‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకాన్ని కొనుక్కో’ అని కందుకూరి వీరేశలింగం పంతులుగారు చెప్పినట్లు.. ఒక పూట అన్నం మానుకొని కూడా పుస్తకా లు కొనుక్కున్న రోజులు ఉన్నాయి. పుస్తక పఠనం ద్వారానే మానవుడు తనను తాను తెలుసుకుంటూ, గత సమాజ నిర్మాణాన్ని, నాగరికత అభివృద్ధిని ఔపోసన పట్టి నేటి ఆధునిక దశకు చేరుకున్నాడు. చదువటం ద్వారానే మనిషి మేధస్సు పరిఢవిల్లి అనేక అద్భుతాలు, వినూత్న ఆవిష్కరణలు చేయగలుగుతున్నాడన్నది కాలం చెపుతున్నది.
విద్యార్థులు, యువత పుస్తక పఠనం చేయాలి. తద్వారా సామాజిక, ఆర్థిక, రాజకీయ చైతన్యం అందిపుచ్చుకోవాలి. శాస్త్రీయ దృక్పథాన్ని అలవరుచుకోవాలి. ప్రపంచ పరిణామాలను అర్థం చేసుకోవాలి. ‘ది రూట్స్’ పుస్తకం నల్లజాతీయుల దారుణ జీవితాలను ప్రపంచానికి చాటి చెప్పింది. పుస్తక పఠనం ద్వారా అబ్రహం లింకన్, నెల్సన్ మండేలా, మహాత్మాగాంధీ, అంబేద్కర్, మార్క్స్ వంటి ఎందరో మేధావులు సమాజంలో ఉన్న అనేక అసమానతలపై పోరుబాట పట్టి, ప్రపంచంలో మానవులంతా సమానమే అనే భావన కల్పించారు. భావప్రసార సాధనాలు పుస్తకాలు. మనం చేసే పనిని విజయవంతంగా, సౌకర్యవంతంగా చేసేందుకు ఉపకరించేవి పుస్తకాలు. అంధకార యుగాన్ని బీటలు కొట్టేవి పుస్తకాలు.
పుస్తకాలు మనుషుల మస్తిష్కాలకు ఉత్తమ పని కల్పిస్తాయి. నచ్చిన పుస్తకాన్ని చదివేటప్పుడు రచయిత చెప్పేది మంచా చెడా అనేది పాఠకులే నిర్ణయించుకొని తద్వారా సద్గుణాలను అవగాహన చేసుకొంటే మంచి నడవడిక గల పౌరులుగా సమాజంలోమనగలుగుతారు. పుస్తకాలను చదవడం ద్వారా వాటి అవగాహన సారాన్ని మనస్సులో నిక్షిప్తం చేసుకోవాలి. నిక్షిప్తమైన విషయం మీద సహేతుక ఆలోచన ద్వారా ఆ పుస్తక సారాన్ని విచక్షించాలి. సహేతుకమైన విషయసారం ఆధారంగా పాఠకులు నిర్ణయాలు తీసుకుని, నిత్య జీవితంలో అమలు చేసుకోవాలి. ఇది జీవితాంతం కొనసాగ వలసిన మేధో ప్రక్రియ.
పుస్తకాలు చదవడం వల్ల నూతన విషయాల మీద ఆసక్తి పెరుగుతుంది. పఠన వ్యాయామం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. సృజనాత్మక శక్తి పెరుగుతుంది. ఇలా విద్యార్థులను సృజనాత్మకతవైపు మళ్లించేందుకు ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది 35వ జాతీయ పుస్తక ప్రదర్శనను 22 డిసెంబర్ 2022 నుంచి 1 జనవరి 2023 వరకు హైదరాబాద్లోని ఎన్టీఆర్ గ్రౌండ్స్లో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించనున్నది. దాదాపు 15 రాష్ర్టాల నుంచి 300 పుస్తకాల షాప్లు ఈ బుక్ ఫెయిర్లో కొలువు తీరనున్నాయి.
పుస్తక ప్రేమికుడు, సాహిత్య పిపాసి, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పుస్తక పఠనం వల్లనే తన తెలంగాణ సమాజానికి జరుగుతున్న అన్యాయాన్ని గుర్తెరిగి మహోద్యమం ద్వారా తెలంగాణను సాధించారు. ఎన్ని డిజిటల్ రూపాలు వచ్చి నా భౌతికంగా కనిపించే పుస్తకాన్ని తనివి తీరా స్పర్శించి చదువుకోవడంలో ఉన్న తృప్తి గొప్పది అంటారు కేసీఆర్. మానవ సమాజం పరిణామాన్ని తెలియచేసే రాహుల్ సాంకృత్యాయన్ రాసిన ‘ఓల్గా సే గంగ’, గోర్కీ ‘అమ్మ’, జాషువా ‘గబ్బిలం’, ప్రస్తుత మన దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై వాస్తవిక విశ్లేషణ చేస్తున్న ఆకార్ పటేల్ పుస్తకాలు కేసీఆర్ ఇష్టపడే జాబితాలో ఉన్నాయి.
చదువుకున్న వ్యక్తులు విజ్ఞానవంతులై ప్రభుత్వం నుంచి, సమాజం నుంచి తమకు కావలసిన వాటిని దక్కించుకోగలుగుతారు. కాబట్టి, పుస్తకం హస్తభూషణం అన్న ఆదర్శాన్ని అందరూ పాటించాలి.
నేడు దేశంలో మతోన్మాద ఛాందస శక్తులు తిరోగమన భావాలను, క్షీణ సంస్కృతిని వ్యాపింపచేస్తున్నాయి. దీనికి విరుగుడుగా ఉన్నత సంస్కారాన్ని పెంపొందించటానికి, విజ్ఞాన వికాసాల వంటి ఉదాత్త విలువలను అభివృద్ధి చేయటానికి పుస్తక జాతరలు దోహదం చేస్తాయి.
(వ్యాసకర్త: విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్, పర్యాటక భాషా సాంస్కృతిక మంత్రి)