ప్రజాస్వామ్యం అంటే ప్రజల కోసం, ప్రజల చేత ప్రజలే పరిపాలించుకొనే ఒక ఉన్నతమైన పద్ధతి. ప్రజాస్వామ్యంలో ప్రజలే సమస్తం, సర్వం. ఇంకా చెప్పాలంటే ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా ప్రభుత్వమే రాజ్యం చేస్తుంది. చేయాలి కూడా. అంతేకానీ, ఢిల్లీ నామినేట్ చేసిన గవర్నర్లు కాదన్నది ప్రజాస్వామ్యం అసలు అర్థం. ఇక మన దేశంలో గవర్నర్ల రాజకీయం చాలా గందరగోళంగా ఉన్నది.
రాజ్యాంగబద్ధంగా నడవాల్సిన రాజ్భవన్లు రాజకీయాలకు అడ్డాగా మారడం ఈ దశాబ్దపు దరిద్రం కాక మరేమని విశ్లేషించాలి. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన తమిళిసై సౌందర్రాజన్, ఈ రాష్ట్ర గవర్నర్ అనే రాజ్యాంగ పదవికి అర్హులు ఎలా అవుతారనే ప్రశ్న ఈ సందర్భంగా తలెత్తడం సహజమే. స్వరాష్ట్ర ఉద్యమ నాయకులు, బలహీనవర్గానికి చెందినవారు తెలంగాణ సమాజానికి నిర్విరామంగా సేవలందించిన డాక్టర్ దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా (గవర్నర్ కోటాలో) అర్హులు కారని స్వయంగా గవర్నరే చెప్పడం హాస్యాస్పదం. ఈ పరిణామం పూర్తిగా బలహీనవర్గాలకు చెందిన నిస్వార్థపు నాయకులపై కత్తి కట్టడంగానే అర్థం చేసుకోవచ్చు. ఈ చర్యను తెలంగాణ సమాజం ఏ మాత్రం హర్షించదు. అసలే స్వాగతించదు.
సీఎం కేసీఆర్ అధ్యక్షతన జూలై 31న సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించి, గవర్నర్ కోటాకు సరితూగే దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణను ఎంపిక చేసి, వారి పేర్లను రాజ్భవన్ (రాష్ట్ర గవర్నర్ కార్యాలయం)కు పంపించింది. అయితే, ఆ ఇద్దరికీ రాజకీయ నేపథ్యం ఉన్నదని, ఈ కారణంగానే వారి అభ్యర్థిత్వాలను తిరస్కరిస్తున్నానని గవర్నర్ తమిళిసై అధికారిక ప్రతిస్పందనలో పేర్కొనటం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. గవర్నర్ తమిళిసై నిర్ణయం రాష్ట్ర రాజకీయవర్గాల్లో తీవ్ర అసంతృప్తి రేపుతున్నది. రాజ్యాంగ పదవిలో ఉంటూ రాజకీయాలు చేయటమే పరమావధిగా తమిళిసై వ్యవహరిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. గవర్నర్ పదవి చేపట్టేముందు ఫక్తు రాజకీయ పదవిలో ఉన్న తమిళిసై రాజకీయాల్లో ఉన్నందునే ఇద్దరి అభ్యర్థిత్వాలను తిరస్కరించడం అవకాశవాదానికి పరాకాష్ఠగానే భావించాలి. ‘రాజకీయ నాయకులను ఎమ్మెల్సీలుగా ఎలా నియమిస్తారు?’ అని ఆమె వ్యాఖ్యానించడం విడ్డూరం. రాజకీయ నాయకులు రాజ్యాంగబద్ధమైన గవర్నర్ పదవికి అనర్హులని సర్కారియా కమిషన్ సుస్పష్టం చేసినా నవ్విపోదురుగాక నాకేటి అన్నట్టు తమ పార్టీల నేతలను అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ యథేచ్ఛగా గవర్నర్లుగా నియమిస్తున్న, నియమించిన చరిత్ర ఉన్నది. రామ్లాల్, కుముద్బెన్ జోషి లాంటివాళ్లను కాంగ్రెస్ పార్టీ నియమిస్తే, అదే బాటలో తమిళిసైను బీజేపీ నియమించింది. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసి, ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన తమిళిసైని గవర్నర్గా నియమించటం ఎంతవరకు సబబు అనేది ప్రశ్న. రాజ్భవన్ను బీజేపీ అడ్డాగా చేసుకొని రాజకీయాలు చేయటమే గవర్నర్ గిరీ అన్నట్టుగా తమిళిసై వ్యవహరిస్తున్నారనేది తెలిసిందే.
