స్వరాష్ట్రంలో సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తూ దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. అందులో భాగస్వాములవుతున్న ఉద్యోగులకు సైతం అదే ప్రాధాన్యం ఇస్తున్నారు. అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి నేటివరకు.. ఉపాధ్యాయ, ఉద్యోగులతో ఫ్రెండ్లీ ప్రభుత్వాన్ని నడుపుతూనే లక్షలాది మంది ఉద్యోగులు సగర్వంగా స్వరాష్ట్రంలో తలెత్తుకునేలా వేతనాలు పెంచుతూ వస్తున్నారు.
దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా వేతనాలు కల్పిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి తాజా పీఆర్సీ కమిటీ విషయంలోనూ సంచలన నిర్ణయమే తీసుకున్నారు. కమిటీ వేసిన రోజునే ఐదు శాతం మధ్యంతర భృతి ప్రకటించడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా.. గత రెండు పీఆర్సీల్లో దేశంలోనే అత్యధిక ఫిట్మెంట్ ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది. గత తొమ్మిదేండ్లలో ఉద్యోగులకు సంబంధించి పెంచిన వేతనాలు, ఇచ్చిన ఫిట్మెంట్లు, పెరిగిన గ్రాట్యుటీ, అలవెన్స్లు, ఇతర సౌకర్యాలను పరిశీలిస్తే… ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉద్యోగులపై ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతున్నది. ప్రభుత్వం పగ్గాలు చేపట్టగానే… స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన ఉద్యోగ, ఉపాధ్యాయులను దృష్టిలో పెట్టుకొని 2014లోనే ఒక ఇంక్రిమెంట్ ఇచ్చింది. ఈ ఇంక్రిమెంట్ పూర్తికాలం పనిచేసేలా నాడే ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
ఉద్యోగుల పోరాటాన్ని గుర్తించి ఇంక్రిమెంట్ ఇవ్వడమనేది దేశంలోనే తొలిసారి. ఇంక్రిమెంట్కే పరిమితం చేయకుండా.. 2014 పీఆర్సీలో భాగంగా వేతన స్కేళ్లను సవరించిన ప్రభుత్వం.. ఉద్యోగుల అంచనాలకు భిన్నంగా 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. నిజానికి 43 శాతం ఫిట్మెంట్ అనేది ఒక చారిత్రాత్మక నిర్ణయం. అలాగే 2018 పీఆర్సీకి సంబంధించి 2020, డిసెంబర్ 31న నాటి కమిటీ చైర్మన్ బిస్వాల్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. 7 శాతం ఫిట్మెంట్ పెంచడానికి బిస్వాల్ కమిటీ సిఫారసు చేసింది. కానీ.. ఉద్యోగ, ఉపాధ్యాయుల సంక్షేమాన్ని దృష్టి లో పెట్టుకున్న సీఎం పీఆర్సీ నివేదికను పక్కనపెట్టి అసెంబ్లీ సాక్షిగా 30 శాతం ఫిట్మెంట్ ప్రకటించి మరోమారు కేసీఆర్ తన అభిమానాన్ని చాటుకున్నారు.
స్వరాష్ట్రంలో ఇప్పటివరకు రెండు పీఆర్సీల ద్వారా 73 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన ఏకైక సీఎం కేసీఆరే. స్వరాష్ట్రం వస్తే.. ఉద్యోగుల వేతనాలు అనూహ్యంగా పెరుగుతాయని ఉద్యమ సమయంలోనే చెప్పిన కేసీఆర్.. కరోనా లాంటి పరిస్థితులకు ఏ మాత్రం వెరువకుండా ఉద్యోగులపై తనకున్న ప్రేమను చాటారు. రెండు పీఆర్సీల ద్వారా ఫిట్మెంట్ 73 శాతం పెరగడంతో నేడు దేశంలో అత్యధిక వేతనాలు తెలంగాణ ఉద్యోగులే పొందడం గర్వకారణం. గత రెండు పీఆర్సీల్లో రికార్డులు సృష్టించిన ప్రభుత్వం.. తాజా పీఆర్సీలోనూ అదే తీరుతో ముందుకువెళ్తున్నది. తాజాగా.. రిటైర్డు ఐఏఎస్ అధికారి శివశంకర్ చైర్మన్గా పీఆర్సీ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం జీవో-159ను జారీచేసిన విషయం తెలిసిందే. నివేదికను 6 నెలల్లోపు ఇవ్వాలని నిర్దిష్ట గడువు పెట్టడంతోపాటుగా.. 5 శాతం మధ్యంతర భృతి (ఐఆర్)ను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఐఆర్ అక్టోబర్ నుంచే వర్తింపజేయనున్నట్టుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఇప్పటివరకు సమైక్య రాష్ట్ర చరిత్రలోని పీఆర్సీలను గమనిస్తే.. అవి నివేదిక ఇచ్చేవరకు మధ్యంతర భృతిని ప్రకటించిన దాఖలాల్లేవు. కానీ, కమిషన్ ఏర్పాటుచేసిన రోజే మధ్యంతర భృతి ప్రకటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
అలాగే ప్రభుత్వంలో టీఎస్ ఆర్టీసీ విలీనం చేశారు. దీనిద్వారా 43 వేల మంది కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోయారు. వీఆర్ఏలకు ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రతిపత్తిని కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. వీరి సేవలను క్రమబద్ధీకరిస్తూ పే స్కేలు అమలు చేసింది. వీరందరి విద్యార్హతలు, సామర్థ్యాలను బట్టి ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం కొత్తగా 14,954 పోస్టులను మంజూరు చేసింది. గ్రామాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న పంచాయతీ కార్యదర్శుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దశాబ్ది ఉత్సవాలను నిర్వహించిన ప్రభుత్వం ఆ సందర్భంగా ఉద్యోగులకు భారీగా అలవెన్సులు, అడ్వాన్సులు ఇతర సౌకర్యాలు సదుపాయాలు కల్పిస్తూ ఆదేశాలిచ్చింది. అంతేకాదు.. మహిళా ఉద్యోగుల పట్ల ప్రత్యేక చర్యలు తీసుకుంది. ప్రభు త్వ ఉద్యోగులతో పాటుగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచింది. ఇవేకాదు.. మహిళా ఉద్యోగులపై ప్రత్యేక చర్యలు తీసుకున్నది. అలాగే అలవెన్సులు.. ఇతర సౌకర్యాల విషయంలోనూ ఏ రాష్ట్రంలో లేని నిర్ణయాలు తీసుకుంటూ ఉద్యోగుల పెన్నిధిలా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తున్న తీరు ప్రస్తుతం దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది.
(వ్యాసకర్త: నమస్తే తెలంగాణ ప్రతినిధి, కరీంనగర్)
-కడపత్రి ప్రకాశ్రావు
80966 77022