గాలి నీరు లేకున్నను గడపవచ్చు గ్రాసము లేక ఎట్టెటో గడపవచ్చు గడపవచ్చునే మనమొక్క గడియయైన గ్రంథ
భాండారములు లేని గ్రామమందు అని నాళం కృష్ణారావు గ్రంథాలయాల ప్రాముఖ్యతను తెలియజేశాడు. జీవితానికి అత్యంత ప్రాధాన్యతాంశాలయిన గాలి నీరు తిండి కన్న గ్రంథాలు అంటే పుస్తకాలు మనిషికి అత్యంత అవసరమని అంటాడాయన. నిజమే పుస్తకపఠనం మానవ మస్తిష్కాన్ని జాగృత పరుస్తుంది. జాతి వికాసానికి తోడ్పడుతుంది. మన స్వాతంత్య్ర పోరాట సమయంలోను, తెలంగాణ చరిత్ర మూలాల పరిశోధనలోనూ ప్రకటనలోనూ గ్రంథాలయాలు నిర్వహించిన పాత్ర చాలా గొప్పది.
ఇంతకు ఈ ముచ్చట ఇప్పుడెందుకంటే నేను అమెరికా పర్యటనలో డల్లాస్ నగరం ప్లేనో ప్రాంతంలో చూసిన చిన్న వాడమూల గ్రంథాలయం. Little Freelibrary. org అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుస్తకాల అర ఇది. సాధారణంగా పెద్ద పట్టణాల్లోనూ, గ్రామాల్లోనూ ప్రభుత్వ గ్రంథాలయాలు ఉండడం సహజం. మన తెలంగాణ లోను గ్రంథాలయ సంస్థ ఊరూరా గ్రంథాలయాలు నిర్వహిస్తున్నది. ఏ గ్రంథాలయానికైనా మనమే వెళ్లి చదువుకోవాలి. అవసరమైతే సభ్యత్వం తీసుకుని పుస్తకాలు ఇంటికి తెచ్చుకుని చదువుకుని మళ్ళీ ఇచ్చి వేయాల్సి ఉంటుంది. దానికి చాలా సమయం కేటాయించాల్సి వస్తుంది. అదే మనకు అందుబాటులో ఉంటే మన దృష్టి పుస్తకం వైపు మళ్ళుతుంది. చదవాలనే ఆకాంక్ష పెంపొందుతుంది. సరిగ్గా ఇదే ఆలోచనతో వెలసిన చిన్నపాటి గ్రంథాలయం వాడమూల గ్రంథాలయం. గ్రంథాలయం అనడం కన్నా ఇది ఒక పుస్తకాల అర అని చెప్పవచ్చు. Take a book share a book అని రాసిపెట్టి అదే కాన్సెప్ట్ తో పాఠకుల భాగస్వామ్యంతో కొనసాగుతుంది.
పుస్తకాలు కొని చదవడం మధ్యతరగతి వారికి ఒకింత భారమే. ఒకవేళ కొన్నా ఐదో పదో పుస్తకాలు కొనగలుగుతారు. ఆ తరవాత చదవాలనే కోరిక ఉన్న ఖరీదు పెట్టలేక దూరంగా ఉన్న గ్రంథాలయానికి పోలేక తమ పఠనాభిలాషను చంపుకోవాల్సి వస్తుంది. అలాంటి పాఠకులకు వరం ఈ చిన్ని పుస్తకాల అరలు. ఇక్కడ తమకు నచ్చిన పుస్తకం ఉంటె ఉచితంగా తీసుకోవచ్చు.బదులుగా తాము చదివిన పుస్తకాన్ని అక్కడ పెట్టవచ్చు. తప్పకుండ పెట్టాలని నియమం లేదు. ఇచ్చి పుచ్చుకోవాలనే ధోరణి ఇందులో కనిపిస్తున్నది.
సరిగ్గా ఇదే ఆలోచన రెండెండ్ల క్రితం నేను మా మిత్రులు కలిసి చేశాము. చేర్యాలలోని బస్టాండ్లో ఒక అల్మారా పెట్టి అందులో పుస్తకాలను ఏర్పాటు చేస్తే వచ్చి పోయే ప్రయాణీకులు ఖాళీ సమయం సద్వినియోగం చేసుకుంటారని ఆలోచించాము. కానీ ఆ ప్రణాళిక అమలు చేయలేకపోయాము.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ బడులలో గ్రంథాలయాల సద్వినియోగానికి చక్కటి ప్రణాళిక సిద్ధం చేసి అమలు పరుస్తున్నది. కొత్త విద్యావిధానంలో పరీక్షలలో భాషలకు సంబంధించి పుస్తక విమర్శ అనే విభాగానికి మార్కులను కూడా కేటాయించి చిన్నతనం నుంచే పుస్తక పఠనాన్ని ఒక అలవాటుగా మార్చే ప్రయత్నం చేస్తుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రాథమిక పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు నిధులను కూడా కేటాయించింది. ఇది బాలలలో పఠనాభిలాష పెంపొందిస్తుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. దాంతో బాటు నివాసగృహాలకు అందుబాటులో ఇలాంటి చిన్న చిన్న గ్రంథాలయాల ఏర్పాటుకు ప్రభుత్వమే కాకుండా స్వచ్చంద సంస్థలు ముందుకువస్తే బాగుంటుంది. పుస్తకమా జయోస్తు!!
(వ్యాసకర్త : రాష్ట్ర ప్రధాన
కార్యదర్శి, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ)
-గుళ్ళపల్లి తిరుమల కాంతి కృష్ణ
79896 63675