రాజకీయాలలో ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు చెప్పటం నాయకులకు సర్వసాధారణం. అధికార ప్రయోజనాల కోసం వారట్లా మాట్లాడటానికి ప్రజలు కూడా అలవాటు పడిపోయారు. అయినప్పటికీ కొన్ని విషయాలు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. తాము అధికారంలోకి వచ్చిన మూడు మాసాలలోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పదేపదే ప్రకటించడం అటువంటి వాటిలో ఒకటి.
ఆ మాట నిజం కాదని, తమ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి పాలనా ప్రక్రియ అంతా పూర్తి చేయగా ఎన్నికల కోడ్తో నిలిచినవాటికి నియామక పత్రాలు ఇవ్వటమే తప్ప.. కొత్త ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి చేసింది ఒక్కటైనా లేదని బీఆర్ఎస్ ప్రతిసారి ఎత్తిచూపుతున్నది. అది నిజమే అయినప్పటికీ ఆ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నందున అట్లానే మాట్లాడుతుందని కాంగ్రెస్తో సహా ఎవరైనా కొట్టి వేస్తే వేయవచ్చు. కానీ స్వయంగా ఆ నియామక పత్రాలు అందుకున్నవారు గానీ, ఇతరత్రా నిరుద్యోగులు గానీ అంటున్నదేమిటో మనం వింటున్నామా?
Congress | వారు చెప్తున్న మాటల వీడియోలు సోషల్ మీడియాలో విరివిగా ఉన్నాయి. వాటిని ఇప్పటికే చూస్తున్నవారు సరేసరి. చూడనివారు ఇప్పటికైనా చూడవచ్చు. వేర్వేరు స్టడీ సెంటర్లకు వెళ్లి నేరుగా వారితో మాట్లాడవచ్చు. అభ్యర్థులతో మాత్రమే కాదు, వారి టీచర్లతో కూడా. అందరికందరూ ఒకేమాటగా చెప్తున్నది ఈ 30 వేల నియామకాలని చెప్తున్నవాటిలో కొత్త ప్రభుత్వం తన తరఫున కొత్తగా నోటిఫికేషన్లు ఇచ్చి చేస్తున్నవి అసలు ఏమీ లేవని. ఇవన్నీ పాత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి అంతా చేయగా ఎన్నికల కోడ్ వల్ల నిలిచిపోయినవేనని. వారంతా ఈ మాటలన్నీ ఎంత మాత్రం అస్పష్టత లేకుండా చెప్తున్నారు.
ఈ సమాచారం ప్రభుత్వానికి చేరటం లేదనుకోగలమా? అయినప్పటికీ ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, పార్టీ నాయకులు 30 వేల ఉద్యోగాల మాట మళ్లీమళ్లీ ఎందుకు అంటున్నారు? వాస్తవానికి ఈ నిజాలు వారికి బీఆర్ఎస్ గానీ, నియామక పత్రాలు అందుకున్నవారు గానీ, నిరుద్యోగులు గానీ, వారి టీచర్లు గానీ చెప్పనక్కర్లేదు. అన్నీ విషయాలు ప్రభుత్వానికి స్వయంగా తెలుసు. అయినప్పటికీ ఈ విధంగా ఇంత నిర్భయంగా అసత్యాలు ఎందుకు చెప్తున్నట్లు? ఆశ్చర్యం కలిగిస్తున్నది ఇదే. నిరుద్యోగులను ఇట్లా మోసం చేయ తగునా?
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగ సమస్య, నిరుద్యోగులూ ఎంతో కీలకమైన పాత్ర వహించిన విషయం తెలిసిందే. యథాతథంగానే ఆ సమస్య ఉండగా 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతుండగా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష పత్రాల లీక్, పలుమార్లు పరీక్షల రద్దు అన్నది అగ్నికి ఆజ్యంగా మారాయి. నిరుద్యోగులు కాలికి బలపం కట్టుకుని ఊరూరు తిరిగి బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. వాస్తవానికి లెక్కల్లోకి వెళితే గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు తక్కువేమీ కాదు. కానీ యథాతథంగా నిరుద్యోగ సమస్య అయితే ఒక నిజం కాగా, తాము చేసినవేమిటో ఆ ప్రభుత్వం సరిగ్గా చెప్పుకోలేకపోగా, ప్రశ్నాపత్రాల లీకేజీ ముందు అన్నీ కొట్టుకుపోయాయి. కాంగ్రెస్ వ్యూహకర్తలు, ఇతర ప్రతిపక్షాలు, విమర్శక మేధావులు ఆ స్థితిని గొప్పగా ఉపయోగించుకున్నారు.
