‘నా సోపతిగాళ్లందరు హైద్రావాదే వోతర్రు, నేన్గూడ అటే వోతనే, అక్కన్నే సదువుకుంట. బాపుతోని జెప్పి జెర ఒప్పియ్యే’ అని నన్ను బతిలాడుతున్నడు శశాంక్. వానిది ఇంటరైపోయింది, బీటెక్ సదువుకోడానికి పట్నం వోతా అని ఆడు. ‘శశాంకూ జెర శెప్పినట్టినురా.. ఇంటికాన్నుంచే రోజు హుజ్రావాద్కు వొయిరారా’ అని నేను. ‘లేద్, లేద్. నేను హైద్రావాద్కే వోతనమ్మా’ అని ఆడు మంకుపట్టు వడుతున్నడు.
‘ఇగ నీ ఇట్టం, మీ అయ్యిట్టం..’ అనంటే.. ‘ఒక్కొక్కళ్లకు ర్యాంకు మంచిది రాకున్నా పైసల్ వెట్టి హైద్రావాద్ల సీటు కొంటున్నరు. నాకు మంచి ర్యాంకు అచ్చినా పట్నం పంపుమంటే మీరు ఎన్కాముందయితున్నర’ని ఆడు వట్టిన కుందేలుకు మూడే కాళ్లంటున్నడు. మజ్జన రానే అచ్చిండు నా పెనిమిటి సత్యనారాయణ. ‘శశాంకూ శెప్తిను బిడ్డా.. నీ ఎన్క శెల్లె కౌశికి గూడ సదువుకోవాలె గదా? సీటు అగ్గువకే అచ్చినా, హైద్రావాద్ల ఉం డుడంటే ఉత్త ముచ్చటేనారా? నీ దగ్గరికి మేమొచ్చుడో, మా దగ్గరికి నువ్వొచ్చుడో కొద్ది కర్సులైతాయిర? బస్కిరాయిలే బొచ్చెడైతయి. అవి వోను, చేతిలకు ఎంతలేదన్నా నెలకో ఆరేడు వేలు గావాలె. ఇటు నీకు, అటు శెల్లెకు నెల నెలా ఇన్నిగనం పైసలంటే ఎట్లా ఎల్తయిర? అసలే ఈ నడుమ గిరాకీ ఉంటలేదు?’ అని తన బాధ శెప్తున్నడు. శశాంక్ను ఆయన బుదరకిస్తున్న తీరు జూస్తుంటే మేం వడ్డ బాధలు కండ్లముందల మెదిలినయి.
మా మామ మాడిశెట్టి రాజేశం(కేరాఫ్ ‘ఎమ్మార్ టైలర్’)కు నలుగురు కొడుకులు. ఒక్క బిడ్డ. మామున్నన్ని రోజులు ఉమ్మడిగ, అందరం గల్సే ఉన్నం. ఆయన వోయినంకనే గూడు శెదిరిన పచ్చులోలె నపరో దిక్కయినం. కన్నారం జిల్లా మా మానకొండూర్ల ఎమ్మారే పేరువోయిన బట్టలు గుట్టే దుకాణం. మా మామనే దానికి ఓనర్. ఆయన కింద మా ముగ్గురు బావలు, మా ఆయన పన్జేత్తుండె. ఊరంతా మా దగ్గర్నే బట్టలు కుట్టిచ్చుకునేటోళ్లు.
దసరా, రంజాన్ పండుగలొచ్చినయంటే సాలు నెలరోజుల ముందునుంచే బొచ్చెడు గిరాకీ ఉంటుండె. టేప్ వట్టుకొని కొలతలు దీస్కోవడానికే ఒగలు గూసుంటుండె దుకాన్ల. ఇగ పెండ్లిళ్ల సీజనప్పుడు గూడ అంతే. మావోళ్లకు తినడానికి గూడ తీరిక దొర్కకవోతుండె.
ఈ మజ్జన ఒగనాడు దుకాన్లకెల్లి ఇంటికచ్చిన మా ఆయన మొకం సిన్నవోయింది. ‘ఏమైందుల్లా అంత ఎటో ఉన్నవ్?’ అనడిగితే ఇట్ల జెప్పవట్టిండు… ‘పొద్దంతా దుకాన్ల ఈగలు, దోమలు కొట్టుకుంటున్న. పురుగు రాలేదు గని, పోయేముందు ఓ పిలగాడొచ్చిండె. ఆ పిలగాని చేతిల వరుకు కనవడేసరికి పానం జెరంత ఉశారైంది. ఆ వరుకుల కెళ్లి ఒక్క జత దీత్తడా, రెండు జతల్దీత్తడా అని ఆత్రంగా ఎదిరిజూసిన. తీరా ఆ పిలగాడు వరుకుల కెల్లి రెండు పాత జీను పాయింట్లు దీసిండు. ఒగదానికి నడుం టైట్ జేయాల్నట, ఇంకోదానికేమో కాళ్లు కట్జేసి కుట్టాల్నట! ఆ పిలగాని నోట్లెకెల్లి ఆ మాటిన్నంక నోటికాడి బుక్క జారినంత పనయింది. వారం రోజులాయె కుట్టుమిషిన్ల దారమెక్కియ్యక… ‘అబ్బా ఓ రెండు రోజులకు సరిపోయే పని దొరికిందిరా అయ్యా’ అని నాది నేనే మనసులనుకున్న. నా ఆశలల్ల మన్నువోసినంత పనైంది. ఆ పిలగాన్ని ఆన్నే గూసోవెట్టి దబాదబ్బ రెండు పాయింట్లు కుట్టిచ్చిన. ఆ పిలగాడు పాయింటుకు యాభై సొప్పున వంద రూపాలు నా చేతిల వెట్టిండు, ఇగవట్టు’ అని అవి నా చేతిల వెట్టిండు.
