‘ఆకాశంలో నీవు నేను సగం సగం.. అనంత కోటి నక్షత్రాల్లో నీవు నేను సగం సగం’ అని అన్నారు ప్రముఖ కవి, రచయిత శివసాగర్. జనాభాలో దాదాపు సగభాగమైన మహిళలు ఆర్థికంగా, సామాజికంగా సమాన హక్కులు, సాధికారత కలిగి ఉన్నప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది.
నేటి సమాజంలో మహిళా స్థితిగతులు, వారి జీవనవిధానం, వారి హక్కులు, అమలవుతున్న చట్టాల మీద అవగాహనతో కూడిన అర్థవంతమైన చర్చ దేశవ్యాప్తంగా జరుగుతున్నది. మహిళా సాధికారత అంటే ఆధునిక సమాజంలో పురుషులతో పాటు సమానంగా హోదాను, అవకాశాలను అనుభవిస్తూ నిర్ణయాత్మక స్థానంలో మహిళలు ఉండటం. మహిళలు పొందగలిగే ప్రతి అవకాశం వారికి అందేలా చూడటం. ప్రతి నిర్ణయంలో స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను ఇవ్వడం. విద్య, ఆరోగ్య, ఉద్యోగరంగాల్లో భాగస్వాములై మహిళలు తమ సమస్యలను తామే పరిష్కరించుకోవాలి. సొంత ఉద్యోగంతో సంపదను సంపాదించుకునే సామర్థ్యం వారికి ఉండాలి. ఈ సందర్భంగా మహిళల శక్తి సామర్థ్యాలను గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అన్నిరంగాల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలి. ఆర్థిక స్వాతంత్య్రాన్ని, రాజకీయ అవకాశాలను కల్పించాలి.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత సీఎం కేసీఆర్ ‘మహిళా సాధికారత గురించి మహిళలు సాధించిన ప్రగతిని బట్టి నేను సమాజ పురోగతిని కొలుస్తాను’ అని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అన్న మాటలను స్ఫూర్తిగా తీసుకున్నారు. అందుకే మహిళా సాధికారతను సాధించడానికి, వారి సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం అనేక రకాల విధానాలు, పథకాలను రూపొందించారు. అందు లో మొదటిది దేశంలో ఎక్కడా లేనివిధంగా అత్యున్నత విద్య ప్రమాణాలతో గురుకుల విద్యాసంస్థలను అభివృద్ధి చేయడం. రాష్ట్ర ప్రభుత్వం మొదటినుంచి బాలికా విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు రెసిడెన్షియల్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్నది. తెలంగాణలోని దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ అమ్మాయిల కోసం వెయ్యికి పైగా మహిళ గురుకుల విద్యాసంస్థలను ఏర్పాటు చేసింది. ఇందులో ప్రత్యేకంగా 60 మహిళ గురుకుల డిగ్రీ కళాశాలలను ఏర్పాటుచేసింది.
రాష్ట్రంలోని దళిత, గిరిజన, బీసీ ప్రజలకు తమ బిడ్డల పెండ్లిండ్లు చేయడం కష్టమవుతున్నది. ఇది గ్రహించిన సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను ప్రారంభించారు. వీటి ద్వారా ప్రభుత్వం లక్షా నూట పదహారు రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఆడబిడ్డల పట్ల ఆయనకు ఉన్న ప్రేమను తెలియజేస్తున్నది.
యూజీ, పీజీ కోర్సులతోపాటు ఫార్మసీ, లా కాలేజీలు ఏర్పాటుచేసి విద్యనందించడం అభినందనీయం. దీంతో రాష్ట్రంలో మహిళా విద్యలో నమోదు శాతం గణనీయంగా పెరిగింది. దేశ సగటు నమోదు 27 శాతం అయితే తెలంగాణ నమోదు 40 శాతంగా ఉన్నది. మహిళలు జాతీయంగా, అంతర్జాతీయంగా అనేక ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. మహిళల ఉన్నత విద్య అవసరాన్ని గుర్తించి మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మహిళా యూనివర్సిటీని ఏర్పాటుచేసింది.
గతంలో గ్రామీణ ప్రాంతానికి చెందిన పేద కుటుంబాల అమ్మాయిలు ఐఐటీ, ఐఐఐటీ, ఇంజినీరింగ్, బీడీఎస్, జీఎఫ్టీఐ, మెడిసిన్ చదువాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఇలాంటి పెద్ద చదువులు చదివించడానికి పేద కుటుంబాలకు భారంగా మారేది. కానీ ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో ఏర్పాటుచేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల సంస్థల ఆధ్వర్యంలో 66 గురుకుల కళాశాలలను సెంటర్ ఫర్ ఎక్స్లెన్సీ (ప్రతిభ కళాశాలలు) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కోచింగ్ అందిస్తున్నది. కోచింగ్ తీసుకున్న అమ్మాయిలు ఏటా సీట్లు సాధిస్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభు త్వం మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా ‘షీ’ టీమ్లను ఏర్పాటుచేసిం ది. ఇలా అనేక విధానాలు, పథకాల వల్ల తెలంగాణ ప్రభుత్వం నిజమైన మహిళా సాధికారతను సాధిస్తుందని చెప్పవచ్చు.
(వ్యాసకర్త: ఉన్నత విద్యామండలి చైర్మన్)
-ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి
94402 36667