ఏదిపడితే అది మాట్లాడితే కాంగ్రెస్ నాయకుల ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం. రైతుల పట్ల, రైతు ప్రయోజనాల పట్ల, రైతు సమస్యల పట్ల కాంగ్రెస్ వారికున్న అవగాహన ఏపాటిదో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాటలను బట్టే అర్థమవుతున్నది. మలివిడత తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిందే కరెంటు సమస్య. తెలంగాణ రైతుల మెడపై కత్తి పెట్టి కరెంటు చార్జీలు వసూలు చేయాలని నాటి చంద్రబాబు ప్రభుత్వం జారీచేసిన హుకుంను వ్యతిరేకించింది తెలంగాణ రైతాంగం. అయినా వినని చంద్రబాబు నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించింది. ఆ సమయంలో ఉద్యమకారులపై బుల్లెట్ల వర్షం కురిపించింది నాటి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో పుట్టిందే టీఆర్ఎస్ (బీఆర్ఎస్).
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వివక్షాపూరిత విధానాలను నిరసిస్తూ అశేష తెలంగాణ ప్రజానీకపు గుండె చప్పుడైంది కేసీఆర్ వాయిస్. ఆయన అడుగుజాడల్లో యావత్తు తెలంగాణ సమాజం నడిచింది. రైతుల జీవన స్థితిగతుల్లో సమూల మార్పులకు రెండు దశాబ్దాల కిందనే ప్రణాళిక సిద్ధం చేశారు కేసీఆర్. అందుకే స్వయంపాలనలో రైతులకు 24 గంటల పాటు కరెంటు సౌకర్యం కల్పించారు. ఒకప్పుడు కాలిన మోటర్లు, ఎండిన వరి చేతబట్టి సబ్స్టేషన్ల ముట్టడులతో తెలంగాణ అట్టుడికేది. ఇప్పుడు కరెంటు సమస్య ఉన్నదా? అనే సందేహం వ్యక్తం చేసే స్థాయికి చేరుకున్నది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక, రైతులను మరింత సమస్యల వలయంలోకి నెట్టేసే కుట్రపూరిత వచనాలను రేవంత్రెడ్డి పలికారు. తెలంగాణ రైతులకు 24 గంటల కరెంటు అవసరం లేదు. కేవలం మూడు గంటలు చాలని సెలవిచ్చారు. ఎందుకంటే, ఈయన చంద్రబాబు శిష్యుడే కాబట్టి. గురువు గారి అడుగు జాడల్లో తెలంగాణను నడిపించాలని భావిస్తున్నాడు. అందుకే ఉచిత విద్యుత్తుపై తన మనసులో మాట బయట పెట్టుకున్నాడు. తెలంగాణ రైతులను మరోసారి కష్టాల సాగులోకి దింపాలనే యత్నంలో ఉన్నట్టున్నాడు.
వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్తు రంగంలో వచ్చిన సమూల మార్పులు ఒక మైలురాయిగా నిలిచాయి. ఏ దేశంలోనైనా అవసరమున్నదానికన్న అదనంగా విద్యుత్తు ఉత్పత్తయితే లేదా భవిష్యత్తు అవసరాలను తీర్చే ఉత్పాదక సామర్థ్యాన్ని నెలకొల్పితే ఆ దేశానికి లేదా రాష్ర్టానికి ముందు చూపు ఉన్నట్టు.
అమెరికా, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లండ్, జపాన్, జర్మనీ వంటి దేశాల్లో నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా ఉంటుంది. ఇతర దేశాలతో సమానంగా నిలబడింది తెలంగాణ రాష్ట్రం. అందుకు తగిన రీతిలో ప్రణాళికలు సిద్ధం చేసింది. అదే స్థాయిలో అమలు చేసింది. అందువల్లే కరెంటు పోతే తెలంగాణలో వార్త అయింది. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడక ముందు సుమారు 26 లక్షల పంపుసెట్లు ఉండేవి. ఏటా రెండు లేదా మూడు సార్లు లోవోల్టేజీ కారణంగా మోటర్లన్నీ కాలిపోయేవి. రైతులకు కరెంటు చార్జీలకు తోడు ఈ ఖర్చు బోనస్గా ఉండేది. దిగుబడి సరిగా లేక రైతులు అప్పుల పాలయ్యేవారు. రైతాంగానికి పెట్టుబడి సాయం కూడా అప్పట్లో లేదు. అందుకే వ్యవసాయం చేస్తున్నాడంటే ఆ రైతు ఆత్మహత్య చేసుకునే లేదా ముందుతరానికి అప్పును వారసత్వంగా ఇచ్చే వ్యక్తిగా భావించేవారు. కానీ ఇప్పుడు ఆ జీవనచిత్రం పూర్తిగా మారిపోయింది. సరి కొత్త నమునాతో ఇక్కడ సాగు ముందుకు సాగుతున్నది.
