తల ఎత్తుకున్న తెలంగాణకు నిలువెత్తు ప్రతిమలా, ఛాతి ఉప్పెంగేలా, గర్వంతో నరనరాల్లో నెత్తురు ఉరకలెత్తేలా తెలంగాణ జనరాశులను సమ్మోహనంలో ముంచి తేల్చింది మన నూతన సచివాలయం. ఆదివారం నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన నూతన సెక్రటేరియట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన వారంతా, ఆ అద్భుత పాలనా సౌధాన్ని చూడటానికి రెండు కన్నులు చాలవన్నట్టుగా నిర్మించిన నూతన దివ్య దారి దీపాన్ని వీక్షించి ఆనందంతో ఊగిపోయారు.
గత పాలకుల మనసులో లేక, పాలనలో కానరాక, మునపటి సచివాలయంలో అడుగడుగు వెతికినా తెలంగాణతనం కనబడేది కాదు. పైరవీకారులు, పాత రాజకీయాలకు తప్ప, ప్రజల జీవితాలకు చోటే దొరకని ఇరుకు తనపు ధోరణికి అది నిలువుటద్దంలా ఉండేది.
స్వరాష్ట్రంలో పాలనా చరిత్రపై చెరిగిపోని ప్రగతి సంతకం చేశారు సీఎం కేసీఆర్.. అన్నార్తులుండని, అభాగ్యులుండని ఆ నవయుగాన్నే కాదు, వైభవాన్ని తెలంగాణకు తెచ్చి చూపారు. విశ్వంభరలో సి.నారాయణ రెడ్డి ‘ఇప్పుడు తెలిసింది.. నిప్పును ఊదేసే నీరుంటుందని’ అని చెప్పినట్లుగా గండాల కుంపట్లు మోసిన తెలంగాణపై నీటి సిరులు కురిపించారు కేసీఆర్. ఎన్ని అద్భుతాలు? ఎన్నెన్ని బంగారు పాలనా సంతకాలు? గత పాలకుల కలల్లో కూడా తట్టని దివ్య దీప స్తంభాలను ఎనిమిదేండ్లలోనే కాదు కాదు నాలుగేండ్లలోనే నిర్మించారు కేసీఆర్. మొదటి మూడేండ్లు సర్దుకోవడం, విభజన సమస్యలతో సమరం సాగించడానికే సరిపోయింది కదా! అగ్నిధారగా కురవడమే అలవాటైన రుద్రవీణకు ప్రగతి రాగాలు నేర్పిన అభ్యుదయ పథగామి మన ముఖ్యమంత్రి.
నూతన సచివాలయంలో కలియ తిరుగుతుంటే ఆనందమే కాదు ప్రతి చదరపు అడుగులో కేసీఆర్ పడ్డ కష్టం గుర్తొచ్చి కన్నీళ్లు నన్ను పలకరించాయి. కేసీఆర్… మీరే లేకుంటే ఏమయిపోవునో తెలంగా! నిప్పులే గర్భాన దాల్చినట్లు, తెలంగాణ నొప్పులను భుజాలపై మోశా వు. ఉద్యమ సందర్భంలో, పాలనా కాలంలో నీ ప్రతి రాత్రి, పగలునూ ఈ నేలకే సమర్పించావు. మనిషిగా నిండు మనస్సుతో ఆలోచించి, అర్ధం చేసుకునే ప్రతివారినీ మీరు పడ్డ కష్టం కదిలించకుండా ఉండదు. ఏమిచ్చి తీర్చుకోగలం నీ రుణం…? అపార్థాలకు, అబద్ధాలకు ఎంత నొచ్చుకున్నావో? మోస్తున్న బరువుకు ఎంత గాయపడుతున్నావో? తర్వాతి వెయ్యే ళ్లూ తెలంగాణ వైభవం బ్రతికుండేలా నిర్మిస్తున్న కేసీఆర్ను నిండు మనస్సుతో కీర్తించకుండా ఎలా ఉండగలం?
ఈ సందర్భంగా కేసీఆర్తో వైఎస్సార్, ఎన్టీఆర్ను కలిపి పోలుస్తూ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపించే పోస్టులు గుర్తొచ్చాయి. ఆ ఇద్దరి హయాంలో ఒకటిరెండు మంచి పనులు జరుగకపోలేదు. కానీ కేసీఆర్ కోరి నిప్పుల దారిలో నడక సాగించిన నాయకుడు. తరాల వివక్షకు, దోపిడికి గురైన తెలంగాణ విముక్తి కోసం రాజకీయ పోరాటాన్ని కౌగిలించుకున్న యోధుడు. ఏ ఆసరా లేని, స్వంత దారిలో సాగి, నియంతలతో తలపడి గులాబీ బలగాన్ని నిర్మించుకున్నవాడు కేసీఆర్.
రాష్ర్టాన్ని సాధించడమే కాదు అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దిన సాటిలేని నేత కేసీఆర్. వర్తమాన రాజకీయ చరిత్రలో ఎవరితో పోల్చలేని, ఎదురులేని వీరుడి చరిత్ర ఆయనది.
ఇది ఎవరూ కాదనలేని సత్యం. వాస్తవాలను వధించడం ఎవరికీ సాధ్యపడదు. కేసీఆర్ కొత్తదారిలో నడిపించిన తెలంగాణ చరిత్రే, భారత్ నేర్చుకోవాల్సిన, ఆచరించాల్సిన అనివార్య సందర్భమిది. తెలంగాణ అద్భుత పాలనా భవనం కోట్లాది జనం ఆత్మగౌరవాన్ని శిఖర సమానంగా నిలబెట్టింది. పాలనసౌధం నుదిటిన అంబేద్కర్ పేరు పెట్టిన కేసీఆర్, కాగితాలకు కంటిచూపునిచ్చి, జనం జీవితాల్లోకి తొంగిచూసే విశాలత్వాన్ని కల్పించారు. ఇది కేసీఆర్ నిర్మించిన చరిత్ర.. కేసీఆర్ మాత్రమే నిర్మించగల నూతన చరిత్ర.
(వ్యాసకర్త : తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్)
డాక్టర్ ఆంజనేయ గౌడ్
98853 52242