బోధన్, ఆగస్టు 9: ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో రేవంత్ ప్రభుత్వం ఎనలేని హడావుడి చేస్తున్నది. వరి కాకుండా ప్రత్యామ్నయ పంటల వైపు మళ్లాలని రైతులకు సూచిస్తున్నది. ఆరుతడి పంటలు వేయాలని ప్రచారం చేస్తున్నది. అయితే, అతి తక్కువగా నీటితో పండే చెరుకు అంశాన్ని మాత్రం కావాలనే విస్మరిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం.. మూతబడిన షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తే, ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రైతులకెంతో మేలు జరిగేది. తక్కువ నీటితో సాగయ్యే చెరుగు వైపు వెళ్లేందుకు అన్నదాతలు మొగ్గు చూపే వారు. కానీ, అధికారంలోకి వచ్చి మూడేండ్లు సమీపిస్తున్నా, కాంగ్రెస్ సర్కారు.. షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణ దిశగా ఒక్క అడుగు కూడా వేయలేదు.
ప్రత్యామ్నయం చెరుకే.. మూతబడిన బోధన్లోని నిజాం షుగర్స్, నిజామాబాద్ సమీపంలోని నిజామాబాద్ కో-ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించి ఉంటే ఇవాళ పరిస్థితి వేరుగా ఉండేది. ఎల్నినో ప్రభావంతో దుర్భిక్ష పరిస్థితులు ఎదురవుతున్న తరుణంలో ఈ రెండు చక్కెర ఫ్యాక్టరీలు రన్నింగ్లో ఉన్నట్లయితే.. రైతులు వరికి ప్రత్యామ్నయంగా చెరుకును పుష్కలంగా సాగు చేసే వారు. అనావృష్టి, నీటి కొరతను ఎదుర్కొనే సత్తా చెరుకు పంటకు ఉంటుంది. కుంభవృష్టిలో సైతం దీనికి ఢోకా ఉండదు. అనావృష్టి లేదా అతివృష్టి సంభవించినప్పటకీ.. ప్రభుత్వం చెబుతున్న ఆరుతడి పంటల కంటే చెరుకు ఎంతో సురక్షితంగా ఉంటుంది. అటువంటి చెరుకు పంటకు ప్రస్తుత పాలకులు రైతులను దూరం చేశారు.
సారంగాపూర్లోని నిజామాబాద్ సహకార చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం రైతులు పోరుబాట పడుతున్నారు. ఎన్సీఎస్ఎఫ్ చెరుకు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా చెరుకు రైతుల సమావేశాలు జరుగుతున్నాయి. ‘మేము చెరుకు పెట్టడానికి సిద్ధం.. ఫ్యాక్టరీని నడపండి’ అని వారు డిమాండ్ చేస్తున్నారు. 16 ఏళ్ల కిందట ఎన్సీసీఎఫ్ను మూసివేశారు. ఫ్యాక్టరీ నష్టాలు, అప్పులను సాకుగా చూపించి రైతుల షేర్లకు ‘జీరో వ్యాల్యూ’ ఆపాదించారు. ఎన్నికలకు ముందు అన్ని చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తామన్న కాంగ్రెస్ హామీ మేరకు ఫ్యాక్టరీని తెరవాలని రైతులు కోరుతున్నారు. ఈ ఫ్యాక్టరీని తెరవటంలో ఇబ్బందులు ఉంటే.. బెల్లం యూనిట్ మార్చి తెరిచినట్లయితే ఎంతో లాభం జరుగుతుందని చెబుతున్నారు. ఇప్పటికే ఈ ఫ్యాక్టరీని తెరిచి ఉంటే.. ఎల్నినో పరిస్థితుల్లో ఆరు తడి పంటలు పండించాలంటున్న రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు చెరుకును పంటను రైతులు పుష్కలంగా పండించేవారు.
చెరుకు పంట కాలం ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆరుతడి పంటల మాదిరిగానే తక్కువ నీటితో పండుతుంది. వరి పంటతో పోల్చితే చాలా తక్కువ నీటితో ఈ పంటను సాగుచేయవచ్చు. 9 నెలల నుంచి ఏడాది కాలవ్యవధి కలిగిన చెరుకు పంటకు 15 రోజులకు ఒకసారి తడి ఇస్తే సరిపోతుంది. చీడ పీడలకు తట్టకునే శక్తి ఈ పంటకు ఉంది. వర్షాలు, తడి నెల రోజులు లేకపోయినప్పటికీ.. చెరుకు బరువు కొద్దిగా తగ్గవచ్చునేమోగాని.. రైతుకు పెద్దగా నష్టం రాదు. ప్రకృతి వైపరీత్యాలను.. ఎండలకు, వరదలకు తట్టుకుని పెరుగుతుంది. హార్వేస్టింగ్, కూలీల సమస్యలు తప్పితే రైతులకు లాభాలు తెచ్చే పంటగా ‘చెరుకు’కు పేరుంది. ఎల్నినో లాంటి దుర్భిక్ష పరిస్థితుల్లో సైతం ఈ పంటను సాగుచేయవచ్చు.
