HomeOpinionsRevanth Reddy Signs Business Deals With Adani To Invest In Telangana
గల్లీలో దోస్తీ.. ఢిల్లీలో కుస్తీ
తెలంగాణ ఎన్నికల ప్రచార సమయంలో, అంతకుముందు నుంచి అదానీని తీవ్రంగా విమర్శించిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు దావోస్లో అదే అదానీతో ఎలా వ్యాపార ఒప్పందాలు చేసుకుంటున్నారు
దేశంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా అధికార బీజేపీని ఇరుకున పెట్టేందుకు బడా పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని బూచిగా వాడుకుంటున్నది. అదానీ అక్రమ కార్యకలాపాలకు మూలకారణం ఆయన ప్రియ మిత్రుడు ప్రధాని నరేంద్ర మోదీ అండదండలే కారణమని గత కొన్నేండ్లుగా కాంగ్రెస్ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. కానీ, ఇప్పుడు స్వంత పార్టీకే చెందిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అదానీతో దోస్తీకి దిగటం కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఇరుకున పడేసింది.
తెలంగాణ ఎన్నికల ప్రచార సమయంలో, అంతకుముందు నుంచి అదానీని తీవ్రంగా విమర్శించిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు దావోస్లో అదే అదానీతో ఎలా వ్యాపార ఒప్పందాలు చేసుకుంటున్నారు? ఇది అవకాశవాద, దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం కాదా? ప్రధాని సహకారంతోనే అదానీ అక్రమంగా సంపాదిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీలో విమర్శిస్తూ.. ఇక్కడ మాత్రం అదానీతో వ్యాపార ఒప్పందాలు ఎలా కుదుర్చుకుంటున్నారో స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవే అంశాలను ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా లేవనెత్తారు. బీజేపీ ఆదేశాల మేరకే ఆదానీతో రేవంత్రెడ్డి కలిసి పనిచేస్తున్నారని కేటీఆర్ ఆరోపించిన విషయం తెలిసిందే. అదానీ పట్ల కాంగ్రెస్ వైఖరిలో మార్పు రావటానికి కారణాలు ఏమిటో తెలంగాణ ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్ఎస్ను ఓడించాలని బండి సంజయ్ పిలుపునివ్వడాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఒకవైపు మోదీ సహకారంతో విస్తరిస్తున్న అదానీ వ్యాపార సామ్రాజ్యం వల్లనే దేశమంతా నష్టపోతున్నదని కాంగ్రెస్ నేతలు గగ్గోలు పెడుతుంటే.. మరోవైపు అందుకు భిన్నంగా రేవంత్రెడ్డి తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అదానీకి ఎర్ర తివాచి పరచడం ఆ పార్టీ నేతలకు మింగుడుపడటం లేదు. గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టుగా మారింది వారి పరిస్థితి.
దావోస్లో జరిగిన ‘ప్రపంచ ఆర్థిక వేదిక’ సదస్సు సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు గౌతమ్ అదానీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నది. అంతకుముందు రేవంత్రెడ్డి ఆహ్వానం మేరకు అదానీ కుమారుడు కరణ్ అదానీ హైదరాబాద్లో పర్యటించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై రేవంత్రెడ్డితో చర్చించారు.
తాజాగా జరుగుతున్న పరిణామాలతో కాంగ్రెస్ పెద్దలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా ఇది సమర్థనీయమే. కానీ, ఆ భేటీ అనంతరం అదానీని పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించడంతో కాంగ్రెస్ పెద్దలు ఆత్మరక్షణలో పడిపోయారు. ముఖ్యంగా కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్, ఆ పార్టీ సీనియర్ నాయకుడు చిదంబరం ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేయగా.. విలేకరులు ఈ అంశాన్ని లేవనెత్తారు. ‘తన ప్రియ మిత్రుడు అదానీకి ప్రధాని మోదీ దేశ సంపదను దోచిపెడుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒకవైపు ఆరోపిస్తుంటారు.. మరి రేవంత్రెడ్డి దావోస్లో అదానీతో ఒప్పందం కుదుర్చుకోవడం ఏమిటి?’ అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించడంతో ఆయన తెల్లబోయారు.
దీనికి ఆయన సమాధానం చెప్పకపోగా, ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా మైకును పక్కనే ఉన్న పార్టీ నాయకురాలు సుప్రియా శ్రీనాథే వైపు తోసేయడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆమె కూడా సూటిగా సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారు. మ్యానిఫెస్టో కమిటీకి సంబంధించిన ప్రశ్నలు అడగాలంటూ దాటవేయటం ఆ పార్టీ అగమ్యగోచర పరిస్థితికి అద్దం పట్టింది. ఇప్పుడీ అంశం కాంగ్రెస్ వర్గాల్లోనే కాకుండా, సోషల్ మీడియాలోనూ హాట్టాపిక్గా మారిపోయింది. రేవంత్రెడ్డి వైఖరి కాంగ్రెస్ అగ్రనేతలను తీవ్ర ఇరకాటంలో పడేసిందనటానికి ప్రెస్మీట్లో సీనియర్ నేత చిదంబరం కనబరిచిన అసహనమే నిదర్శనమని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
ప్రజలను ఆశల పల్లకిలో ఊరేగించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు కాలపరిమితిని కూడా స్వయంగా వారంతటవారే విధించుకున్నారు. ఇప్పుడు కాలపరిమితి సమీపిస్తున్న కొద్దీ వాటిని నెరవేర్చే మార్గం తోచక తల పట్టుకుంటున్నారు. ఈ గందరగోళంలో అధిష్ఠానానిదో దారి, ముఖ్యమంత్రిదో దారి అయ్యింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ ద్వంద్వ వైఖరితో మూల్యం చెల్లించుకోక తప్పదు.