యతను కేంద్రం హెచ్సీయూకు అప్పగించింది.
విద్యార్థులు, ఉపన్యాసకుల నిష్పత్తి, భవనాల నిర్మాణం, మౌలిక వసతులు తదితర అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న హెచ్సీయూ మొత్తం రూ.1200 కోట్ల అంచనాలతో నివేదికను కేంద్రానికి సమర్పించింది. ములుగు జిల్లా జాకారంలోని యువజన శిక్షణ కేంద్రాన్ని పరిశీలించి, అక్కడ తాత్కాలిక తరగతులు ప్రారంభించేందుకు అనుకూలంగా ఉన్నదని తెలిపింది. అలా 2019లోనే తరగతులు ప్రారంభమవుతాయని గిరిజన సంక్షేమ యంత్రాంగం భావించినప్పటికీ వివిధ కారణాల దృష్ట్యా వాయిదా పడుతూ వచ్చింది. సాంకేతిక కారణాల నేపథ్యంలో కేటాయించిన నిధుల బదిలీ, సదరు భూములకు పరిహారం చెల్లించడంలో తీవ్ర జాప్యం జరిగింది.
సమ్మక్క-సారక్క గిరిజన వర్సిటీ ఏర్పాటు కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. ముఖ్యంగా స్థానిక ప్రభుత్వంగానే కాక, పార్టీపరంగా బీఆర్ఎస్ చేసిన అలుపెరుగని పోరాటం మరువలేనిది. ములుగు జిల్లా జాకారం గట్టమ్మ ఆలయ సమీపంలో 335.04 ఎకరాల భూములను వర్సిటీ కోసం కేటాయించిన ఫైళ్లను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి పంపడమేకాక అనేకసార్లు విజ్ఞప్తి చేశారు కూడా. ప్రధాని మోదీకి స్వయంగా వినతిపత్రం ఇచ్చారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని అధికారుల బృందం ములుగు గట్టమ్మ ప్రాంతంలో భూములను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది.
కేంద్ర బృందంతో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమావేశమై చర్చించారు. పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ ఎంపీలు ఈ అంశాన్ని లేవనెత్తారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండాకు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ తరఫున విన్నపాలు అందాయి. గిరిజన పరిశోధన సంస్థ, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వంటి వివిధ పరిశోధన సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లోనూ రాష్ట్ర మంత్రులు వర్సిటీ ఆకాంక్ష గురించి వినిపించారు. గిరిజన సంఘాలు, ప్రజాప్రతినిధులు, వామపక్ష పార్టీల నేతల ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు, రౌండ్టేబుల్ సమావేశాలు నిర్వహించిన సందర్భాలూ ఉన్నాయి. విద్యార్థులు పీఎం మోదీ పేరుతో పోస్ట్ కార్డులు పంపారు.
హెచ్సీయూ స్థాయిలో రెండు దశల్లో నెలకొల్పనున్న ఈ వర్సిటీ కోసం కేంద్ర ప్రభుత్వం రానున్న ఏడేండ్ల కాలంలో మొత్తం రూ.889.07 కోట్లను వెచ్చించనున్నది. దశాబ్ది కాలంగా ఎదురుచూస్తున్న గిరిజన విశ్వవిద్యాలయం ఎట్టకేలకు సాకారమవుతున్న దరిమిలా తమ జాతిలో విద్యా విప్లవం రానున్నదన్న ఆనందోత్సాహాలు అడవి బిడ్డల్లో కనిపిస్తున్నాయి.
రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్టుగానే స్థానిక కోటా కింద కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రత్యేక రిజర్వేషన్లు అమలుచేయడం.. గిరిజన బిడ్డలకు కలిసొచ్చే అంశమే. ఆదివాసీ గిరిజన కళలు, సంస్కృతీ సంప్రదాయాలు, కట్టుబొట్టు, ఆచార వ్యవహారాలు, జీవనశైలి, ఆదివాసుల చరిత్రపై లోతైన పరిశోధనలకు ఈ యూనివర్సిటీ వేదిక కానున్నది. అయితే, ఆధునిక కోర్సులతోపాటు గిరిజన ఆచారాల కేంద్రీకృత విద్య, పరిశోధనలను ప్రోత్సహించేలా పలు ప్రత్యేక కోర్సులు నిర్వహించనున్న ఈ వర్సిటీలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష విధానాన్ని అనుసరిస్తామని చెప్తున్న కేంద్రం ఆదివాసీలు, గిరిజన యువతకు ప్రత్యేక కోటాలో ప్రవేశాలు కల్పించే విషయంలో సుముఖంగా లేకపోవడం ఆ తెగల్లో నైరాశ్యం నింపే ముచ్చటే.
ఆరుట్ల నరేశ్
94409 91345