ఎన్నికల సమయంలో ఉండిన ఈ వాతావరణాన్ని తాము అధికారానికి వచ్చిన తొలినాళ్లలో కూడా ఉపయోగించుకొనజూసిన ప్రభుత్వ నేతలు.. తాము 30 వేల ఉద్యోగాలు ఇచ్చేశామనే ప్రచారాన్ని మొదలుపెట్టారు. అట్లాగే ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్లు ఏడాదికాలంలో, అనగా డిసెంబర్ 2024 నాటికి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కొత్తగా ఇవ్వగలమని భరోసా ఇవ్వసాగారు. బహుశా దీనిపై నమ్మకం కలిగించేందుకు కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వమే అంతా చేసిన 30 వేల ఉద్యోగాలను తమవిగా చెప్పుకోవటం మొదలుపెట్టారు.
ఈ మాటలను నిరుద్యోగులు, వారి టీచర్లు ఆ తొలినాళ్లలో ఎట్లా తీసుకున్నారో తెలియదు గానీ కొద్దివారాలు గడిచేసరికే అవన్నీ అసత్యపు మాటలని వారు గుర్తించడం, ఆ విధంగా మాట్లాడటం, ప్రభుత్వం పట్ల నిరసనలు వ్యక్తపరచడం మొదలైపోయింది. నిరుద్యోగులు పరీక్షల కోసం సిద్ధమవుతున్నారు కనుక బహిరంగ ఆందోళనలు చేస్తుండకపోవచ్చు. కానీ వారి ఆలోచనలు పైన చెప్పినట్లు సోషల్ మీడియాలో, ఇతర వేదికలలో నిరంతరం వ్యక్తం కావడం చూస్తూనే ఉన్నాం. వారు ఎత్తిచూపుతున్నది ఏమిటి? ఈ 30 వేల నియామకాలన్నవి గత నోటిఫికేషన్లే తప్ప కొత్తవి కాదు అన్నది ఒకటి కాగా.. కొత్త నోటిఫికేషన్లు, పరీక్షలు అంటూ విడుదల చేసిన వేర్వేరు ఉద్యోగాలలో కూడా గత ప్రభుత్వం ప్రకటించిన సంఖ్యలకు బాగా కోత పెట్టారనేది మరొకటి. మెగా డీఎస్సీ అని ఆశ పెట్టి అటువంటిదేమీ లేకపోగా.. దగా డీఎస్సీగా మారిందనే మాట వారే ఉపయోగిస్తున్నారు.
ఇంకా ఇటువంటి విషయాలే మరికొన్ని ఎత్తిచూపుతున్నారు. ఈ ధోరణిపై నిరసనగా ఇటీవల హైదరాబాద్లోని అశోక్నగర్లోనైతే ఒక టీచర్, కొంతమంది విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. వారికి మద్దతుగా రాష్ట్రమంతటి నుంచి పలువురు నిరుద్యోగులు తరలివచ్చారు. ఆ సందర్భంగా మూడు మాటలు ప్రముఖంగా వినిపించాయి. వాటిలో ఒకటోది ఏమిటంటే.. ఇప్పుడు ఇచ్చామని అంటున్న ఉద్యోగాలన్నీ గత ప్రభుత్వానివే తప్ప కొత్తది ఒక్కటైనా లేదని. రెండోది.. ఉన్న ఉద్యోగ ఖాళీలకు ప్రస్తుత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చే సమయంలో కోతలు పెట్టి బ్యాక్లాగ్ను సృష్టిస్తూ తమకు అన్యాయం చేస్తున్నదని. మూడోది.. బహుశా ఇంతకన్నా ముఖ్యమైన మాట. వారంతా ముక్తకంఠంతో అంటున్నది.. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు అనేది పూర్తిగా అసాధ్యం. అది మోసపు మాట. మూడు మాసాల్లో ఒక్క ఉద్యోగమైనా కొత్తది ఇవ్వనివారు మిగిలిన తొమ్మిది మాసాల్లో రెండు లక్షలు ఎట్లా ఇస్తారన్నది వారి సూటి ప్రశ్న.
