భారతీయ రైతాంగ చరిత్రలో ఇదొక సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రో జు… 2026 ఏప్రిల్ 11. దేశంలోని రైతులను ఒకే తాటిపైకి తెచ్చి, వారి హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ‘అఖిల భారత కిసాన్ సభ’ నేటితో 90 వసంతాలను పూర్తి చేసుకుంటున్నది. 1936లో లక్నో వీధుల్లో చిన్న మొలకగా ప్రారంభమైన ఈ సంస్థ, నేడు కోట్లాది మంది రైతుల గొంతుకగా మారి మహావృక్షంలా విస్తరించింది. ఈ సందర్భంగా కిసాన్ సభ పుట్టుకకు దారితీసిన పరిస్థితులు, దాని వీరోచిత పోరాటాలు, సామాజిక మార్పులో అది పోషించిన పాత్రను ఒకసారి గుర్తు చేసుకుందాం.
1936 ఏప్రిల్ 11న లక్నోలో అఖిల భారత కిసాన్ సభ ఆవిర్భవించింది. మొదటి అధ్యక్షుడు స్వామి సహజానంద సరస్వతి (బీహార్ రైతు నాయకుడు). ఈ సదస్సులో నెహ్రూ వంటి జాతీయ నాయకులు పాల్గొన్నారు. సంపూర్ణ స్వాతంత్య్రం సాధించడమే కాకుండా, భూస్వామ్య వ్యవస్థను రద్దు చేయడమే తమ అంతిమ లక్ష్యమని కిసాన్ సభ ప్రకటించింది. కిసాన్ సభ చరిత్ర అంతా త్యాగాలమయం. స్వాతంత్య్రానికి ముందు, తర్వాత ఈ సంస్థ నేతృత్వంలో జరిగిన కొన్ని కీలక పోరాటాలు ఇక్కడ ఉన్నాయి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం (1946-1951). దాదాపు 3000 గ్రామాల్లో రైతుల రాజ్యం ఏర్పడింది. 10 లక్షల ఎకరాలకు పైగా భూమిని పేదలకు పంచారు.
ఈ పోరాటంలో 4,000 మందికిపైగా అమరులయ్యారు. ఇది భారతదేశంలో భూసంస్కరణలకు ప్రధాన ప్రేరణగా నిలిచింది. బెంగాల్, కేరళలోనూ భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు నిర్మించారు. మొదటి నుంచీ మహిళలను సంఘటితం చేయడంలో కిసాన్ సభ ముందుంది. కమలాదేవి చటోపాధ్యాయ, గోదావరి పారులేకర్ వంటి మహనీయులు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు. త్రిపురలో విద్యావ్యాప్తి ద్వారా రైతులను చైతన్యపర్చారు.
ఆర్థిక సంస్కరణలు వ్యవసాయ రంగాన్ని మళ్లీ సంక్షోభంలోకి నెట్టాయి. రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. ఈ దశలో కిసాన్ సభ తన పోరాట పంథాను మార్చుకున్నది. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పెట్టుబడి ఖర్చుపై 50% లాభం కలిపి కనీస మద్దతు ధర ఇవ్వాలని కిసాన్ సభ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది. 2014 భూసేకరణ చట్టానికి వ్యతిరేక పోరాటం నుంచి, ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన చారిత్రక రైతు ఉద్యమం వరకు ఏఐకేఎస్ కీలక పాత్ర పోషించింది. దేశవ్యాప్తంగా ఉన్న 500 పైగా రైతు సంఘాలను సంయుక్త కిసాన్ మోర్చా ఏకం చేయడంలో కిసాన్ సభ చురుగ్గా వ్యవహరిస్తున్నది.
నాడు బ్రిటిష్ వారితో, నేడు కార్పొరేట్ శక్తులతో కిసాన్ సభ పోరాడుతూ ‘అన్నదాత’ ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నది. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని చాటి చెప్తున్న సంస్థ అఖిల భారత కిసాన్ సభ. 1936 నుంచి 2026 వరకు ఈ సంస్థ సాధించిన విజయాలు అద్భుతం. రాబోయే కాలంలోనూ కూడా పీడిత రైతాంగం పక్షాన నిలబడి, న్యాయం కోసం పోరాడటమే 90 ఏండ్ల వేడుకల సందేశం.
– (వ్యాసకర్త: తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి)
శోభన్ 9949725951