జాతీయ పార్టీ జారుడు బండ మీద నిలబడి అధఃపాతాళంలోకి వేగంగా దిగజారిపోతున్నది. మర్రివృక్షం లాంటి హస్తం పార్టీ ఓ వికృత మానసిక స్థితిలో ఊరేగుతున్న మరుగుజ్జుపై ఆధారపడ్డది. రేవంత్రెడ్డి లాంటి పైశాచిక ప్రవర్తనకు అలవాటు పడ్డ వ్యక్తి, స్వహస్తాలతో చేతి గుర్తును మకిలి గుంటలో ముంచేస్తున్నాడు. నింగిపై బురద విసరాలనే లేకితనంతో కాంగ్రెస్ ముఖంపై ప్రజారాశులు ఉమ్మేసే వాతావరణాన్ని కోరి కల్పించాడు.
నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుందనే నానుడి నెత్తికెక్కని ఉన్మాదిని పీసీసీ అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టుకొని, మోరీలా మారిన ఆయన నోటికి మైకులు తొడిగి ఊరేగిస్తే, తెలంగాణ సహిస్తుందా? అసలే దశాబ్దాల దగా చరితను నుదిటిపై హస్తం పార్టీ భారీ అక్షరాలతో రాసుకున్నది చాలక, నోరు పారేసుకొనే రేవంత్ను ముందేసుకొని, వారే తలకొరివి పెట్టుకుంటున్నారు.కారణజన్ముడిపై, తెలంగాణ నలుమూలల ప్రగతిని పరిచిన పాలకుడిపై, ప్రజలందరూ తమ పెద్ద సారుగా మనసారా గౌరవించుకునే కేసీఆర్పై అడ్డగోలు మాటలతో ఆగమైపోతున్నదెవరు? నదికి నిప్పు పెట్టగలననుకునే పొలిటికల్ పరంధామయ్య నోటి దూలకు గాంధీభవన్ కుప్పకూలిపోతుండటం చూసి, ఆ పార్టీని వీడలేక మిగిలిపోయిన గుంపు కూడా గుండెలు బాదేసుకుంటున్నారు. పదునైన కరవాలం కంటే, విషపు నాలుక ఎంతో ప్రమాదకరమైంది. అది తన పిల్లలను మింగేసే నాగుపాములా మారి, నమ్మిన రాజకీయ పార్టీలనే నిలువునా మింగేస్తుందనే సత్యం రేవంత్రెడ్డి వల్ల లోకమంతా వెల్లడైంది. గతంలో టీడీపీలోనూ ఇదే వాగుడు, దారితప్పిన దూకుడుతనాన్ని చూపి సైకిల్ను శంకరగిరి మాన్యాలకు చేర్చాడు. ఇప్పుడు మళ్లీ అదే బాటలో బరితెగిస్తూ ఢిల్లీ పార్టీని బొందపెడుతున్నాడు. రాజకీయ రాచపీనుగ కార్యకర్తలందరి కష్టాన్ని, త్యాగాలను తనతో పాటే శ్మశాన వాటికకు తరలించేదాకా విశ్రమించదు.
రాజకీయాలు సమాజానికి సూర్యోదయాన్ని చూపే చూపుడు వేలు లాంటివి. ఎందరో నేతలు హుందాతనంతో కూడిన నడవడికతో విలువైన ప్రజా జీవితాన్ని ఆస్వాదించారు. దేశ రాజకీయాల్లో విభిన్న భావజాలాలతో రాజకీయ ప్రస్థానం కొనసాగించి జాతీయస్థాయిలో కాంగ్రెస్, బీజేపీ, జనతా తదితర రాజకీయ పార్టీలకు నాయకత్వం వహించిన అనేకులు, కూర్చున్న కుర్చీకి కళంకం తెచ్చే పలుకులు కలలో కూడా పలువరించలేదు. దేశం ఎన్నో విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్న సందర్భాల్లోనూ, పార్లమెంట్ లోపల, వెలుపల గంభీరమైన రాజకీయ వాతావరణం నెలకొన్న స్థితుల్లోనూ, దిగజారి తూలనాడేతనం కనబరచలేదు. ఒకానొక సందర్భంగా లోక్సభలో ప్రధాని నెహ్రూ విదేశీ పర్యటనపై కమ్యూనిస్టు నాయకుడు సుందరయ్య కాస్త తీవ్రంగా మాట్లాడి, మరునాడే విశాల దేశవాసులు ఎన్నుకున్న దేశ నాయకుడిపై నోరుజారడం తప్పని, నిండు సభలో క్షమాపణ కోరి విలువైన రాజకీయాలకు భాష్యం చెప్పారు. తొలినాళ్ల పార్లమెంట్లో నవ యువకుడైన వాజపేయి కూడా వరదలాంటి వాగ్ధాటి కలిగి ఉన్నా, కట్టుబాట్లను దాటి వాగిందే లేదు. అంబేద్కర్, లోహియా అంతెందుకు కేసరి నుంచి పీవీ వరకు హస్తం పార్టీని నడిపించిన మేరునగధీరులు సైతం భాషను ఆచి తూచి వాడారే కానీ, బాధించే ధోరణి ప్రదర్శించలేదు. నిన్నటి ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లోనూ ఒకరో ఇద్దరో, భావోద్వేగంతో నోరు తూలారేమో గానీ, నవ్వుల పాలయ్యే నైజాన్ని నమ్ముకోనే లేదు.
