కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్రెడ్డి బీసీలపై చేస్తున్న వ్యాఖ్యలు తరచూ వివాదాస్పదమవుతున్నాయి. అయినా ఆయన పద్ధతి మార్చుకోవడం లేదు. యాదవులను కించపరిచేలా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆ వర్గీయుల్లో ఇటీవల తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఆ వివాదం చల్లారకముందే, పిచ్చుకుంట్ల కులస్థులను హేళన చేస్తూ జడ్చర్ల సమావేశంలో రేవంత్రెడ్డి మాట్లాడారు. దీంతో బలహీన, శ్రామిక వర్గాల పట్ల ఆయనకున్న చిన్నచూపు మరోసారి బహిర్గతమైంది.
రాజకీయ నాయకులు ఇటువంటి అవమానకర వ్యాఖ్యలు చేయడం ఇది తొలిసారి కాదు. వారు తమ మాటలతో బలహీనవర్గాలను అవమానించినప్పుడు ఆయా వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతాయి. దీంతో ఆ నాయకుడు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటాడు. క్షమాపణ కూడా చెప్తాడు. దీంతో బాధిత వర్గాలు కూడా ఆ విషయాన్ని అంతటితో వదిలేస్తాయి. ఆరోగ్యకరమైన రాజకీయాలు ఈ విధంగా ఉంటాయి. కానీ ఇప్పుడు అటువంటిదేమీ జరగలేదు.
యాదవులు తమ స్వాభిమానాన్ని చాటుకునే క్రమంలో రేవంత్ వ్యాఖ్యలపై వివిధ రూపాలలో నిరసన తెలిపారు. బలహీనవర్గాల వృత్తులను అవమానించడం తప్పని రేవంత్కు అర్థం చేయించడానికి ప్రయత్నించారు. కానీ రేవంత్ ఏ మాత్రం తగ్గలేదు. ఈ బీసీలను తాను లక్ష్యపెట్టడమేమిటి అనే తిరస్కార ధోరణిని ప్రదర్శించారు. యాదవులు హైదరాబాద్ లో నిరసన తెలుపుతున్న రోజే, మహబూబ్నగర్లో ‘పిచ్చుకుంట్ల కులా’న్ని తిట్టుగా వాడుతూ ఘోరంగా అవమానించారు.
రాష్ట్రస్థాయి నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు, దానిపై దుమారం చెలరేగినప్పుడు ఆయా పార్టీల అధిష్ఠానం జోక్యం చేసుకుంటుంది. ఆ నాయకుడి చేత క్షమాపణ చెప్పిస్తుంది. కాంగ్రెస్పార్టీలో ఇటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. కానీ రేవంత్ విషయంలో అది జరుగలేదు. దీన్నొక అల్పమైన విషయంగా చూస్తున్నది. బలహీనవర్గాలను అవమానించినా, తమను వారేం చేయలేరనే నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ స్వభావమే అంత.
జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ రెండూ బీసీలకు వ్యతిరేకమే. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం చెలాయించినప్పుడు, బీసీలను అణచివేయడమనే పాలసీని అమలు చేసింది. 1977లో జనతా ప్రభుత్వం ఏర్పడినప్పుడు వెనుకబడిన తరగతుల ఒత్తిడి మూలంగా మం డల్ కమిషన్ను ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కమిషన్ నివేదికను తొక్కిపెట్టింది. మళ్లీ వీపీ సింగ్ నాయకత్వంలో జనతాదళ్ ప్రభుత్వం ఏర్పడి న తర్వాత మండల్ కమిషన్ నివేదికను ఆమోదించింది. ఈ నివేదిక ఆమోదానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేయించడంలో కాంగ్రెస్ ప్రధాన పాత్ర వహించింది. ఉత్తర భారత దేశంలో బీసీలు రాజకీయంగా బలపడి ఆయా రాష్ర్టాల్లో అధికారానికి వచ్చినప్పుడు కేంద్రంలోని కాంగ్రెస్ సర్కారు అప్రజాస్వామికంగా ఆ ప్రభుత్వాలను కూలదోసింది.
బీసీలు ఉత్తరాదిన అధికారం చేజిక్కించుకోవడాన్ని చూసి బీజేపీ, మొదట కల్యాణ్ సింగ్, ఉమాభారతి వంటి నాయకులను ముం దుపెట్టి అధికారానికి వచ్చింది. కానీ మరో వైపు మండల్ శక్తులకు వ్యతిరేకంగా అయోధ్య ఉద్యమాన్ని నడిపించింది. రాజకీయంగా బీసీలను అణచివేయడమే తమ లక్ష్యమని బీజేపీ, కాం గ్రెస్ పార్టీలు భావిస్తున్నాయి. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బలహీనవర్గాలపై దాడులు పెరిగిపోయాయి. వారికి బడ్జెట్లో నిధుల కేటాయింపు తగ్గిపోయింది.
జాతీయ పార్టీలు బీసీలను అణచివేయడం చరిత్ర పొడవునా గమనించవచ్చు. అందుకే బీసీలు ప్రాంతీయ పార్టీలను ఆశ్రయించవలసి వచ్చింది. మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నారు. కులవృత్తుల వారిని ఆదుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వానికి సాటి లేదు. బలహీనవర్గాలకు బడ్జెట్లో నిధుల కేటాయింపు భారీగా పెరిగింది. రాజకీయ పదవులు ఇవ్వడంలోనూ బీసీలకు ప్రాధాన్యం ఇచ్చింది బీఆర్ఎస్. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో బీసీల బతుకులు ఎంతో మెరుగయ్యాయి.
బీఆర్ఎస్ నాయకత్వంలో బలహీనవర్గాలు ఏకమవుతున్న నేపథ్యంలోనే జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ కుట్రలు పన్నుతున్నాయి. రాజకీయంగా ఈ రెండూ అధికారం కోసం పోటీ పడినా, బీసీలను అణచివేయడంలో లోపాయికారిగా కలసి పనిచేస్తున్నాయి. అందువల్లనే తెలంగాణలో బలహీనవర్గాల అభ్యున్నతికి, సాధికారతకు పాటుపడిన టీఆర్ఎస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా బడుగుల ఉద్ధరణ కోసం బీఆర్ఎస్గా రూపాంతరం చెందింది. అన్ని కులాల బీసీలు కేసీఆర్ అభివృద్ధి విధానాలను ఉపయోగించుకొని వృద్ధిలోకి రావాలి. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ బలోపేతానికి మన వంతు కృషి చేయాలి.
గోసుల శ్రీనివాస్ యాదవ్
98498 16817