మా బాధలిట్లా ఉన్నయని పోరగాండ్లకు జెప్పుకుంటమా? ఆయాళ్ల అయ్యాకొడుకులిద్దరు మాట్లాడుకుంటున్నరు. ఇగ నేనే మజ్జల వొయి ‘బిడ్డా ఒక్కగానొక్క కొడుకువు. నువ్వు పట్నం బొయ్యి సదువుకుంటే మేం ఎవ్వల మొకం జూస్కొని బతుకాలెరా?’ అన్న. మారుమాట మాట్లాడలే. ‘సరే తియ్యిర్రే హుజ్రావాదులైతే, హుజ్రావాదులనే సదువుకుంటా’ అని తలూపిండు.
2023 ఫిబ్రవరి 13: తెల్లారంగనే లేసే శశాంక్ ఇంకా లేస్తలేడని ‘అరేయ్ శశాంకూ.. ఓరి శశాంకూ..’ అని పిలిస్తే సై లేదు సప్పుడు లేదు. మంచం కాడికి వొయి లేపంగ లేపంగా ‘ఊ..’ అని మెల్లగ మూల్గుతున్నడు. నోట్లెకెళ్లి గూత బల్మీట్టికెళ్తున్నది. నొసలు కాడ చెయివెట్టి జూత్తె పెయ్యి సలసలా మసులుతున్నది. అప్పటికి పదిహేను రోజులాయె అస్తున్నది, పోతున్నది గని బొత్తిలకు మాత్రం తగ్గుతలేదు. మా ఆయనకు ఇగ వశపడక ‘రమా… (రమాదేవి) ఆన్ని వట్టుకొని కన్నారమన్నా వొయిరాపోరాదన్నడు. నేను, శశాంక్ ఇద్దరం గల్సి కన్నారం దావకాన్లకు వోయినం. డాక్టర్ జెప్పి న టెస్టులన్నీ జేపిచ్చిన, ఎన్లేం ఎల్లలే. ఆఖరికి ఒక్క టెస్టు జేపిస్తే, ఆ టెస్టుల ఏమొస్తదో రేపు తెలుస్తదని జెప్పిండు నెత్తురు దీస్కున్నాయన. తెల్లారి గుండెలు వల్గిపోయే వార్త జెప్పిండు కన్నారం డాక్టర్. మావోనికి తెల్ల రక్తకణాలు తగ్గిపోతున్నయట. క్యాన్సర్ లెక్క కొడ్తున్నదని, పట్నం దీస్కపోవాలన్నడు.
నిమ్స్ దవాఖానకొచ్చినం. ‘ఏంగాదమ్మా మీ కొడుక్కు, దైర్నంగుండుర్రి, మంచిగయితడ’ని డాక్టర్ సదాశివ సార్ అన్నడు. ‘సార్ మేం ప్యాదోళ్లం మీరే ఎట్లనన్న సాయం జెయ్యాలె’ అని మా బాధలు జెప్పుకున్నం. ఐదు లక్షల ఎస్టిమేషనేసిచ్చి, గవర్నమెంటుకు దరఖాస్తు వెట్టుకొమ్మని దారి సూపెట్టిండు.
2023 మార్చి 24 శుక్రవారం రాత్రి: మా పెద్ద యారాలు కొడుకు కిశోర్, ఆయన దోస్తుతోని గల్సి మంత్రి హరీశ్రావు సార్ దగ్గరికి వొయి దరఖాస్తు ఇచ్చిర్రట. తెల్లారే.. ‘అమ్మా.. మీకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్రావు సార్లు ఒక్క లెటర్ పంపిర్రు. అచ్చి తీస్కపోతు రా.. నేను నిమ్స్ దవాఖాన్లున్న’ అని సక్కగా దవాఖానకే అచ్చి ఫోన్జేసిండు నరేశన్న. ఆ లెటర్ డాక్టర్ సదాశివ సారుకు సూపెడితే ‘అమ్మా.. మీకు ప్రభుత్వం రూ.2,50,000 సాం చన్ చేసింది, ఇగ మేం ట్రీట్మెంట్ చాల్జేత్తం’ అని జెప్పవట్టిండు. రెండుజేతులా దండం పెట్టి ‘మేం దరఖాస్తు వెట్టుకొని 24 గంటలు గూడ గడవలె, ప్యాదోళ్లమైన మాకు తెలంగాణ ప్రభుత్వం సాయం జేసింది సార్’ అని డాక్టర్ సారుకు శెప్పకుంటా శశాంక్ కాడికొచ్చిన.
99590 59041