‘నేను నా చుట్టూ ఉన్న వారినే కాదు.. ఎప్పుడూ ఎరగని వాళ్లను కూడా సంతోషంగా ఉంచదలుచుకున్నాను’ అని హిట్లర్ నరహంతక సేన బాధితురాలైన చిన్నారి అన్నేఫ్రాంక్ ‘ది డైరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్’లో రాసుకున్నది. నాజీ సేన నెదర్లాండ్స్ను హస్తగతం చేసుకున్న తర్వాత యూదుల ఆస్తుల విధ్వంసం, మనుషుల ఊచకోత నుంచి తప్పించుకొనేందుకు రహస్య స్థావరంలోని చీకటి అరలో 761 రోజులు దాక్కున్నది 15 ఏండ్లు కూడా నిండని అన్నేఫ్రాంక్. ఆ భీతావహ కాలంలో తన అనుభవాలు, ఆలోచనలు, భయాలు, హిట్లర్ దారుణాలను డైరీలో నిత్యం నమోదు చేసింది.
రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం 1946 తర్వాత మార్కెట్లోకి విడుదలైన ఆ చిన్నారి డైరీని ప్రపంచ వ్యాప్తంగా చాలామంది తమ భాషల్లోకి అనువదించారు. ఆ పుస్తకాలు విస్తృతంగా అమ్ముడుపోయాయి. ఆ చిన్నారి మాటలు ప్రపంచంలోని కోట్లాది మందిని కదిలించి, కంటతడి పెట్టించాయి. 60 లక్షల మందిని గ్యాస్ చాంబర్లలో వేసి చంపి, కోట్లాది కుటుంబాల కడుపుకోతకు కారణమైన హిట్లర్ పాశవికతను పసి హృదయం అనుభవంలో నుంచి చదివిన ప్రజానీకం మనసులు తల్లడిల్లిపోయాయి.
రెండవ ప్రపంచ యుద్ధానంతరకాలం తర్వాత హిట్లర్ లాంటి అమానవీయ పాలకుడు భూమిపై ఏ మూలలోనూ, మానవాళికి ఎదురవ్వకూడదని యావత్తు ప్రజలు నేటికీ కోరుకుంటూనే ఉన్నారు. అయితే నాజీలకు పట్టుబడిన తర్వాత కాన్సన్ట్రేషన్ క్యాంపులో తీవ్రమైన ఆకలి, చలికి వణుకుతూ 1945 ఫిబ్రవరిలో తుదిశ్వాస విడిచిన అన్నేఫ్రాంక్ చివరి రోజుల్లో ‘నేనింకా.. మనిషిని మంచివాడనే నమ్ముతున్నాను’ అని రాసుకున్నది. బహుశా నెత్తుటి నదులను తాగిన, మానవ కళేబరాలను ధరించిన నియంతలను ప్రేమించే పశుత్వం తన తర్వాతి తరం ఎవరిలోనూ ఉండదని అన్నేఫ్రాంక్ ఆశించి ఉంటుంది. ఆధిపత్యం కోసం, అధికారోన్మాదం ఆవహించి విధ్వంసాన్ని విధానంగా ఎంచుకొనే పాలకులను ప్రజాస్వామ్విక వ్యవస్థలో అన్నేఫ్రాంక్ మాత్రమే కాదు, హృదయమున్నవారెవ్వరూ ఆదర్శంగా తీసుకోరు. కానీ సీఎం రేవంత్రెడ్డి మాత్రం నెత్తుటి పిపాసిగా, పసి పిల్లల నుంచి పండు ముదుసలి వరకు వేటాడి వధించిన ఉన్మాదిగా చరిత్రలో క్రూరత్వానికి నిలువుటద్దంలా నిలిచిన హిట్లర్ తనకు ఆదర్శమంటున్నారు.
