ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రజారోగ్య వ్యవస్థ, ప్రభుత్వ వైద్యరంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురికాబడ్డాయి. తెలంగాణ ఏర్పడిన నాటినుంచి బంగారు
తెలంగాణ సాధనలో భాగంగా ఆరోగ్య తెలంగాణ కోసం అడుగులు పడ్డాయి. అంపశయ్యపై ఉన్న ప్రభుత్వ వైద్య రంగానికి శస్త్రచికిత్స ప్రారంభించారు ముఖ్యమంత్రి కేసీఆర్. మెజారిటీ ప్రజలకు దిక్కయిన ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేసే దిశగా ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగా జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రకటించగా.. ఇప్పటికే అవి ప్రారంభమయ్యాయి కూడా. తెలంగాణ విద్యార్థులను వైద్యులుగా తీర్చిదిద్దే లక్ష్యంతోపాటు, తెలంగాణ ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందేలా ఈ దవాఖానలు రూపుదిద్దుకున్నాయి.
స్వరాష్ట్ర ఉద్యమంలో కేసీఆర్ ఇచ్చిన ప్రతి పిలుపులో ముందుండి తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించారు సింగరేణి ఉద్యోగులు. ప్రభుత్వరంగ సంస్థగా బంగారు తెలంగాణ సాధనలో ముఖ్య భూమిక పోషిస్తున్నది సింగరేణి సంస్థ. అందుకే సంస్థ పట్ల తన ప్రత్యేక అభిమానం చాటుకున్నారు సీఎం కేసీఆర్.
కోటి ఎకరాలకు సాగునీరు అందించాలన్నది ఉద్యమనాయకుడు కేసీఆర్ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని నాటి భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీశ్రావు అహర్నిశలు శ్రమించి సకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేశారు. అదే హరీశ్రావు నేడు వైద్యారోగ్యశాఖ మంత్రిగా ప్రభుత్వ వైద్యరంగం పరిపుష్టతకు పాటుపడుతున్నారు. ప్రభుత్వ సంకల్పంలో సింగరేణి సంస్థ సైతం తన వంతు పాత్ర పోషిస్తున్నది. పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ వైద్యకళాశాలకు రూ.500 కోట్ల నిధులను ప్రకటించింది. తద్వారా ఇప్పటివరకు దేశానికి వెలుగులు పంచే సంస్థగా పేరొందిన సింగరేణి వైద్యులను అందించే సంస్థగానూ ఇక మీదట గుర్తింపు పొందనున్నది. దేశంలో ఎక్కడా లేనివిధంగా కేవలం జవాన్లకు మాత్రమే ఉండే ప్రత్యేక కోటాను సింగరేణి ఉద్యోగులకు కల్పిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇది సింగరేణి సంస్థ పట్ల ఆయనకున్న అభిమానానికి నిదర్శనం.
వైద్య విద్య అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. భారీ కాంపిటేషన్ మధ్య అంతంత మాత్రంగా ఉన్న ప్రభుత్వ కాలేజీల్లో మెడికల్ సీటు రావడం అంత ఆషామాషీ కాదు. ఇక ప్రైవేట్ కాలేజీలో చదువాలంటే కోట్లతో కూడుకున్న వ్యవహారం. దీంతో వేల మంది భారతీయ విద్యార్థులు వైద్య విద్య కోసం విదేశాలకు వలస వెళ్తున్నారు. మన దగ్గర నుంచి కూడా వలసవెళ్లే వారి సంఖ్య అధికమే.
అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ వైద్యరంగం బలోపేతానికి కోట్ల రూపాయలు వెచ్చిస్తూ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటుచేసింది. అన్ని జిల్లాల్లో ప్రభుత్వ వైద్య విద్యా కళాశాలలు ప్రారంభమై తెలంగాణ విద్యార్థులకు వేలాది సీట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో డాక్టర్ అవ్వాలన్న కల నెరవేర్చుకునే అవకాశం మన విద్యార్థులకు సాకారమైంది. మరోవైపు పేదవారికి ఆ కళాశాలల్లో ఉచితంగా మెరుగైన వైద్య సేవలందనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్, ఐటీ శాఖమంత్రి కేటీఆర్ కృషితో గ్లోబల్ సిటీగా రూపాంతరం చెందిన భాగ్యనగరం మెడికల్ హబ్గా కూడా అభివృద్ధి చెందింది. మరోవైపు ప్రభుత్వం రాష్ట్ర రాజధాని నగరంలోని ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఇతర పెద్ద దవాఖానల్లోనూ వసతులను మెరుగుపరుస్తున్నది. నగరానికి నాలుగువైపులా టిమ్స్ దవాఖానలను ఏర్పాటుచేస్తున్నది. వరంగల్లో అధునాతన 2000 పడకల దవాఖాన నిర్మాణం వేగంగా జరుగుతున్నది.
ఇక ప్రభుత్వ ఆరోగ్యరంగం బలోపేతం దిశగా సర్కారు తలపెట్టిన మహాయజ్ఞంలో తెలంగాణ కొంగు బంగారం సింగరేణి భాగస్వామిగా మారింది. ప్రభుత్వం ప్రకటించిన పెద్దపల్లి జిల్లా మెడికల్ కళాశాలకు రూ.500 కోట్లు ప్రకటించారు సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్. అన్ని జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలల మాదిరిగానే ఈ ఏడాదే పెద్దపల్లి మెడికల్ కాలేజీ ప్రారంభమై అడ్మిషన్లు జరగనున్నాయి. 150 సీట్లతో ప్రారంభం కానున్న ఈ కాలేజీలో నీట్ ఆధారంగా ఆల్ ఇండియా కోటాలో 23 సీట్లను వివిధ రాష్ర్టాల విద్యార్థులు, 127 సీట్లు తెలంగాణ విద్యార్థులు మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా పొందనున్నారు.