ఫ్యాక్టరీలను తెరిపించకుండా మొండికేసిన ప్రభుత్వం.. వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన తరుణంలో హడావుడి చేస్తున్నది. వరి వద్దు, ఆరుతడి పంటలు వేయండని ప్రచారం చేస్తున్నది. దీంతో ఏం చేయాలో, ఏం పండించాలో తెలియక జిల్లా రైతులు అయోమయానికి గురవుతున్నారు. కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చినట్లుగా ఈపాటికే షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించి ఉంటే రైతులకు ఈ గందరగోళం ఉండేది కాదు. నిజాం షుగర్స్ను తెరిపిస్తామని రేవంత్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు, ఆ తర్వాత కూడా అనేకసార్లు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన మొదట్లో కమిటీలు, అధ్యయనాలు అంటూ హడావుడి చేసిన సర్కారు.. ఇప్పుడా ఊసే ఎత్తడం లేదు. మరోపక్క నిజామాబాద్ సహకార చక్కెర ఫ్యాక్టరీని తెరిపించాలంటూ నిజామాబాద్ రూరల్, బోధన్ నియోజకవర్గాల్లోని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రూ.వంద కోట్లు ఇవ్వండి.. ఫ్యాక్టరీని బెల్లం ఉత్పత్తి కేంద్రంగానైనా మార్చుకుంటామని కోరుతున్నా, ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి చెరుకు రైతులు సిద్ధపడుతున్నారు.
నిజాం షుగర్స్ను పునరుద్ధరిస్తాం.. ముందుగా బోధన్లోని నిజాం చక్కెర కార్మాగారాన్ని తెరుస్తామని పదేపదే చెప్పిన ప్రభుత్వ పెద్దలు చెప్పిన మాటలు కార్యరూపం దాల్చడం లేదు. చంద్రబాబు పాలనలో నిజాం షుగర్స్ జాయింట్ వెంచర్ పేరిట ప్రైవేట్ కంపెనీ పరమైంది. ప్రైవేట్ యాజమాన్యం చక్కెర ఫ్యాక్టరీని అడ్దం పెట్టుకుని రూ.కోట్ల సంపదను దోచుకుని, చివరికి ఫ్యాక్టరీని నడపలేమంటూ చేతులెత్తేసింది. ఎన్డీఎస్ఎల్కు బోధన్లోని శక్కర్నగర్, మెట్పల్లి, మెదక్ యూనిట్లకు 2015 డిసెంబర్లో లేఆఫ్ ప్రకటించింది. దీంతో కార్మికులు రోడ్డుప పడ్డారు. చెరుకు కొనే దిక్కులేకపోవటంతో రైతులు వేరే పంటల వైపు మళ్లారు. అయితే, ఫ్యాక్టరీని తెరిపించాలని కార్మికులు, కర్షకులు అప్పటి నుంచే డిమాండ్ చేస్తూ వచ్చారు.
ఈ క్రమంలోనే గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చింది. నిజాం షుగర్స్ యూనిట్ల పునరుద్ధరణపై అధ్యయనానికి 2024 జనవరిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆధ్వర్యంలో కమిటీని నియమించారు. ఈ కమిటీ లోతుగా అధ్యయనం చేయలేదు. ఫ్యాక్టరీ నడవాలంటే ముడి సరుకు ‘చెరుకు’ కావాలి. చెరుకు సాగుపై రైతులను చైతన్యవంతుల్ని చేయడానికి వ్యవసాయశాఖ ఎటువంటి కార్యాచరణ చేపట్టలేదు. రెండేళ్ల క్రితం చెరుకు సాగుపై సదస్సును ఏర్పాటుచేసినా, ప్రోత్సాహకాలపై ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు, ఫ్యాక్టరీ తెరిపిస్తే చెరుకు వేయడానికి సిద్ధమని, అయితే, చెరుకు వేసిన తర్వాత ఫ్యాక్టరీ పునరుద్ధరణ జరగకపోతే తమ పరిస్థితి ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు.