త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ప్రజల మరో ఐదేండ్ల భవితవ్యం మరోసారి ప్రకటితం కాబోతున్నది. ప్రజల చేతిలోకి రాబోతున్న ఓటు అనే మహాయుధం ఎంతవరకు సద్వినియోగం అవుతుందో చూడవలసి ఉన్నది. ఈ రోజు మొత్తం దేశాన్ని పాలిస్తున్న బీజేపీ నేత ఒకప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి.
ఆయన హయాంలో గుజరాత్ ఉన్నతమైన అభివృద్ధి సాధించిందనే ప్రచారం ఒకటి మనం మొదటినుంచి వింటున్నాం. అది నిజమేనా అనేది పక్కన పెడితే, అనతి కాలంలోనే అంతకు మించిన అభివృద్ధిని సాధించిన తెలంగాణను చూస్తే వాస్తవం బోధపడుతుంది. అన్నిరంగాలలోనూ గుజరాత్, తెలంగాణలను తులనాత్మకంగా పరిశీలిస్తే ఈ ప్రచారంలోని డొల్లతనం తెలుస్తుంది.
తెలంగాణ పౌరులుగా మనం కొన్ని వాస్తవాలు తెలుసుకోవలసి ఉన్నది. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు తీసుకున్న వెంటనే సబ్బండ వర్గాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అయన కొన్ని ప్రణాళికలు ప్రకటించారు. ప్రకటితాంశాలు నీళ్లు, నిధులు, నియామకాలనేవి నేపథ్యంగా ఉన్నవే. అన్నివర్గాల ప్రజలకు అవకాశాల సమవిభజన, మౌలిక వసతుల కల్పన ప్రధానంగా ఈ ప్రణాళికలు నిలబడ్డాయి. ఈ అంశాల ప్రణాళిక రచన సరే, వాటిని అమలులోకి తేవడం కూడా ఎంత ప్రభావవంతంగా జరిగిందో కొన్ని నిజాలను పరిశీలిస్తే తెలియవస్తుంది. గుజరాత్, తెలంగాణల సామ్య భేదాల గణన దీనికి అద్దం పడుతుంది.
గుజరాత్ వయసు ఇప్పటికి 63 ఏండ్లయితే తెలంగాణ వయసు పదేండ్లు. గుజరాత్ భౌతికావరణ 1.92 లక్షల చదరపు కిలోమీటర్లు. తెలంగాణ 1.12 లక్షల చదరపు కిలోమీటర్లు. తెలంగాణ జనాభా 3.8 కోట్లు గుజరాత్లో 7.06. తెలంగాణలో శ్రామిక శక్తి 44 శాతం.అదే గుజరాత్లో 41శాతం. అటవీ భూభాగం తెలంగాణలో 27.06 అయితే గుజరాత్లో 11.15. తెలంగాణలో వ్యవసాయానికి నీటిపారుదల 52 శాతం ఉంటే గుజరాత్లో 23 శాతం.
ఒక సర్వే ప్రకారం గుజరాత్లో సగటున ఒక వ్యక్తికి అందుతున్న నీళ్లు 77 లీటర్లు. అదే తెలంగాణలో 150 లీటర్లు. తెలంగాణలో ఈ విధంగా వంద శాతం నీళ్లు ఇవ్వడాన్ని ఒక సందర్భంలో మోదీ కూడా ప్రశంసించడం ఇక్కడ గమనించాలి. గుజరాత్ ఐటీ రంగానికి వస్తే ఇతర కంపెనీలతో కూడా కలుపుకొని 34,028 అయితే తెలంగాణలో ఈ పరిశ్రమలు ఐటీ కలుపుకొని 47,176 ఉన్నాయి. తెలంగాణలో ఉద్యోగాలద్వారా కల్పించబడుతున్న ఉపాధి 1.8 కోట్లు అంటే 45 శాతం అయితే గుజరాత్లో 2 కోట్లు అంటే 31 శాతం మాత్రమే.
వర్తమానంలో కొనసాగుతున్న ధరల ప్రకారం జీఏఎస్టీపీ డెవలప్ మెంట్ రేట్ గుజరాత్లో 10.57 శాతం అయి తే తెలంగాణలో 19.1గా చూడవచ్చు. తెలంగాణలో తలసరి ఆదాయం రూ.3,17,115గా ఉంటే గుజరాత్ లో రూ.2,50,100గా గమనించవచ్చు. గుజరాత్, తెలంగాణలలోని అభివృద్ధి శాతం 10.7,20.5గా ఉండటాన్ని బట్టి తెలంగాణ అభివృద్ధ్దిని అంచనా వేయవచ్చు. ఇక ఆదాయ వృద్ధిరేటు తెలంగాణలో 17.81 అయితే గుజరాత్లో 1.36 మాత్రమే.