ప్రభుత్వరంగ సంస్థగా సామాజిక బాధ్యతతో సింగరేణి సంస్థ కేటాయించిన నిధులకు గుర్తింపుగా సంస్థ పట్ల, సింగరేణి ఉద్యోగుల పట్ల గౌరవాన్ని చాటుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. పెద్దపల్లి మెడికల్ కళాశాల పేరును సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (సిమ్స్)గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
కేవలం పేరు పెట్టి వదిలేయకుండా స్పోర్ట్స్ కోటా, మాజీ సైనికుల కోటా మాదిరిగా సింగరేణి కార్మికుల పిల్లలకు సిమ్స్లో ప్రత్యేకంగా 5 శాతం అంటే ఏడు సీట్లు కేటాయిస్తూ జీవో విడుదల చేశారు. స్వరాష్ట్ర ఉద్యమంలో కేసీఆర్ ఇచ్చిన ప్రతి పిలుపులో ముందుండి తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించారు సింగరేణి ఉద్యోగులు. ప్రభుత్వరంగ సంస్థగా బంగారు తెలంగాణ సాధనలో ముఖ్య భూమిక పోషిస్తున్నది సింగరేణి సంస్థ. అందుకే సంస్థ పట్ల తన ప్రత్యేక అభిమానం చాటుకున్నారు సీఎం కేసీఆర్.
అయితే రూ.500 కోట్లిస్తే కేవలం ఏడు సీట్లేనా? అని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. వందల కోట్లు పెట్టి ప్రైవేటు కాలేజీలు పెట్టుకున్నా వాటి యాజమాన్యాలు తమ ఇష్టానుసారంగా సీట్లు కేటాయించుకోవడానికి అవకాశం లేదని గుర్తించాలి. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సైతం 50 శాతం సీట్లు కన్వీనర్ కోటా లో అంటే నీట్లో మెరిట్ వచ్చిన విద్యార్థులకు కౌన్సెలింగ్ ఆధారంగా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుకు మాత్రమే కేటాయిస్తుంది. మిగిలిన 50 శాతంలో 35 శాతం ‘బీ’ క్యాటగిరిలో మేనేజ్మెంట్ కోటాలో అది కూడా మెరిట్ ఆధారంగా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుకు మాత్రమే కేటాయించాలి. ఇక మిగిలిన 15 శాతం మాత్రమే ప్రైవేటు మేనేజ్మెంట్లు, ఎన్ఆర్ఐ కోటాలో అమ్ముకోవచ్చు. ఇదంతా ప్రైవేట్ కాలేజీల్లో మాత్రమే. ఇక ప్రభుత్వ కాలేజీలో అసలు మేనేజ్మెంట్ కోటా ప్రత్యేక సీట్లు అంటూ ఏమీ ఉండవు. ఏదైనా మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా సీట్ల భర్తీ జరగాల్సిందే.
రామగుండంలో ఏర్పాటుచేస్తున్న మెడికల్ కాలేజ్ సైతం ప్రభుత్వ మెడికల్ కాలేజీ కానీ సింగరేణి సంస్థ ఒక ప్రభుత్వరంగ సంస్థగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రూ.500 కోట్లు దాని ఏర్పాటుకు చెల్లిస్తున్నది అంతమాత్రాన ఆ కాలేజీ సింగరేణిది కాలేదు. ఒకవేళ సింగరేణి సొంతంగా మెడికల్ కాలేజీ ఏర్పాటుచేసినా ప్రభుత్వ నియమాలకు లోబడి మాత్రమే కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది తప్ప తమ ఉద్యోగుల పిల్లలకు ఇష్టానుసారంగా సీట్లు ఇచ్చే అవకాశం ఉండదు. కావున సింగరేణి ఉద్యోగుల ప్రత్యేక విజ్ఞప్తి మేరకు సింగరేణి సంస్థ కేటాయించిన నిధులను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ప్రత్యేకంగా జీవో ఇవ్వడం ద్వారా ఐదు శాతం సింగరేణి ఉద్యోగులకు ప్రత్యేక కోటా ఉంటుంది. అందులో 7 సీట్లు సింగరేణి ఉద్యోగుల పిల్లలకు మెరిట్ ఆధారంగా రిజర్వ్ చేయబడతాయి.
ఏడు సీట్లు అంటే అంత ఆషామాషీ ఏం కాదు. 150 సీట్లలో 7 మెడికల్ సీట్లు రిజర్వ్ చేయటం గొప్ప విషయమే. సింగరేణి సంస్థ ప్రజల ప్రాణాలు కాపాడే డాక్టర్ల తయారీకి రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టడమూ గర్వకారణమే. సింగరేణి ఉద్యోగులకు 7 సీట్లు కేటాయించటం ప్రభుత్వం సింగరేణి సంస్థకు, ఉద్యోగులకు కల్పించిన గౌరవంగా భావిద్దాం.
-ఎర్రబెల్లి ప్రదీప్రావు
99660 89696