HomeOpinionsTelangana Government Launched Aasara Pension For Poor
బడుగు జీవితాలకు భరోసా.. ఆసరా
రాష్ట్రంలోని నిరుపేదలకు కనీస జీవన భరోసా అందించాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పింఛను పథకం ‘ఆసరా’. గత ప్రభుత్వాలకు భిన్నంగా నిరుపేదలకు భరోసానిస్తూ వారి కన్నీళ్లను తుడిచే ప్రయత్నం చేశారు సీఎం కేసీఆర్.
తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పింఛన్లు నిరుపేదలకు జీవన భరోసాను అందిస్తున్నాయి. పిల్లలు పట్టించుకోని, స్థిరమైన ఆదాయం, ఆస్తులు లేని పేద వృద్ధులకు ఆసరా ఈ పింఛనే. వితంతువులకు చేయూతగా నిలుస్తున్నదీ ఈ పింఛనే. ఒంటరి మహిళలకు, వికలాంగులకు, కల్లు గీత కార్మికులకు, హెచ్ఐవీ వ్యాధిగ్రస్థులకు అండగా నిలుస్తున్నదీ ‘ఆసరా’నే. ఎందరో నిరుపేదలు, అభాగ్యులకు అన్నం పెడుతున్నదీ ఆసరానే!
రాష్ట్రంలోని నిరుపేదలకు కనీస జీవన భరోసా అందించాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పింఛను పథకం ‘ఆసరా’. గత ప్రభుత్వాలకు భిన్నంగా నిరుపేదలకు భరోసానిస్తూ వారి కన్నీళ్లను తుడిచే ప్రయత్నం చేశారు సీఎం కేసీఆర్. గత ప్రభుత్వాలు పేద వృద్ధులకు నామమాత్రంగా కేవలం రూ.200 పింఛను ఇచ్చేవి. అది కూడా అతి తక్కువ మందికి అందించేవి. కానీ తెలంగాణ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల గురించి ఆలోచించి వారి కనీస అవసరాలను తీర్చే దిశగా గౌరవప్రదమైన పింఛను ఉండాలని ఆసరా పథకానికి శ్రీకారం చుట్టింది. రూ.200గా వివిధ రకాల పింఛన్లను రూ. 2,016కు పెంచింది. నిరుపేదల సంక్షేమం, సామాజిక భద్రత వ్యూహంలో భాగంగా ప్రారంభించిన ఆసరా పింఛన్లను మొదట వృద్ధులు, వితంతువులు, చేనేత, కల్లు గీత కార్మికులు, హెచ్ఐవీ బాధితులు, దివ్యాంగులకు ప్రభుత్వం అందించింది. 2015 నుంచి బీడీ కార్మికులకు, 2017 నుంచి ఒంటరి మహిళలకు , 2018 నుండి ఫైలేరియా బాధితులకు, 2022 నుండి డయాలసిస్ బాధితులకు ఈ పథకాన్ని ప్రభుత్వం విస్తరించింది. వికలాంగులకు అందించే పింఛన్ను రూ.3016 నుంచి రూ.4016కు పెంచుతూ ఈ నెలలోనే ఉత్తర్వులు జారీ చేసింది. దీని వల్ల 5,11,656 మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరుతున్నది. మరోవైపు ఆసరా పథకానికి అర్హులై, అవసరం ఉన్నవారందరికీ అందించేందుకు వయో పరిమితిని 60 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. 2014 లో 28.47 లక్షల మంది ఆసరా పథకం ద్వారా లబ్ధి పొందగా ప్రస్తుతం 43.81 లక్షల మంది ఆసరా పింఛన్లు అందుకుంటున్నారు.
బంగారు తెలంగాణ వైపు అడుగులు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల కన్నీళ్లు తుడవడానికి ఒకవైపు ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి కల్పిస్తూనే, మరోవైపు రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువులను తక్కువ ధరకు అందిస్తున్నది. ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సదుపాయాలను అందిస్తున్నది. 2014 నుంచి 2022 వరకు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 15.33 లక్షల ఆసరా పింఛన్లను మంజూరు చేసింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు రూ.60 వేల కోట్లను పింఛన్ల రూపంలో అందించింది.
ఆసరా పథకాన్ని సమర్థంగా అమలుచేయడానికి తెలంగాణ ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టింది. దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేసింది. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా మీ సేవ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఎక్కడా అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నది. అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు నేరుగా పింఛను జమ అయ్యే విధంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నది.
ఈ పథకం విషయంలో ప్రజలకు జవాబుదారీగా ఉండాలనే భావనతో సమగ్ర పర్యవేక్షణ, సాధారణ ఆడిట్లను తరచుగా నిర్వహిస్తున్నారు. నిరుపేదల కన్నీళ్లు తుడుస్తున్న ఈ సంక్షేమ పథకం దేశం దృష్టిని సైతం ఆకర్షించింది.ఏ ఆసరా లేనివారికి ఆసరా పింఛను దిక్కవుతున్నది! బతుకుపై భరోసా లేని ఎందరికో జీవితంపై భరోసా ఇచ్చింది ఆసరా. ప్రభుత్వం అందించే పింఛనుతో చాలా మంది నిరుపేద వృద్ధులు, వికలాంగులు, వితంతువులు గౌరవంగా బతుకుతున్నారు. తమకు కన్న బిడ్డలాగా ఆసరా అందిస్తున్న సీఎం కేసీఆర్కు ఆసరా లబ్ధిదారులు నిండు మనసుతో చెమ్మగిల్లిన కండ్లతో కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సహజంగా దిక్కు లేనివారికి దేవుడే దిక్కు అంటారు.. కానీ దిక్కులేని వారికి తెలంగాణ ప్రభుత్వమే దిక్కైంది.
(వ్యాసకర్త: పౌర సంబంధాల అధికారి, సమాచార పౌర సంబంధాల శాఖ)