స్వతంత్ర వజ్రోత్సవ భారతంలో అవకాశాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నవి సంచార జాతులే. సమాజ హితమే వృత్తి, ప్రవృత్తులుగా చేసుకొని సహజీవనం సాగిస్తున్నవి ఈ జాతులే. ఆధునిక సమాజంలో అంతరిస్తున్న కులవృత్తులపై అందరికీ ఆవేదన కలుగుతున్నది. సంచార జాతులను అక్కున చేర్చుకొని మానవీయ ఆదెరువు ఇస్తున్నది దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమే అనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
బలమైన బీసీ కులాలకు పలు పథకాలతో, రాయితీలతో తెలంగాణ సర్కారు ఊతమిచ్చినట్టే బీసీ రుణాల పేరిట ఇటీవల కొన్ని చిన్నచిన్న కులాలను కూడా ఆదరించి లక్ష రూపాయల చొప్పున రుణాలందించటం ఆహ్వానించదగిన పరిణామం. రాష్ట్ర రాజధానిలో, వివిధ జిల్లాల్లో ఆయా కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలు, ఇతరత్రా అంశాలలో గతంతో పోల్చితే తెలంగాణలో సకల కులాలకు న్యాయం దక్కుతున్నదని చెప్పాలి. అయితే గుర్తింపు కోసం పరితపిస్తూ నాగరిక సమాజానికి దగ్గరవుదామని సంచారజాతుల కులాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. రాజకీయ ప్రాతినిధ్యం, ప్రాబల్యం లేని కారణంగా ఈ జాతులు చట్టసభల వరకు వెళ్లటం లేదనే వాదన కూడా ఉన్నది. ఈ అంశాలను పక్కనపెడితే తెలంగాణలో ఇప్పుడిప్పుడే తిరిగి తమ పునర్వైభవ దీప్తిని సంచారజాతులు పొందేందుకు దారులు సుగమం అవుతున్నాయి.
కళలు, ఆచారాలు, కులవృత్తుల ప్రదర్శనలతో సమాజంలో భాగమైన సంచార జాతులు ఇవ్వాళ అస్తిత్వాన్నే కోల్పోతున్నాయి. నిజానికి సంచారజాతులు సమాజాన్ని ఉద్ధరించే కులాలుగా, సమాజాన్ని మేల్కొల్పే జాతులుగా సమాజం గౌరవించింది. ఊరిని నిద్రలేపే బాలసంతుల జనాభా ప్రభుత్వ లెక్కల ప్రకారం 3 వేలు. ప్రస్తుతం వీరివృత్తి అంతరించిపోయింది. వెయ్యిన్నరలోపు జనాభా ఉన్న బుడబుక్కల కుల కళ మాయమైపోయింది. ఆధ్యాత్మిక ప్రవచనాలతో గ్రామీణులను ఆకట్టుకునే ఫకీర్లు, హరిదాసులు కనుమరుగయ్యారు.
ఇక జనం మేల్కొని ఊరంతా ముస్తాబవుతున్న సమయంలోనే పూసవెర్ల వారు పూసల కులం ఆడవారికి బొట్టు, కాటుక, అద్దాలు, దువ్వెనలతో కూడిన అలంకృత వస్తువులు తీసుకొస్తారు. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం.. పూసలోల్ల జనాభా 40 వేలు. ఆ తర్వాత మందులవారు ఎచ్చాలతో (ఆయుర్వేద) గ్రామాల్లోకి వచ్చి సేవలందించేవారు. పండుగ, పబ్బాల సమయాల్లోనే కాకుండా ఇతర సమయాల్లో గంగిరెద్దుల వారు ఉదయాన్నే వచ్చి విన్యాసాలు చేసి దీవెనలిచ్చి వెళ్తుంటారు. ఇలా ఉదయం పూట దినచర్యలో సగభాగం సంచారజాతుల కులాల పాత్ర. ఊరుమ్మడి సంస్కృతిలో మమేకమయ్యేవి సంచారజాతులు. ఇప్పటికీ సమాజంలో అక్కడక్కడా పల్లెల్లో సంచార సౌందర్యం దర్శనం ఇస్తున్నది. గంగిరెద్దుల వారి జనాభా కూడా సర్కారు లెక్కల ప్రకారం 5 వేలు మాత్రమే. పగటి బాగోతాలు వేసేవారి కోసం గ్రామాలు వేచి ఉంటాయి. సాధనాసూరుల విన్యాసాలు కూడా పగలే ఉంటాయి. రకరకాల పురాణ కథలతో చిందు యక్షగానంతో ఊరు రాత్రి నిద్ర పుచ్చుకుంటుంది. ఇలా సమాజంలో సంచారజాతుల పాత్ర సమాజంతో సహజీవనం చేస్తున్నది. కులాల ఔన్నత్యాన్ని చాటుకుంటూ కులాలవారీగా పురాణ కథలు చెప్పే ఆశ్రిత కులాలూ సంచారజాతుల్లో భాగం. ఆడవాళ్లు భిక్షాటన చేస్తూ కుటుంబాలను సాకుతుండగా, మగవారు వేటకు వెళ్లి అటవీ మాంసంపైనే ఆధారపడి జీవించేవారు. దాసరి వృత్తి కూడా భిక్షాటనే. వీధి ప్రదర్శన, దువ్వెనల తయారుచేస్తున్న దొమ్మరలు, శివాలయాల్లో పూజలు చేస్తూ సంప్రదాయక భిక్షాటన చేసే జంగం వృత్తి కూడా అంతరించిపోయింది.