కనీవినీ ఎరుగని రీతిలో వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది తెలంగాణ ప్రభు త్వం. అందులో విద్యుత్తు రంగంలో తీసుకొచ్చిన మార్పులు ప్రత్యేకం. పగటి పూటే సరిపడా కరెంటు ఇచ్చేలా ఏర్పాట్లు జరిగాయి. ఒకప్పుడు ఎండకాలంలో పంటలు ఎండిపోయేవి. దానికి తోడు విద్యుత్తు ప్రమాదాలకు గురై రైతులు మరణించేవారు. ఇలాంటి ఘటనలు నిత్యం నాటి పత్రికల్లో ప్రధాన వార్తలయ్యేవి. ఇప్పుడలాంటి దారుణాలు శూన్యం. ఒకప్పుడు ధాన్యం లేక బోసిపోయిన కల్లాలు నేడు ధాన్యపు రాసులతో కళకళలాడుతున్నాయి. ఇదంతా ఎట్లా సాధ్యమైందంటే కేవలం కేసీఆర్ నేతృత్వం వహించే బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే.
నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్తు అని చెప్పింది. కానీ చేతల్లో అదెంత నాణ్యమైందో నాటి రైతులకు తెలుసు. ఇప్పుడు కండ్లముందున్న మార్పేమిటో కూడా వాళ్లకు తెలుసు. ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఏదో మసిపూసి మారేడుకాయ చేసేలా మాట్లాడితే రైతులు నమ్ముతారనుకుంటే అది భ్రమ. తెలంగాణ ప్రజలు నిత్య చైతన్యశీలురు. మంచి, చెడులను సులభంగా గుర్తిస్తారు. ఉచిత కరెంటును పీకేస్తామని చెప్తే కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు పీకేస్తారు.
అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ మైలేజీ కోసం రైతుల జీవితాలతో మాత్రం ఆడుకోవద్దు. ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతులు కోలుకుంటున్నారు. గత పాలకుల గాయాల నుంచి తేరుకుంటున్నారు. యావత్తు దేశానికే అన్నం పెట్టే స్థాయికి చేరుకుంటున్నారు. కాబట్టి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం కష్టనష్టాలకోర్చి రైతులకిస్తున్న ఉచిత విద్యుత్తుపై కుట్రలు చేయవద్దని హెచ్చరిస్తున్నాం. ఎవరెన్ని చెప్పినా కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం ముమ్మాటికీ రైతుల పక్షాన నిలబడుతుంది. ప్రభుత్వం ఎన్ని కష్టాలు, విమర్శలు ఎదుర్కొన్నా రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తును మునుపటి లాగే ఇస్తూనే ఉంటుంది. రైతు జీవితాల్లోనే కాదు యావత్తు తెలంగాణ సమాజానికి వెలుగులు విరజిమ్మేలా, కుట్ర దారుల కండ్లు బైర్లు కమ్మేలా నాణ్యమైన ఉచిత విద్యుత్తును ఎప్పటిలాగే అందిస్తుంది. బీఆర్ఎస్ అంటేనే రైతు ప్రభుత్వం. ఇది తెలంగాణ జనజీవితాల్లో ఉన్న జీవిత వాస్తవిక చిత్రం. దీన్ని ఎవ్వరూ చెరిపేయలేరు. అలా చేయడం వారి తరం కాదు. ఇది తెలంగాణ ప్రజలు ఏరి కోరి మళ్లీ మళ్లీ తెచ్చుకుంటున్న ప్రజాప్రభుత్వం. ఇది కేసీఆర్ నడిపిస్తున్న మార్గదర్శక, దూరదృష్టి గల ప్రభుత్వం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది రైతుల ప్రభుత్వం.
(వ్యాసకర్త: ఆందోల్ ఎమ్మెల్యే)
-చంటి క్రాంతికిరణ్