హిట్లర్ గురించి పదో తరగతి చదువుతున్నవారికి కూడా తెలుసు. అలాంటిది రేవంత్రెడ్డికి తెలియక సీనియర్ జర్నలిస్ట్ ఎన్.రామ్ ముందు హిట్లర్ ఒంట్లోకి వచ్చి హైడ్రాను అమలు చేస్తున్నానని గర్వంగా చెప్పేశాడని అనుకోలేం కదా! ఇంకా విచిత్రమేమిటంటే కఠినంగా వ్యవహరించాలనే స్పూర్తితో మాత్రమే సీఎం రేవంత్రెడ్డి అలా మాట్లాడారని మంత్రి శ్రీధర్బాబు నిస్సిగ్గుగా సమర్థించే ప్రయత్నం చేయడం దారుణం.
నిజంగా అదే ఉద్దేశం అయితే వివాదాస్పదమైన జనాభా నియంత్రణ లాంటి అనేక పథకాలను కఠినాతి కఠినంగా అమలుచేసిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నుంచి మొదలు నేడు వివిధ ఇతర పథకాలను అమలు చేస్తున్న మోదీ వరకు ఎవరి పేర్లను ఉదహరించినా ఇంత బాధపడేవాళ్లం కాదు.
పోనీ తెలంగాణకు కాక మరే ఇతర రాష్ర్టానికి ప్రాతినిధ్యం వహించే పాలకుడు ఇలాంటిది వాగి నా ఖండించి మరచిపోయేవాళ్లం. కానీ నియంతల చెర నుంచి విముక్తి కోసం కాలం కరవాలంపై మట్టిపాదాలతో పోరు యాత్ర కొనసాగించి, స్వేచ్ఛ కోసం త్యాగాలను కపోతాల్లా ఎగరేసిన తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉంటూ, హిట్లర్ను ఆదర్శంగా ప్రకటించిన రేవంత్రెడ్డిని ఎవరైనా ఎలా సహించగలరు? ఆ మాటకొస్తే స్వతంత్ర భారత చరిత్రలోనే కాదు నవీన ప్రపంచంలో ఏ దేశ, రాష్ట్ర పాలకుడు కూడా ఎలాంటి అంశంలోనూ హిట్లర్ స్ఫూర్తిని బహిరంగంగా ప్రవచించడం మనమెవరమూ చూడలేదు, వినలేదు కూడా.
నార్సిసిజం, మెగలోమేనియా లాంటి లక్షణాలతో ‘నేనే దేవుణ్ణి’ అనే అహంకారం, ప్రశ్నలను ఎదుర్కోలేని మనో వికారం, అబద్ధాల ప్రచార వ్యవస్థను ప్రధాన ఆయుధంగా వాడే మరుగుజ్జు నైజం కలిగిన హిట్లర్ మానసిక స్థితి కారణాల అన్వేషణకు డీఎన్ఏ విశ్లేషణ కూడా జరిగింది. మనస్తత్వ శాస్త్ర పితామహుల్లో ఒకరైన ప్రొఫెసర్ ముర్రే తన ‘ఎక్స్ప్లోరేషన్స్ ఇన్పర్సనాలిటీ ’ అనే గ్రంథంలో హిట్లర్ మనస్తత్వాన్ని స్పష్టంగా విశ్లేషించారు. ‘పగ పెంచుకోవడం, విమర్శలు సహించలేక పోవడం, అధికంగా ఇతరుల దృష్టిని ఆకర్షించాలని కోరుకోవడం, ఇతరులను కించపరచడం, వేధించడం బలవంతపు నేర ప్రవృత్తి తదితర గుణాలు హిట్లర్ మనస్తత్వానికి కొలమానాలని అనేక కోణాల్లో నాజీ నియంత జీవితాన్ని అధ్యయనం చేసి విశ్లేషించారు. సరిగ్గా అవే లక్షణాలు రేవంత్రెడ్డిలో కొంత కాలంగా తెలంగాణ సమాజం చూస్తున్నది. జాతి విద్వేషాలు రెచ్చగొట్టి ప్రపంచాన్ని శాసించాలని హిట్లర్ కుట్రలు చేశాడు.
