గుజరాత్ లాంటి నకిలీ మాడల్ కాకుండా తెలంగాణ మాడల్ దేశమంతటా అమలైతే దేశం ప్రగతి పథంలో పయనిస్తుంది. ఆ విధంగా దేశాన్ని నడిపించే సమర్థత, చాణక్యం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్లో ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ 75 ఏండ్లలో చేయలేని అభివృద్ధిని ఎలా సాధించాలో కేసీఆర్కు తెలుసు. ఆయన నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో ప్రజల మన్నన పొంది విజయం సాధిస్తుందని ఆశిద్దాం.
కేసీఆర్ను బలహీనపరిస్తే తెలంగాణ బలహీనపడుతుంది. తెలంగాణను ప్రేమించే మట్టి మనిషి, రైతు భాంధవుడు కేసీఆర్ ఆలోచన మొత్తం తెలంగాణ భూమి చుట్టే తిరుగుతుంది. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఐష్టెశ్వర్యాలతో తులతూగాలని ఆయన గుండె కొట్టుకుంటుంది. కేసీఆర్ నాయకత్వం లేని తెలంగాణను ఒకసారి ఊహించుకుంటే ఈ సంక్షేమ పథకాలు ఉంటాయో లేదోనని భయమేస్తుంది. గొర్రెల మందలో తోడేళ్లు పడి సర్వ నాశనం చేసినట్లవుతుందని ఆందోళన కలుగుతుంది. అంతకు మించి మత సామరస్యంతో తెలంగాణ ఉంటుందా? మత ఘర్షణలు, గొడవలు, విద్వేష పూరిత వాతావరణం ఉంటే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలు, అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు హైదరాబాద్కు వస్తాయా? ఇవి సగటు మనిషి ఆలోచనలు, అనుమానాలు.
ఈ భయాలన్నీ పోవాలంటే కేసీఆర్ నాయకత్వానికి, ప్రభుత్వానికి తెలంగాణ సమాజం వెన్నుదన్నుగా ఉండాలి. అప్పుడే తెలంగాణ బలపడుతుంది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ 8 ఏండ్లలో సీఎం కేసీఆర్ సమర్థ నాయకత్వంలో నీటి పారుదల, వ్యవసాయం, సంక్షేమ రంగాల్లో ఎన్నో విజయాలు సాధించి దేశంలోని అన్ని రాష్ర్టాల కంటే అభివృద్ధిలో ముందుంది. మొదట నీటి పారుదల, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చిన సీఎం కేసీఆర్ ఇప్పుడు విద్య, వైద్య రంగాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఈ రెండు రంగాల్లో తెలంగాణను దేశానికి రోల్ మోడల్గా నిలబెట్టడానికి ఒక ఎజెండాను తయారు చేసుకున్నారు.
తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని కేసీఆర్ కోరినట్లు బీజేపీ, కాంగ్రెస్ కోరుకుంటాయా? అధికారం కోసం తాపత్రయమే కానీ వాళ్లకు ఏమైనా ప్రజా సంక్షేమ ఎజెండా ఉందా? తెలంగాణ అస్తిత్వం, ఉనికి కోసం ఆ పార్టీలకు సాంస్కృతిక ఎజెండా ఉందా?.. అంటే లేదు. ఎందుకోసం కేసీఆర్ నాయకత్వం అవసరం అంటే… రైతు బంధు కోసం, రైతు బీమా కోసం. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఇవ్వడానికి కేసీఆర్ ఉండాలి.
కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం కేసీఆర్ ఉండాలి. స్వచ్ఛ తెలంగాణ కోసం బీఆర్ఎస్ పాలన ఉండాలి. ఉచిత విద్యుత్తు కోసం బీఆర్ఎస్ పాలన ఉండాలి. భారత దేశంలోని 44 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమిని 70 వేల టీఎంసీల నీళ్లతో ఆకుపచ్చగా మార్చడానికి బీఆర్ఎస్ కావాలి. పంటల గిట్టుబాటు ధర కోసం కేసీఆర్ ఉండాలి. ఆరోగ్య తెలంగాణ కోసం… ఐటీ తెలంగాణ కోసం కేసీఆర్ నాయకత్వం ఉండాలి. రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల కోసం కేసీఆర్ నాయకత్వం కావాలి. తెలంగాణలో శాంతి సామరస్యత కోసం, శాంతి భద్రతల కోసం, గంగా జమునీ తెహ్జీబ్ కోసం కేసీఆర్ నాయకత్వం ఉండాలి.