మూలిక వైద్యం నిర్వహించే జోగి, కనికట్టు విద్య, శ్మశానాల్లో కాపలా ఉండే కాటికాపరులు, శరీరం కోసుకుని రక్తం చిందిస్తూ భిక్షాటన చేసే మొండి కులానికి చెందినవారు సైతం చిరు ఫ్యాన్సీ వ్యాపారాల వైపు మొగ్గుచూపారు. యాదవుల కథలు, రెడ్లు, ఇతరకులాల చరిత్ర చెప్తూ గోత్రాలు చెప్పే పిచ్చికుంట్ల వారు వృత్తిని ఏనాడో మరిచారు. పాములు, ముంగీసలు, కోతులను ఆడించే పాములవారు కనుమరగయ్యే పరిస్థితి. పంబాలోళ్లు పత్తా లేకుండాపోయారు. మహిళా దేవుడి ప్రతిమ నెత్తిపై ఎత్తుకుని ఊరేగే పెద్దమ్మ దేవరవాళ్లు, ఎల్లమ్మలు, ముత్యాలవాండ్లు ఆ వృత్తికే దూరమయ్యారు.
వైశ్యుల ఆశ్రిత కులమైన వీరభద్రీయ వీరముష్టిలు ఇప్పుడు మచ్చుకైనా ఆ వృత్తిలో లేరనే చెప్పాలి. భిక్షాటనే ప్రధాన వృత్తి మొండిపట్ట, పరిముగ్గుల, కంజరభట్ట, కైకాడి, కాశీకాపుడి ఆ వృత్తికి దూరమై అంగట్లో అమ్మకాలు చేస్తున్నారు. వేర్లు, కాయలు, వనమూలికలతో ఉండే మందులోళ్లు, జ్యోతిష్యమే వృత్తిగా ఉన్న జోషినందివాల, నైజాం సర్కారుకు ఆయుధాలు తయారుచేసిన సిక్లిగర్లు ఇలా అనేక సంచారజాతులు కనుమరుగయ్యాయి.అయితే, తెలంగాణ పల్లెల్లో ఈ కళలను, వృత్తులను బతికించుకోవాల్సిన అవసరాన్ని తెలంగాణ ఉద్యమం స్పష్టం చేసింది. ఉద్యమ సమయంలో ఆయా వృత్తులతో సంఘాలు పెట్టి సమైక్య సర్కారు సంగతి చూసిన ఈ వృత్తుల వారి పట్ల ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఒకింత సానుకూల వైఖరితోనే ఉన్నదని చెప్పాలి.
పేరుకే సంచార జాతులు కానీ, సంచారం చేయవద్దని కులాలకు ఆత్మగౌరవ భవనాలు, పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్ల్లు పంచుతుండటం సంచార జాతులకు కేసీఆర్ రూపంలో దొరికిన వరం. నాగరిక ప్రపంచానికి ఇప్పుడిప్పుడే దగ్గరవుతున్న సంచారజాతుల ఉద్ధరణ తెలంగాణ ప్రభుత్వంలోనే మేలు జరుగుతున్నదని గడిచిన తొమ్మిదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం రుజువు చేసింది.
వైవిధ్యభరితమైన అడుగులు వేస్తూ అనేక రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ సంచార జాతుల సమ్మిళిత, సమగ్ర వికాసం కోసం ప్రభుత్వం కొత్తదారులు వేస్తున్నది. సంచార జీవన ప్రమాణాలపై సమగ్ర అధ్యయనం జరగాల్సిన అనివార్యతను తెలంగాణ గుర్తించినంతగా దేశంలో మరే రాష్ట్రం గుర్తించలేదు. దేశంలోనే ప్రభుత్వ పథకాల ప్రయోగశాలగా పేరున్న తెలంగాణ ప్రభుత్వం సంచారజాతులను మరింత ఆదరించి అక్కున చేర్చుకోవాలి. సంచార జీవనమే సమాజహితంగా బతికిన కులాలకు తెలంగాణ భరోసా కల్పించే బాటలు వేస్తుందని ఆశిద్దాం.తెలంగాణ ప్రభుత్వం అన్ని కులాలకు పెద్ద పీట వేసినట్టే సంచారజా తుల వారి ఆశలకు అనుగుణంగా వివిధ కార్పొరేషన్లలో గానీ, బీసీ కమిషన్లో కానీ అవకాశం కల్పించాలని కోరుతున్నారు.
(వ్యాసకర్త : ఎంబీసీ,డీఎన్టీ జాతీయ కన్వీనర్)
-వెంకట్ గుంటిపల్లి
94949 41001