తెలంగాణ రవాణా రంగంలో వెన్నెముకగా నిలిచిన ఆర్టీసీ నేడు సంక్లిష్టమైన సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. నాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ’అభయ హస్తం’ మ్యానిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులకు స్వర్ణయుగం వస్తుందని, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని నమ్మబలికింది. ఆ హామీలు నేడు అటకెకాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గద్దెనెక్కిన తర్వాత అమలు చేసిన ’మహాలక్ష్మి’ పథకం సంస్థ మనుగడను ప్రశ్నార్థకం చేసింది. మహిళలకు ఉచితం అని చెప్తూ పురుష ప్రయాణికుల జేబులను మాత్రం భారీగా చిల్లుపెట్టింది. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించినప్పుడు ఆ భారాన్ని సర్దుబాటు చేయడం కోసం పురుషుల టికెట్ ధరలు అమాంతం పెంచడం వివక్షనే కదా. ఇక ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణ అవకాశం ఇచ్చినట్టు ఎలా అవుతుంది? ప్రజలను దోచి, ప్రజలకు పెట్టడం ఎంత వరకు సబబు? పురుష ప్రయాణికులు పేద, మధ్యతరగతి ప్రజలు కాదా?
ప్రభుత్వం బస్సు ఛార్జీలను పెంచడంతో సామాన్య, మధ్యతరగతి పురుషులపై పెను భారంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు జరిగిన కృషిని ప్రస్తుత ప్రభుత్వ విధానాలతో నెలకొన్న పరిస్థితులు నీరుగారుస్తున్నాయి. ఉచిత ప్రయాణాల వల్ల బస్సులు కిక్కిరిసిపోవడం, నిర్వహణ ఖర్చులు పెరగడం, ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి సకాలంలో రీయింబర్స్మెంట్ అందకపోవడంతో సంస్థ క్రమంగా నష్టాల ఊబిలోకి జారుకుంటున్నది. ఈ ఆర్థిక అస్థిరత నేరుగా కార్మికులపై ప్రభావం చూపుతున్నది. మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా రెండు పీఆర్సీ బకాయిల చెల్లింపు, ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన వసతుల కల్పన వంటి అంశాలు కాగితాలకే పరిమితమయ్యాయి. కార్మిక సంఘాల పునరుద్ధరణకు అనుమతి ఇస్తామని చెప్పి, ఆచరణలో వారి గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతున్నది. ఈ అరాచక పరిస్థితులకు పరాకాష్టగా, ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ ఆత్మహత్య యావత్తు కార్మిక లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
హామీల అమలులో జాప్యం, పని ఒత్తిడి, అనిశ్చిత భవిష్యత్తుపై ఆందోళనతో ఒక నిండు ప్రాణం బలవ్వడం కేవలం ఒక వ్యక్తి మరణం కాదు, అది ప్రభుత్వ వైఫల్యానికి నిలువెత్తు సాక్ష్యం. ఎన్నికల వేళ ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలతో ఆశలు కలిగించి, అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని విస్మరించడం వల్లనే ఇలాంటి విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. శంకర్గౌడ్ వంటి నిబద్ధత గల కార్మికులు ఆత్మహత్యల బాట పట్టడం ప్రజాస్వామ్య పాలనలో తీరని కళంకం. ఇప్పటికైనా ప్రభుత్వం తన మొండివైఖరిని వీడి, రాజకీయ ప్రయోజనాల కంటే కార్మికుల ప్రాణాలకు ప్రాధాన్యతనిస్తూ మ్యానిఫెస్టోలోని అంశాలను తక్షణమే అమలు చేయాలి. లేనిపక్షంలో, ఈ ప్రజా ఆగ్రహం రవాణా వ్యవస్థనే కాకుండా ప్రభుత్వ పునాదులను కూడా కదిలించే ప్రమాదం ఉన్నది.
– రఘువీర్ రాథోడ్, 9948480556