బీజేపీ 8 ఏండ్ల పాలనలో ఏమి చేసిందని, ఇప్పుడు తెలంగాణలో ఏం చేస్తదని ప్రజలు నమ్మాలి? పాలిచ్చే బర్రె లాంటి బీఎస్ఏన్ఎల్, ఎల్ఐసీ, ఎయిర్ లైన్స్, రైల్వేలు, ఓడ రేవులు, రోడ్లను అమ్ముతున్నారు. బీజేపీ పాలన కంటే ముందు 68 ఏండ్లలో దేశ పాలకులు 48 లక్షల కోట్ల రూపాయల అప్పు చేస్తే మోదీ 8 ఏండ్ల పాలనలో 100 లక్షల కోట్ల అప్పు చేశారు. ఈ డబ్బు ఎక్కడికి పోయింది? ఎవరి జేబుల్లోకి వెళ్ళింది? ఈ డబ్బుతో ఏమైనా ప్రాజెక్టులు కట్టారా ? జీఎస్టీ ద్వారా ప్రతి నెలా వసూలవుతున్న లక్షల కోట్లు ఎక్కడికి పోతున్నాయి? దేశంలో శాంతి భద్రతలు ఏమైనా ఉన్నాయా? నిరుద్యోగ నిర్మూలన ఎజెండా ఉందా? ప్రజలకు మేలు చేసే ఎజెండా ఏముంది బీజేపీ దగ్గర? ఎందుకు ఓటేయాలి కమలానికి? దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టి కొట్లాటలు పెట్టనీకేనా? దళితుల మీద దాడులు, అత్యాచారాలు, హత్యలు చేయడానికా? సంక్షేమ పథకాలను అందిస్తున్న ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడానికా? ఉత్తరాది దురహంకారంతో దక్షిణాది రాష్ర్టాలపై దండెత్తడానికా? ఒకే దేశం.. ఒకే పార్టీ.. ఒకే పాలన..ఒకే భాష ఎందుకోసం? ఎవరి కోసం? ఇది రాచరిక పాలననా? రాష్ర్టాలు సామంత రాజుల్లా నీ మోచేయి కింది నీళ్లు తాగడానికి? దేశానికి రాజ్యాంగం లేదా? సమాఖ్య పాలన వద్దా? ఫెడరల్ వ్యవస్థను మీ గుప్పిట్లో పెట్టుకొని ఏం చేద్దామని అనుకుంటున్నారు? సీబీఐ, ఈడీ, ఐటీలు మీ జేబు సంస్థలా? రాష్ర్టాలకు కూడా మీలాగా సమాన అధికారాలు లేవని అనుకుంటున్నారా?
తెలంగాణ సింహం కేసీఆర్ ఢిల్లీ వస్తున్నారు.. ఇక కాచుకోండి. ఇప్పుడు దేశం ఎదురుచూస్తున్న నాయకుడు కేసీఆర్. ఆయన కోసమే దేశం ఎందుకు ఎదురు చూస్తున్నది…ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? మలి దశ తెలంగాణ ఉద్యమం కోసం టీఆర్ఎస్ను స్థాపించి దానికి నాయకత్వం వహించి తెలంగాణ సకల జనులను, రాజకీయ పార్టీలను ఉద్యమంలో భాగస్వామ్యం చేసిన నాయకుడు కేసీఆర్. తన ఆమరణ నిరాహార దీక్షతో కేంద్రం దిగి వచ్చి తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసేలా చేసిన ధీరుడు. ఆ తదుపరి పరిణామాలు తట్టుకొని ఎత్తుకు పై ఎత్తు వేసి రాజకీయ చాణక్యంతో పార్లమెంట్లో బిల్లు పెట్టించి తెలంగాణను సాధించిన ఘనుడు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల విద్యుత్తును అందించడంలో విజయం సాధించారు. రైతులకు ఉచిత విద్యుత్తు అందించి రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు పెట్టి కాళేశ్వరం లాంటి భారీ నీటి పారుదల ప్రాజెక్ట్ నిర్మించి రైతులకు నిజమైన రైతు బంధువయ్యారు. మిషన్ కాకతీయ ద్వారా దశాబ్దాలుగా పూడికలతో నిండిన వేలాది చెరువులకు మరమ్మతులు చేసి వందల టీఎంసీల నీటిని నిల్వ చేశారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచి నీరందించారు.
వృద్ధులు, వితంతువులకు ఆసరా పెన్షన్లు; గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ; ముదిరాజ్, గంగ పుత్రులకు చేప పిల్లల పంపిణీ చేసి వారి ఆదాయాన్ని పెంచడం లాంటి రోల్ మోడల్ పథకాలు, ఎజెండా ఇప్పుడు దేశానికి అత్యంత అవసరం.
(వ్యాసకర్త: బీరయ్య యాదవ్ , 91777 57440 సీనియర్ రాజకీయ విశ్లేషకులు)