ధ్యానం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందనే విషయం చాలాకాలంగా తెలుసు. కానీ కేవలం ఏడు రోజులపాటు తీవ్రమైన ధ్యానం, మనసు-శరీర సాధనలు చేస్తే మెదడు, రక్తంలోని జీవక్రియలు, రోగనిరోధక వ్యవస్థలో కూడా చెప్పుకోదగ్గ మార్పులు కనిపిస్తాయా?… అనే ప్రశ్నకు సమాధానం వెతికిన పరిశోధన ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ఈ అధ్యయనాన్ని అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, శాన్డియాగోకు చెందిన పరిశోధకులు నిర్వహించారు.
ఇందులో భాగంగా కొంతమంది ఆరోగ్యవంతులైన పెద్దలు ఏడు రోజుల పాటు ఒకే చోట ఉండి, మొత్తం సుమారు 33 గంటల మార్గదర్శక ధ్యానం (గైడెడ్ మెడిటేషన్)తో పాటు ఇతర మనసు-శరీర సంబంధ సాధనలు చేశారు. పరిశోధకులు కార్యక్రమానికి ముందు, తర్వాత వారి మెదడును ఫంక్షనల్ మ్యాగ్నటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ లాంటి ప్రత్యేకమైన విధానాల్లో పరిశీలించారు. రక్త నమూనాలనూ పరీక్షించారు. వీటి ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
ధ్యానం తర్వాత మెదడులోని కొన్ని భాగాల్లో అంతర్గత ఆలోచనల గందరగోళానికి సంబంధించిన కార్యకలాపాలు తగ్గినట్లు కనిపించింది. అంతేకాదు, మెదడులో సానుకూల మార్పులు ఏర్పడ్డాయట. కొత్త అనుసంధానాలను ఏర్పరుచుకునే సామర్థ్యం తాలూకు సంకేతాలూ గుర్తించారు. పాల్గొన్నవారి రక్తంలో శరీరం సహజంగా ఉత్పత్తి చేసే నొప్పి నియంత్రణ వ్యవస్థ కూడా బలపడింది. రోగనిరోధక వ్యవస్థకు సంబంధించి, కణాల శక్తి వినియోగంలోనూ మంచి మార్పులు కనిపించాయి.
అయితే దీని ద్వారా, ఏడు రోజుల్లో మెదడులో అనేక మార్పులు జరుగుతాయని అర్థం చేసుకోవడం సరికాదు. ఇది కొద్దిమందితో జరిగిన పరిశీలన. అంతేకాదు, ధ్యానంతో పాటు ఇతర హీలింగ్, ఓపెన్ లేబుల్ ప్లాసిబోలాంటి రకరకాల సాధనలు కూడా కార్యక్రమంలో ఉండటంతో మార్పులకు ధ్యానం ఒకటే కారణమని చెప్పలేం. కాకపోతే మనసును స్థిమితపరిచే సాధనకు శరీరంలోనూ ప్రతిధ్వని ఉండవచ్చని ఈ పరిశోధన సూచిస్తున్నది.