అదే బాటలో కులాల మధ్య వివాదం రాజేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలనే వ్యవహార శైలి చాలా స్పష్టంగా రేవంత్రెడ్డిలో తేటతెల్లమవుతున్నది. అలాగే కృతజ్ఞత చూపలేకపోవడం, ఓర్వలేనితనం, నిర్మాణాత్మక దృక్పథ లేమి, ఆత్మవిశ్వాస లోపం వంటి ఇతర అవలక్షణాలు కూడా కలిగిన హిట్లర్ రెండవ ప్రపంచ యుద్ధంలో యూదులనే కాదు, గత చారిత్రక కట్టడాలను కూడా లక్ష్యంగా చేసుకొని నాశనం చేశాడు. పోలాండ్ రాజధాని వార్సాలోని పురాతన కట్టడాలు, భవనాలను నేలమట్టం చేశాడు. లండన్ నగరంలో చారిత్రక చర్చిలు, ఎన్నో అద్భుతమైన భవంతులను బాంబులతో ధ్వంసం చేశాడు. చివరికి పారిస్లోని ఈఫిల్ టవర్తోపాటు చారిత్రక కట్టడాలన్నింటినీ పేల్చివేయాలనే ఉన్మాదపు ఆదేశాన్ని నాజీ సైన్యానికి జారీ చేశాడు. అయితే హిట్లర్ విపరీత పోకడలతో విసిగిపోయిన ఆనాటి జర్మన్ జనరల్ హిట్లర్ ఆదేశాలను ధిక్కరించి కట్టడాలను కాపాడాడు. ఇదే మనస్తత్వంతో రేవంత్ కూడా కాళేశ్వరం కూలిపోవాలని, కాకతీయ తోరణం, తెలంగాణ తల్లి ప్రతిమ మార్చాలని, అంబేద్కర్ స్థూపాన్ని బంధించాలని, భూములను లాక్కోవాలని, భవనాలు కూల్చివేయాలని ఇలా చరిత్రను ధ్వంసం చేసే ఎన్నో చర్యలు చేపడుతున్నారు.
ఇవన్నీ అర్థం చేసుకున్న కేరళం మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన అధికారిక ఫేస్బుక్ పేజీలో స్పందిస్తూ హిట్లర్ స్ఫూర్తి మంత్రంపై సీఎం రేవంత్రెడ్డి కేవలం నోరు జారలేదని, కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని బహిర్గతం చేశారని స్పష్టంగా వివరించారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు, అధికార కేంద్రాలు కుడి, ఎడమలకు మారటానికి కారణాలు అనేకం.
కానీ పాలనా పగ్గాలు చేపట్టిన నాయకుల మనస్తత్వమే సర్కార్ సైకాలజీగా మారి, ప్రజల జీవితాలపై పెను ప్రభావం చూపెడుతుంది. సీఎం తలలో సైతాన్ తిష్టవేసుకొని వేసుకొని కూర్చున్న తర్వాత సర్కార్లో మాత్రం పరమాత్ముడి దర్శనం ఎలా కలుగుతుంది? కనీస మానవత్వం ఎలా ప్రతిబింబిస్తుంది? అందుకే ప్రజలపై పగతో రగులుతున్న ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు మోయకతప్పడంలేదు. ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ ఎన్. రామ్ ముందు రాష్ట్రం పరువు మాత్రమే కాదు, దేశం మొత్తం ముందు తెలంగాణ నవ్వులపాలైపోతున్నది. ప్రజల్లో నుంచి ప్రభవించే నాయకత్వాని కి ఉండే పరిజ్ఞానాన్ని, పెట్టుబడిదారీ పార్టీలు పెంచి పోషించిన నాయకగణం నుంచి ఎన్నటికీ ఆశించ లేం. కానీ హిట్లర్ లాగే అలా విద్వేషంలో నుంచి వికసించిన రేవంత్రెడ్డి లాంటి పాలకులు, సృష్టిం చే విధ్యంసానికి వర్తమాన ప్రగతి ప్రాణాలొదలా ల్సి రావడమే విషాదం. ఏదేమైనా సర్కార్ మస్తిష్కంలో సైతాన్ ఉన్నదని, ఆ సైతానే వికృత చర్యలకు పాల్పడుతున్నదని అర్థమైపోయింది.