దశాబ్దాలుగా వివక్ష ఉరికొయ్యకు తెలంగాణను వేలాడదీయడంపై నిప్పుల వాగై ఎదురునిలిచిన కేసీఆర్ సైతం విషయాన్ని నమ్ముకొని, వాస్తవాల భాస్వరంలా ప్రసంగించారేగానీ ఏనాడూ ఎవరినీ అదే పనిగా దూషించలేదు. ఎన్నో అవాంతరాలు ఎదురైనా, నిత్యం నిప్పుల దారిలో నడక సాగించినా, రాజకీయకుట్రల పర్వతాలైన వైఎస్సార్, చంద్రబాబులతో ఏండ్లకేండ్లు తలపడుతున్న సందర్భంలోనూ, నేల నొప్పులకు పరిష్కారం కావాలనే తపనతో ప్రశ్నల కొడవలై కేసీఆర్ తిరగబడ్డరే గానీ, ఏనాడూ చిన్నబుచ్చుకునే మాట తీరును చూపించలేదు. కేసీఆర్ ప్రసంగానికి తెలంగాణే ప్రాణ వస్తువు. ప్రజల భవితవ్యమే కొలమానంగా, వేదికలపై చాట్లో పోసుకొని చెరిగే నిప్పుల్లా మాటలను వదిలారేగానీ, ఎవరిపై వ్యక్తిగత ద్వేషంతో విపరీత వ్యాఖ్యలు చేయలేదు.
ఉద్యమ నేతగా, పోరు నావను ఆగిపోకుండా నడిపే ఆశయంతో, తన నరాలన్నింటినీ నాలుకకు ఇరుసుగా మలిచి, మనిషే మండే మహాగోళమై నాటి పాలకులను తరిమినా, పదే పదే ఏ నేతపై అనవసర మాటల తూటాలను సంధించలేదు. ఊపిరి ఆగిపోయే సందర్భం ఎదురుపడ్డప్పుడు కూడా కేసీఆర్ సాటిలేని వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు. అందుకే చారిత్రక పురుషుడిగా జనం జేజేలు పొందుతున్నాడు. రాజకీయాల్లో ఏ లెక్కలో, సమీకరణాలో, ప్రత్యేక పరిస్థితులో వరమై ఎన్నికల్లో గెలిచి చట్టసభల సభ్యులుగా చాలామంది అడుగుపెట్టవచ్చు. అందులో కొందరే ప్రజల హృదయాల్లోకి నడిచివెళ్లగలరు. కాలం కలిసివచ్చిన ఎందరో చట్టసభల్లో, మీడియాలో చోటు దక్కించుకోగలరు గానీ కేసీఆర్లా చరిత్ర నుదిటిపై నిలిచిపోలేరు. ప్రజా ప్రేమను పొందాలనుకునే నేతల నోటి మాట రామబాణమంతటి శక్తివంతమైనది. వారి మాటకు సమాజ ప్రయోజనమే గీటురాయిగా ఉండాలేగానీ, గిల్లి కజ్జాలాటకు వాడచూడటం మహాపాపం.
