Congress | వాపును చూసి బలుపనుకోవడం, లొల్లి లొల్లి చేసి మేం జనంలో ఉన్నామని చెప్పుకోవడం ఈ మధ్య చాలామందికి ఫ్యాషనైపోయింది. సోషల్ మీడియా పుణ్యమాని ఏం చేయకున్నా పబ్లిసిటీ మాత్రం తారస్థాయిలో ఉంటున్నది.
పొద్దున లేచింది మొదలు రాత్రి దాకా కాంగ్రెస్ నాయకులు ‘గద్దెనెక్కేది మేమే.. పాలించేది మేమే’ అని ఊదరగొడుతున్నారు. నిజంగానే ఆ పార్టీకి తెలంగాణలో అంత బలముందా అంటే.. అంతా ఉత్త ముచ్చటే. ఊపర్ షేర్వానీ అందర్ పరేషానీ కథ కాంగ్రెస్ది. హస్తం పార్టీ వర్తమానమే కాదు, గతమూ గందరగోళంగానే ఉన్నది.
ఉమ్మడి రాష్ట్రంలో తమను మించిన పార్టీ, ప్రభుత్వం మరొకటి లేదని కాంగ్రెస్ నాయకులు చెప్పుకొన్నా తెలంగాణలో హస్తానికి ఉన్న ఆదరణ అంత మాత్రమే. అయినా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. మూడు దశాబ్దాల ఎన్నికల లెక్కలు పరిశీలిస్తే.. కాంగ్రెస్ బాగోతం బయటపడుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో 1989లో ఆ పార్టీ 181 స్థానాల్లో గెలిచి అధికారంలోకి వచ్చింది. ఇందులో తెలంగాణలో గెలిచింది 58 స్థానాల్లో మాత్రమే. ఇక 1994 ఎన్నికల్లో ఎన్టీఆర్ దెబ్బకు తెలంగాణలో కాంగ్రెస్ ఆరు స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఆ పార్టీకి 27 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక 1999లో తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది 42 నియోజకవర్గాల్లోనే. 2004లో తెలంగాణలో 48 నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది. అప్పుడు వారికి వచ్చిన ఓట్ల శాతం 25. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో తెలంగాణలో 50 సీట్లు వచ్చాయి. 2014లో ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాత కాంగ్రెస్ కథ కంచికి చేరింది! సాధారణ ఎన్నికలైనా, ఉప ఎన్నికలైనా, స్థానిక సంస్థల ఎన్నికలైనా.. డిపాజిట్లు కోల్పోయే స్థితికి చేరింది!
ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతీ ఎన్నికలోనూ తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్కు వచ్చింది అత్తెసరు సీట్లే. ఇక 2010లో 12 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే 11 స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. అధికారంలో ఉండికూడా కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోగా.. కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. 2006 కరీంనగర్ పార్లమెంట్ ఉప ఎన్నిక ఎన్నికలోనూ కాంగ్రెస్కు వచ్చింది 22 శాతం ఓట్లే. ఇక్కడ మరో విషయం గురించి మనం చర్చించుకోవాలి.
ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి 2014కు ముందు ఉన్న కాంగ్రెస్తో, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని.. ఇది కొత్త కాంగ్రెస్ అని అంటున్నారు. ఆయన చెప్పినదాని ప్రకారమే చూసినా 2014 తర్వాత తెలంగాణలో కాంగ్రెస్కు నూకలు కాదు కదా.. పచ్చి మంచి నీళ్లు కూడా బాకీ లేవనే విషయం పదే పదే స్పష్టమవుతున్నది! రేవంత్రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక.. డిపాజిట్లు కోల్పోవడమనేది ఆ పార్టీకి ఒక సంప్రదాయంగా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పైకి రాలేనంత పాతాళానికి వెళ్లిపోయింది. తెలంగాణ సమాజం కాంగ్రెస్ను పూర్తిగా తిరస్కరించింది. కానీ, ఇప్పుడు కొందరు కాంగ్రెస్ నాయకులు ముందుకొచ్చి మాదే అధికారం అని మాట్లాడుతుంటే నవ్వాలో.. లేదా వాళ్ల అజ్ఞానాన్ని, అతి విశ్వాసాన్ని చూసి ఏడవాలో తెలియడం లేదు. ఎలుకకు ఏనుగు అని బోర్డు తగిలించినంత మాత్రాన అది ఏనుగు కాదు. చీమను పట్టుకొచ్చి సింహమని ప్రచారం చేసినంత మాత్రాన అది సింహం కాదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి కూడా అంతే! దోబీ కా కుత్తా నా ఘర్ కా.. నా ఘాట్ కా.. అన్నట్టుగానే ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి! ఎందుకంటే గతంలో ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణకు చేసిందేమీ లేదు. ఆ పార్టీ నాయకులపైన ప్రజలకు నమ్మకమూ లేదు. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ అనేది ఓ పార్టీ పేరు మాత్రమే! అంతకు మించి ఏమీ లేదు.
కానీ ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడ్డాయి కదా. ఏదో హడావుడి చేయాలి. ఏదో చేసినట్టుగా ప్రచారం చేసుకోవాలి. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు ప్రజలను నమ్మించి నాలుగు ఓట్లేయించుకుని బయటపడాలి. మళ్లీ పైరవీల దుకాణం తెరవాలి. ఇదీ కాంగ్రెస్ లక్ష్యం. పార్టీ పేరునే స్కాంగ్రెస్గా మార్చుకున్న ఘనత ఆ పార్టీది. ఓ వైపు ప్రజల్లో మంచి పేరు లేదు. మరోవైపు లెక్కకు మిక్కిలి స్కాముల చరిత్ర. అందుకే బద్ద శత్రువైనా బీజేపీతోనూ తెరవెనక చేతులు కలిపింది! తెలంగాణలో కేసీఆర్ను ఓడించాలని జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని స్వయం గా బీజేపీ నాయకుడు యెన్నం శ్రీనివాస్ రెడ్డి బహిరంగంగా చెప్పడమే ఇందుకు నిదర్శనం. ఒక్క కేసీఆర్ను ఓడించడానికి రెండు జాతీయ పార్టీలు జట్టు కట్టాయంటేనే తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్పై, బీఆర్ఎస్పై ఎంత విశ్వాసం ఉందో తెలుస్తున్నది. ఇలాంటోళ్లను తెలంగాణ ప్రజలు ఎలా ఆదరిస్తారని ఆ పార్టీ నాయకులు అనుకుంటున్నారో అర్థం కావడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అంతా భస్మమేనని ప్రజలకు తెలుసు! ఆ భస్మాసుర హస్తాన్ని నెత్తిన పెట్టుకోవాలని ఎవరూ మాత్రం కోరుకుంటారు?!
(వ్యాసకర్త: చైర్మన్, తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ)
– వై.సతీష్ రెడ్డి 96414 66666