అయిజ, ఆగస్టు 9 : ఈ నెల 3వతేదీన రాజమండ్రిలో సినిమా థియేటర్ నుంచి తోటి విద్యార్థితో కలిసి మెడికో ప్రియాంక (28) వస్తుండగా మద్యం మత్తులో ఉన్న దు శ్యంత్, ఆండ్రూ విలియం జోసెఫ్లు కారును వేగంగా నడుపుతూ వచ్చి బైక్ను ఢీకొట్టిన ప్రమాదంలో ఆమె తలకు బలమైన గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో తల్లిదండ్రులు సికింద్రాబాద్లోని కిమ్స్కు తరలించి చికిత్స అందించారు. 6 రోజులపాటు మృత్యువుతో పోరాడిన ప్రియాంక ఆదివారం మధ్యాహ్నం 3:22 గంటలకు తుదిశ్వాస విడిచారు.
అయిజ మండలం, ఎక్లాస్పురం గ్రామానికి చెందిన చంద్రకళ, వెంకటేశ్ దంపతుల మొదటి కుమార్తె ప్రియాంక, కర్నూల్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి, పీజీ డెర్మటాలాజీ చేసేందుకు రాజమహేంద్రవరంలోని జీఎస్ఎల్ వైద్య కళాశాలలో చేరింది. ప్రస్తుతం ఆమె ఫస్టియర్ చదువుతోంది. తమ కూతురును మద్యం మత్తులో కారుతో ఢీకొట్టి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఏపీ ప్రభుత్వాన్ని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదం జరిగి 6 రోజులు కావస్తున్నా నామ మాత్రపు కేసు చేసి జైలుకు పంపడంపై మెడికో కుటుంబ సభ్యులు ఏపీ ప్రభుత్వంపై ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై హత్య కేసు నమోదు చేయాలని ఆదివారం రాజమండ్రికి వెళ్లి పోలీసులను కోరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
మెడికో విద్యార్థిని ప్రమాదంలో మృత్యువుతో పోరాడుతుండగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్, హోం మంత్రి అనితలు స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. కనీసం చికిత్స జరుగుతున్న తీరును అడిగి తెలుసుకోక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఏపీ సర్కారు నిందితులపై హత్య కేసు నమోదు చేసి ఉరిశిక్ష వేయించాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రియాంక మృతితో తల్లిదండ్రులు వెంకటేశ్, చంద్రకళల రోదనలు మిన్నంటాయి. మెడికో ప్రియాంక మృతితో మండలంలోని ఎక్లాస్పురం గ్రామస్తులు శోక సంద్రంలో మునిగారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తులు మృతురాలి ఇంటి వద్దకు చేరుకొని కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
మెడికో విద్యార్థి అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం జరుగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం ఉదయం శవ పంచనామా అనంతరం మెడికో భౌతికకాయాన్ని స్వగ్రామం తరలిస్తామని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.