ఇప్పుడు రేవంత్రెడ్డి వాగుడు చూసి తెలంగాణ సమాజం మరింత స్పష్టతకొచ్చింది. విలువలను వివస్త్ర చేసే నయా దుశ్శాసనుడి నడవడికను గమనించిన జనం పీసీసీ అధ్యక్షుడికి పొలిటికల్ పాడెను కట్టిపెట్టారు. ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అన్నట్టు నోటినిండా మురికి మాటలను నింపుకొన్న రేవంత్రెడ్డి వచ్చే నెల 3 తర్వాత జైలులో ఓ మూలకు నక్కడం ఖాయమని తేలిపోయింది. కాకపోతే ఇలాంటి పులి తోలు కప్పుకొన్న నక్కలు మనకో సందేశాన్నిచ్చి మరుగున పడిపోతాయి. మన ప్రజాస్వామ్య వ్యవస్థ విజయ ప్రస్థానంలో, ఓట్లు ఏమరుపాటుకు ఒరిగితే జరిగే నష్టం విలువను వెల్లడిస్తాయి.
మహా భారతంలో దుర్యోధనుడికీ ఓ పాత్ర ఉన్నట్టు, రామాయణంలో సీతను అపహరించడానికి రావణాసురుడిని ప్రేరేపించిన అకంపనా, హనుమంతుడి చేతిలో నేలకరిచినట్టు, రేవంత్రెడ్డి లాంటివారు కూడా ఎన్నికల సమరంలో ఓటర్ల వేటకు కనుమరుగైపోతారు. నడమంత్రపు సిరి నేడు నేల మీద కాలు ఆననివ్వదు కానీ, తొందరగానే తలకిందులుగా కుదేలేసితీరుతుంది. కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టడానికి తెలంగాణ ప్రజారాశులు చైతన్యరహితమైన వారేం కాదు కదా?
కేసీఆర్ లాగా ఆలోచించే, ఆచరించే, అడుగులు వేయించే ధైర్యం, దార్శనికత కరువైన సదరునేత అరుపులతో అందరి దృష్టినీ ఆకర్షించాలనే అర్థరహిత, అసహ్యతీరు అభాసుపాలు చేస్తుందేమో కానీ అందలమెక్కించదు. ఇలాంటి రాజకీయ మెరుపు తీగలు రాజకీయ ఉరుములా శబ్దం చేసి ఆగిపోతాయే కానీ, ఓట్ల మేఘమై గెలుపు వర్షం కురిపించలేవు. కేసీఆర్ను దూషించడమంటే తెలంగాణను తిట్టడమే. నెగ్గాలనుకుంటే కేసీఆర్ కంటే గొప్పగా అడుగులు వేయగల శక్తిని సంపాదించుకోవాలి. ఉద్యమ నేత కంటే ఉన్నతంగా జనం కోసం తపించేందుకు సిద్ధపడాలి. అది రేవంత్ రెడ్డి లాంటి వారికి వెయ్యి జన్మలెత్తినా అలవడటం అసాధ్యం. ప్రగతి విప్లవాన్ని ప్రతి పల్లెకూ సాకారం చేసిన కేసీఆర్ను అనే ప్రతి మాటకూ ముందు ముందు మూల్యం చెల్లించుకోకతప్పదు. చేసిన పాపాలకు మరో జన్మలో శాపగ్రస్థుడిగా పుడతాడనే నానుడి నేడు తిరగబడ్డది. ఇప్పుడు అన్నింటికీ ఈ జన్మలోనే లెక్క చెప్పితీరాలనే నూతన ధర్మం ఆచరణలో ఉన్నది. పాత సినిమాలలో విలనిజానికి ప్రతిరూపాలైన రావుగోపాల్రావు, రామిరెడ్డి, రఘువరన్ల వలె రేవంత్రెడ్డి కూడా వర్తమాన తెలంగాణ రాజకీయ చిత్రంలో విచిత్రాల విలన్గా గుర్తుండిపోతాడు. విలన్ పాత్రలుంటేనే హీరోల విలువ అర్థమయ్యేది. అది సినిమా అయినా రాజకీయమైనా. తెలంగాణ మళ్లీ నువ్వే గెలవాలి, దానికోసం ఓపికపట్టి ముందడుగు వెయ్యాలి. దృష్టిని దారి మళ్లించాలనే నీతిలేని వ్యూహంతో మొరిగే, ఓర్వజాలని రాజకీయ రాజనాలలను చూసీ చూడనట్టుగా వదిలి నడిచిసాగాలి. ఎవరు తవ్వుకొన్న గోతిలో వారే పడి సమాధి అవుతారనేదే అసలు సత్యం సుమా.. ఆ విషపు నాలుకే హస్తం పార్టీని మట్టుపెడుతుంది. జై తెలంగాణ .
(వ్యాసకర్త: రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్)
-డాక్టర్ ఆంజనేయ గౌడ్