కాలంగాక ఎంతోమంది రైతులు తమ భూములమ్ముకొని వలసబాట పట్టిన రోజులను తెలంగాణ ఎన్నో చూసింది. కానీ, రైతులు ‘ఈ భూమి అమ్మబడదు’ అనే బోర్డులు పెడుతరని, ఇలాంటి రాతలు రాస్తరని తెలంగాణ ఊహించిందా? కానీ, అవి నిజమవుతున్నయి. ‘ఈ భూమి అమ్మబడదు’ అనే బోర్డులు రాష్ట్రంల కనవడుతున్నయి. అయితే, ఒకప్పటి కరువును చిత్తుజేసి, పరువుగల్ల రాష్ట్రంగా తెలంగాణ నేడు సుభిక్షంగా వర్ధిల్లుతున్నది.
‘మా నీళ్లు మాకే’ అనే నినాదం విధానంగా మారడంతో పాలమూరు జిల్లా పచ్చ చీర కట్టుకుంటున్నది. అక్కడి భూములు పచ్చబడుతున్నయి. అందుకే రైతులు తమ భూములకు హద్దులు పాతుకుంటున్నరు. ఆ హద్దుల కాడనే ‘ఈ భూమి అమ్మబడదు’ అని బోర్డులు నిలవెడుతున్నరు. శంషాబాద్ ఎయిర్పోర్టును చూపి షాద్నగర్, జడ్చర్ల వంటి పాలమూరు పొలిమేరలను రియల్ ఎస్టేట్ అడ్డాలుగా మార్చిన గత పాలకుల చరిత్రను తిరగరాస్తున్నరు. అవే భూములల్ల గులాబీ తోటలు సాగు చేస్తున్నరు.
పంటను కల గని, సాగునీళ్లను ఆశపడ్డ భూములు ఇప్పుడు దేశం ఆకలి తీర్చే వరి పంటలైతున్నయి. అన్నదాతలకే అన్నం లేని పరిస్థితులను తొంగిచూడని కృష్ణమ్మ.. నేడు ప్రాజెక్టుల ఒడిలో సేదతీరుతూ పరవళ్లు తొక్కుతున్నది. ఎన్ని పాటలు, ఎన్ని కవితలు, ఎన్ని కథలు, ఎన్ని వార్తలు, ఎన్ని కష్టాలు.. ఎన్ని కన్నీళ్లు నాటి పాలమూరువి? ఆ కన్నీళ్లను పట్టించుకున్నదెవరు? ఆ బాధను అర్థం చేసుకున్నదెవరు? గలగల పారుతున్న కృష్ణమ్మను వెల వెలబోతున్న పాలమూరు బీడు భూములకు మళ్లించిందెవరు?
అరచేతిలో స్వర్గం చూపించి, మసిపూసి మారేడుగాయ చేసిన నేతల కట్టు కథలను, కనికట్టు మాయాజాలాన్ని కట్టిపెట్టి స్వరాష్ట్ర కలను నెరవేర్చిన ఉద్యమ నాయకుడు కేసీఆర్. ‘హరిహర బ్రహ్మాదులు అడ్డమొచ్చినా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తిచేసి, ప్రారంభం చేసి చూపిస్త’నని సవాల్చేసి ఇచ్చిన మాటను నిలవెట్టుకున్నడు. పాలమూరు బిడ్డలను దేశంలో అవ్వల్దర్జాగా తలెత్తుకొని నిలవడేలా చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు మాత్రమే దక్కుతుంది. అబద్ధాల పునాదులపై రాసిన రాతలు, కథలను బద్దలు కొట్టే వీరుడొచ్చినప్పుడు చరిత్ర అసలు నిజాలను ప్రపంచం ముందు నిలబెడుతుంది. ఆ వీరుడే కేసీఆర్. ఒక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు మహబూబ్నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లా రైతుల గోస తీర్చింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తపోతల ప్రాజెక్టు కింద మొత్తం 12.30 లక్షల ఎకరాలకు సాగునీరందుతున్నదంటే మామూలు ముచ్చట కాదు.
ఎవ్వరో పంటలు పండించుకునేందుకు ఆనకట్టలు, కరకట్టలు, ప్రాజెక్టులకు కూలీ పనిచేసిన పాలమూరు బిడ్డలు ఇప్పుడు పచ్చబడ్డ పాలమూరులో పైరు రాజులోలె కలె తిరుగుతున్నరు. ‘ఒకప్పుడు కరువు, ఆకలిచావులు, వలసలు, ఆత్మహత్యలు, నెర్రెలుబారిన బీడు భూములు ఇవేవీ ఇప్పుడు పాలమూరులో లేవు. మున్ముందు రావు కూడా’. ఈ మాట ఎవరో కాదు, స్వయంగా కరువు జిల్లా బిడ్డగా పెరిగి, నేడు జలకళతో పరువు జిల్లాగా, పంట రాశుల జిల్లాగా పేరు మార్చుకున్న పాలమూరు రైతు బిడ్డలే చెప్తున్నారు. ‘జై తెలంగాణ’ అని నినదించిన గొంతులు ‘జల తెలంగాణ’ అని నినదిస్తున్నాయి. మరో దశాబ్దకాలం దాకా కేసీఆర్ నాయకత్వం కొనసాగాలెనని గుండెల నిండా స్వాగతిస్తున్నాయి.
సుంకరి ప్రవీణ్కుమార్
97015 57412