ఇదికాక నిరుద్యోగుల నుంచి, విద్యార్థుల నుంచి మరికొన్ని ప్రశ్నలు వినవస్తున్నాయి. జాబ్ క్యాలెండర్ అంటూ హామీ ఇచ్చి అందులో అనేకం ఇంతవరకు ప్రకటించలేదు. రెండు లక్షల ఉద్యోగాలు ఏయే శాఖలలో, ఏవేవి, ఎన్నెన్ని ఉన్నాయనే లెక్కలు ఇప్పటిదాకా సేకరించి చెప్పలేదు. నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చి ఇంతవరకు అమల్లోకి తేకపోగా.. సాక్షాత్తూ అసెంబ్లీలో స్వయంగా ఉపముఖ్యమంత్రి తాము అసలా హామీయే ఇవ్వలేదన్నారు. కనీసం తర్వాతనైనా ఆ మాటలను సవరించుకోలేదు. వంద రోజుల గడువు గల 6 గ్యారెంటీల్లో భాగంగా విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డులు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ ప్రసక్తి తేవడం లేదు. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూళ్లు తెస్తామని ప్రకటించి నామకార్థంగా ఏదో చేయడం తప్ప తిరిగి ఆ జోలి లేదు. స్కూలు పిల్లలకు ఉదయం వేళ అల్పాహార పథకం అర్ధాంతరంగా ఆగిపోయింది. వీటితో పాటు నిరుద్యోగులు, విద్యారంగానికి సంబంధించిన వివిధ అంశాలు కూడా వారి మధ్య చర్చకు వస్తున్నాయి.
ఇవేమీ జరగకుండానే ఇప్పుడిక లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఆ నిబంధన జూన్ మొదటి వారానికి గానీ ముగియదు. అప్పటి నుంచి 2 లక్షల ఉద్యోగాల భర్తీకి డిసెంబర్లోగా మిగిలే సమయం కేవలం 6 నెలలు. అసలు అన్ని ఉద్యోగ ఖాళీలు ప్రభుత్వంలో ఎక్కడున్నాయో లేదా ఏ విధంగా సృష్టిస్తారో ఇంతవరకు లెక్కలు లేవు, స్పష్టత లేదు. ఎన్నికలు ముగిసే వరకు ప్రభుత్వ నాయకత్వమంతా వాటితోనే తలమునకలుగా ఉంటుంది. ఆ తర్వాత ఈ కార్యమంతా ఎంతవరకు సాధ్యం?
ఈ ప్రశ్నల గురించి చర్చించేందుకు ప్రభుత్వ నాయకత్వానికి ఇష్టం లేకపోవచ్చు. లేదా వారందుకు జంకుతుండవచ్చు. కానీ నిరుద్యోగులలో, వారి కుటుంబాలలో, విద్యార్థులలో, టీచర్లలో ఇందుకు సంబంధించి ఒక చర్చ మరొక చర్చకు దారి తీయడం మొదలైంది. ప్రభుత్వ నాయకత్వం ఇది గ్రహించి వాస్తవ స్థితి ఏమిటో చెప్పి దిద్దుబాటు చర్యలు ఏవైనా వీలవుతాయో ఆలోచించటానికి బదులు.. తాజాగా ఈరోజు వరకు కూడా తాము మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చామనే అసత్యాన్ని ఎంతో ధైర్యంగా మళ్లీ మళ్లీ చెబుతున్నారు.
ఆ కారణంగా నిరుద్యోగులకు, యువతీయువకులకు, విద్యార్థులకు, టీచర్లకు ప్రభుత్వంపై విశ్వాసం వేగంగా అడుగంటిపోతున్నది. అందుకు సమాంతరంగా నిరసన భావనలు అంతే వేగంగా పెరుగుతున్నాయి. దేశంలో నిరుద్యోగం, హామీలు, ఆశానిరాశలు, నిరసనలు, ఉద్యమాలు మనం ఎప్పటినుంచో చూస్తున్నవే. కానీ వారి ఆశలు స్వల్పకాలంలోనే ఎంతో ఉవ్వెత్తున ఎగిసి, అంతే వేగంగా తిరిగి పడిపోతుండటం మాత్రం అరుదైన స్థితి. దాని ప్రభావాలు ఏ విధంగా ఉండగలవన్నది వేచి చూడాల్సిన విషయం.
ఇవేమీ జరగకుండానే ఇప్పుడిక లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఆ నిబంధన జూన్ మొదటి వారానికి గానీ ముగియదు. అప్పటి నుంచి 2 లక్షల ఉద్యోగాల భర్తీకి డిసెంబర్లోగా మిగిలే సమయం కేవలం 6 నెలలు. అసలు అన్ని ఉద్యోగ ఖాళీలు ప్రభుత్వంలో ఎక్కడున్నాయో లేదా ఏ విధంగా సృష్టిస్తారో ఇంతవరకు లెక్కలు లేవు, స్పష్టత లేదు. ఎన్నికలు ముగిసే వరకు ప్రభుత్వ నాయకత్వమంతా వాటితోనే తలమునకలుగా ఉంటుంది. ఆ తర్వాత ఈ కార్యమంతా ఎంతవరకు సాధ్యం?
టంకశాల అశోక్