తెలంగాణలో తలసరి విద్యుత్తు వినియోగం 2,012 అయితే గుజరాత్ వినియోగం 1,839గా గమనించాలి. ఇప్పటికి శిశుమరణాల రేటు గుజరాత్లో 1000కి 23 అయితే తెలంగాణలో 20 మాత్రమే. ఇన్నోవేషన్ ఇండెక్స్ ర్యాంక్ గుజరాత్ 5 అయితే, తెలంగాణ 2వ స్థానంలో ఉంది. ఈ విషయంగా తెలంగాణ 3 స్థానాలు అధికంగా ఉండటం చూడవచ్చు. ఇప్పటివరకు గుజరాత్ సాంఘిక సంక్షేమ వాణిజ్య సూచిక 8 అయితే తెలంగాణలో 1. అంటే తెలంగాణ 7 స్థానాలలో అధికంగా ఉండటం గమనించవచ్చు. నీతి ఆయోగ్ ఆరోగ్య సూచిక గుజరాత్లో 6గా ఉంటే తెలంగాణలో 3. గుజరాత్ పన్నులు వేయడంలో 9 శాతంగా ఉంటే తెలంగాణలో 1 శాతంగా ఉన్నది.
వాస్తవాలను గమనించకుండా తెలంగాణలోని ప్రతిపక్షాలు చేసే విమర్శలు నిర్హేతుకాలు. హస్యాస్పదాలు. పైగా వాళ్లు బహిరంగ సభల్లో ప్రసార మాధ్యమాల్లో ఉపయోగిస్తున్న భాష వాళ్లను వాళ్లు తక్కువ చేసుకోవడమే. దేశం పట్ల, సమాజం పట్ల, సిద్ధాంత నిబద్ధత ఉన్ననాయకుడు ఎవరూ ఇట్లాంటి భాషను వాడరు. మహిళా నాయకుల మీద కూడా తమ కీచక భాషను ప్రయోగించడం అత్యంత హేయం. ఒక స్పష్టమైన నిబద్ధతను, సంస్కారాన్ని వీరి దగ్గర ఆశించడం అత్యాశే కావచ్చు కానీ, వీళ్లకు కనీసం ప్రజాసమూహాల ముందు గంభీరత నటించడం కూడా రాదంటే జాలి కలుగక తప్పదు. నాయకుని మాట ఎప్పుడైనా ప్రజలను దేశాన్ని ప్రతిఫలిస్తుందని గమనించాలి.
పెరిగిపోతున్న సాంకేతిక పరిజ్ఞానం గ్లోబలైజేషన్ సం స్కృతి వల్ల కుటుంబ సంబంధాలు ప్రశ్నార్థకమౌతున్నాయి. నైతికతకు స్థానంలేని ఒక చిత్రమైన భౌతిక సమాజం నిర్మాణం జరుగుతున్నది. ఇట్లాంటి అవకాశవాద యుగంలో తన వాగ్దానాలను నిలుపుకొనే నాయకత్వం చాలా అరుదుగా కనిపిస్తున్నది. చేసిన వాగ్దానాలే కాక అదనపు అంశాలు కూడా పూరించే నాయకత్వం తెలంగాణకు లభించింది. ఈ రోజు తెలంగాణ జాతి తలెత్తుకొని సగర్వంగా నిలబడగలుగుతున్నది. తెలంగాణ చరిత్రలో సాహిత్య, సాంస్కృతిక పేజీలు ప్రత్యేకంగా తెరచుకొన్నాయి. తెలంగాణ విధానాలను సమస్త దేశమూ చవిచూడవలసిఉన్నది. రేపు మనదే అని చాటుతున్న ఈ ఎన్నికలలో విజయం, ఒక్క తెలంగాణకే కాదు , సమస్త దేశానికీ మేలుకొలుపే.
– డాక్టర్ కాంచనపల్లి గోవర్ధన్ రాజు , అసోసియేట్ ఎడిటర్, తంగేడు మాసపత్రిక
– పి.విజయేందర్ రావు , అధ్యాపకుడు