‘ఎవరెస్ట్’ శిఖరం కన్నా ఎత్తయిన ఆలోచనలున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు. ఆయన చేపట్టిన తెలంగాణ ఉద్యమం స్వాతంత్య్ర పోరాటాన్ని మరిపించిందనడంలో సందేహం లేదు. తెలంగాణ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన ‘ప్రత్యేక తెలంగాణ’ను సాకారం చేసిన కేసీఆర్ స్వల్పకాలంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని దేశానికి మాడల్గా తీర్చిదిద్దారు. ఇప్పుడు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా రూపాంతరం చేసి దేశ రాజకీయాల్లో అడుగుపెట్టారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దేశం మొత్తాన్ని ఏకతాటి మీదికి తీసుకువచ్చే ప్రక్రియను మొదలుపెట్టడం దేశానికే గర్వకారణం.
అయితే తెలంగాణలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం మేమేనని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పలు మాధ్యమాల్లో నానా యాగి చేస్తున్నాయి. ఈ తరుణంలో ఇటీవల జరిగిన రాజన్న సిరిసిల్ల జిల్లా సెస్ ఎన్నికల ఫలితాలను ఉదాహరణగా తీసుకుందాం. 15 స్థానాలకు గాను 15 స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. ఈ ఫలితాలను లోతుగా పరిశీలిస్తే… ప్రజా సంక్షేమంపై కేసీఆర్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ప్రజలు పసిగట్టారనే చెప్పుకోవాలి. ఇదిలా ఉంటే… కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను అప్పనంగా ప్రైవేటుకు అప్పచెప్తున్నది. బడా వ్యాపారులు రూ.లక్షల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టినా పట్టించుకోకుండా లక్షల కోట్లు అధికారికంగా రుణమాఫీ చేస్తున్న దుస్థితిని ప్రజలు గమనిస్తున్నారు. విద్య, వైద్యం, ఇంధనం, రవాణా, నీటి సరఫరా వంటి కీలక రంగాలను ప్రైవేటీకరించడం వల్ల ప్రజలకు అనేక సమస్యలు కలుగుతాయి. ఇది గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆయారంగాల అభివృద్ధికి కృషిచేసిందే తప్పా అమ్మకానికి పూనుకోలేదు.
నిజానికి ఈ తొమ్మిదేండ్ల నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను తెగనమ్ముతున్నది. అంటే ఇది ఒకరకంగా ప్రజల కిడ్నీలను అమ్ముకొని పాలకులు, కార్పొరేట్ కంపెనీల యాజమానులు జల్సా చేస్తున్నట్టుగా స్పష్టమవుతున్నది. ఎందుకంటే దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మహామహులు మేధోమథనం చేశారు. సురక్షితమైన, పటిష్ఠమైన ప్రభుత్వాన్ని నిర్మించాలన్న సందర్భంలో వచ్చిన ఆలోచనావిధానమే సహకార సంఘాలు, ప్రభుత్వరంగ సంస్థల ఏర్పాటు. ప్రభుత్వరంగ సంస్థలను భారత ఆర్థికవ్యవస్థలో ముఖ్యమైనవిగా వారు అభివర్ణించారు. ఇందులో పబ్లిక్ సర్వీసెస్, ఎంటర్ప్రైజెస్ కూడా ఉంటాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలను ప్రభుత్వరంగ సంస్థలంటారు. ఈ సంస్థలు చట్టబద్ధమైన కార్పొరేషన్స్ లేదా జాతీయ బ్యాంకులు కావచ్చు. ఈ సంస్థల్లో పనిచేసేవారు ప్రభుత్వ ఉద్యోగులు. మన రాజ్యాంగంలో పొందుపర్చిన అన్ని రిజర్వేషన్లు అమలుకావడం చేత యువతకు ఉద్యోగవకాశాలు లభిస్తాయి. అంతేకాదు, పటిష్ఠమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పర్చుకోవాలన్నా, విపత్కర పరిస్థితుల్లో ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకొని పాలన సాగాలన్నా, సాధారణ ప్రజలపై పన్నుల భారం పడవద్దన్నా ఒకే ఒక మార్గం ప్రభుత్వం తన సొంత ఖజానాను కలిగి ఉండటం. ప్రభుత్వం ఖజానా కలిగి ఉండాలంటే స్వయంగా ప్రభుత్వమే డబ్బు సంపాదించాలి. అది కేవలం ప్రభుత్వరంగ సంస్థల ద్వారానే సాధ్యమవుతుంది. ఈ ఆలోచనల్లోంచి పుట్టినవే ప్రభుత్వరంగ సంస్థలు, సహకార సంఘాలు. ఇవి దేశంలో పారిశ్రామిక పునాదిని సృష్టించేందుకు సహాయపడుతాయి. ఉపాధిని సృష్టించడంలో సహాయం చేస్తాయి. అసమానతలను తగ్గించడానికి, దేశ ఆర్థికవృద్ధి, అభివృద్ధిని వేగవంతం చేయడానికి దోహదపడుతాయి.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభు త్వం తొమ్మిదేండ్ల పాలనలో ప్రభుత్వరంగ సంస్థలను, సహకార సంఘాలను తుంగలో తొక్కింది. కానీ తెలంగాణలో మాత్రం సహకార సంఘాలు మూడు కాయలు, ఆరు పువ్వులుగా వర్ధిల్లుతున్నాయి. దానికి తాజా ఉదాహరణే మొన్న వచ్చిన సెస్ ఫలితాలు. అంటే ప్రజలు ‘మేం బీఆర్ఎస్ వెంటే ఉన్నామ’ని ప్రతిపక్షాలకు చెప్పకనే చెప్పాయి.
ఇదిలా ఉంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలు ప్రజలకు స్పష్టంగా అవగతమయ్యాయి. అందుకే దేశ ప్రజలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదం పట్ల ఉత్సాహంగా ఉన్నారు.
(వ్యాసకర్త: తెలంగాణ వికాస సమితి జిల్లా అధ్యక్షులు, రాజన్న సిరిసిల్ల)
-ఫణి రాజారావు రామినేని
94406 40006