ఉమ్మడి రాష్ట్రంలో కానీ, తెలంగాణ ఆవిర్భావం తర్వాత కానీ దాదాపుగా ఏ గవర్నర్తోనూ సీఎం కేసీఆర్కు, బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎలాంటి వివాదాల్లేవు. కానీ ప్రస్తుత గవర్నర్ తమిళిసై ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి కిరికిరీలు పెడుతున్నారు. రాష్ట్ర ప్రజలకు, కేంద్ర ప్రభుత్వానికి వారధిగా ఉంటానంటూనే ఆమోదయోగ్యం కాని రాజకీయం చేస్తున్నారు. అందుకు తమిళిసై పలు సందర్భాల్లో చేసిన ఆరోపణలే నిదర్శనం. ప్రభుత్వం ఎంతో సంయమనంతో వ్యవహరిస్తున్నప్పటికీ రాజకీయ నేతలాగే గవర్నర్ వ్యాఖ్యానిస్తున్నారు. భారత రాజ్యాంగం ప్రకారం సాధారణంగా రాష్ర్టాల్లో గవర్నర్ పేరుతో పాలన నడుస్తుంది. అంతేకానీ, సదరు గవర్నర్కు ఎలాంటి కార్య నిర్వాహక అధికారాలు ఉండవన్న విషయం ఆమెకు తెలియదా? పాలనంతా క్యాబినెట్ సూచన మేరకే చేయాలి, చేయాల్సిందే. అదే మన రాజ్యాంగ పెద్దల ఆలోచన.
ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారు ఒక సమస్యతో వ్యవహరించేటప్పుడు తమ మధ్య ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ శత్రువైఖరి కలిగి ఉండరాదు. రాజ్యాంగ నిర్మాతల ఉన్నత ఆలోచన కూడా అదే. ప్రభుత్వం ఏదైనా తప్పు చేసిందా?
అంటే మన గవర్నర్ దగ్గర జవాబు లేదు.
గతంలో, రాజీవ్గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు రాష్ట్రపతిగా ఉన్న జ్ఞానీజైల్సింగ్ కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను తిరస్కరిస్తూ ఉండేవారు. కోపగించిన రాజీవ్ ప్రభుత్వం జైల్సింగ్ను విదేశాలు వెళ్లేందుకు అనుమతించలేదు. వేరే ఇతర పర్యటనలకూ అనుమతి నిరాకరించింది. జైల్సింగ్ కాంగ్రెస్ సీనియర్ నేత. మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి నమ్మిన బంటుగా ఆయనకు పేరుండేది. అటువంటి వ్యక్తిని కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండగానే అవమానించిం ది. కానీ తెలంగాణ ప్రభుత్వం అందుకు పూర్తి భిన్నం. అయినప్పటికీ గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వంపై ఇంకా అనవసర ఆరోపణలు చేయడం, అవసరం లేని దాడిని కొనసాగించడం అర్థరహిత చర్యలే. గవర్నర్ ఇలాంటి అంశాలు, పనులు ఎంత ఎక్కువ చేస్తే అంత ఎక్కువగా ఆ పదవికి ఉన్న ఔన్నత్యాన్ని పోగొట్టుకున్నట్టే అవుతుందని తెలుసుకోవాలి. తమిళిసై పదవిలోకి వచ్చిననాటి నుంచి చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యకలాపాలన్నీ తెలంగాణ ప్రాంత ఆకాంక్షలు, అస్తిత్వం మీద దాడిగానే భావించాల్సి ఉంటుంది. అయితే, ఈ ప్రాంతంపై దాడిని ఎప్పుడూ తెలంగాణ ప్రజానీకం హర్షించదని సరైన సమయంలో, సరైనవిధంగా బదులిస్తుందన్న విషయాన్ని తమిళిసై గుర్తుంచుకోవాలి.
(వ్యాసకర్త: చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు)
-డాక్టర్ జి.రంజిత్రెడ్డి