PM Modi | భారతదేశ కేంద్ర బ్యాంకు అయిన భారతీయ రిజర్వ్ బ్యాంకు 2022-23 తాజా నివేదికలో దేశ ప్రజల నికర ఆర్థిక పొదుపులు క్షీణించినట్టు వెల్లడించింది. స్థూల దేశీయ ఉత్పత్తి శాతంలో దేశ ప్రజల నికర ఆర్థిక పొదుపులు 5 శాతం మాత్రమే ఉన్నాయని రిజర్వ్బ్యాంక్ తెలిపింది.1975- 1976 తర్వాత ఇంతగా క్షీణించడం ఇదే మొదటిసారని స్పష్టం చేసింది. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలేనని నివేదించింది. ప్రజల దగ్గర పొదుపు చేసే శక్తి లేకపోవటం, దానికి తగిన ఆదాయం లేకపోవడటమే కారణమని నివేదిక వెల్లడించింది.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల సగటు మనిషికి వచ్చే ఆదాయం బట్టపొట్టకు సరిపోవడం తప్ప పొదుపు చేయడానికి అవకాశం లేకుండా పోయింది. పెరుగుతున్న ధరలపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడమే దీనికి కారణం. రిజర్వ్బ్యాంక్ వెల్లడించిన విషయాలు ఆర్థిక వేత్తలు, సగటు మానవులు భవిష్యత్తుపై ఆశలు చంపుకొని జీవించడానికేనని స్పష్టమవుతున్నది. దీంతో నివాసముండడానికి అవసరమైన ఇంటిపై, ప్రాథమిక అవసరంగా మారిన వాహనంపై, క్రెడిట్ కార్డులపై విపరీతంగా అప్పులు చేస్తున్నారని రిజర్వ్బ్యాంక్ ఆవేదన వ్యక్తం చేసింది. దేశ ప్రజలంతా ఏదో ఒక అప్పులపై ఆధారపడ్డారని రిపోర్టు ఇచ్చింది. దేశ ప్రజల్లో పొదుపు చేసే శక్తి లేని ప్రజలు నూటికి తొంబై శాతం ఉన్నారని నివేదిక రుజువు చేసింది. ప్రస్తుతం పాలకులు ప్రచారం చేస్తున్న ‘మేకిన్ ఇండియా’ పేరుకు మాత్రమేనని తేలిపోయింది. భారతదేశంలో పేద ప్రజల్లో ఎలాంటి అభివృద్ధి లేదు. దేశంలోని కార్పొరేట్ల అభివృద్ధే దేశ అభివృద్ధిగా మారింది.
నిజానికి భారతదేశం స్వతంత్ర ఆర్థిక విధానాల నిర్ణయాలతో నిలబడింది కాదు. పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల, కార్పొరేట్ శక్తుల చేతుల్లో కీలుబొమ్మగా మారటంతో పాటుగా సామ్రాజ్యవాద దేశాలైన బ్రిటన్ ఆదేశాలకు అనుగుణంగా,అమెరికా ఆదేశాలకు అనుకూలంగా పరిపాలన కొనసాగిస్తున్నది. ప్రస్తుతం దేశ ప్రజలవని మనం గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ విధానాల ప్రకారం శాతంలో కొంత మాత్రమే మనవి. మిగిలిన శాతం మొత్తం ప్రైవేటు భాగస్వామ్యానివే.
భారత ప్రభుత్వ ఆధీనంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోట్ల మంది ఖాతాదారులను కలిగి ఉన్నది కానీ భారతీయ స్టేట్ బ్యాంక్లో కూడా హెచ్డీఎఫ్సీ వాటాలూ, ఐసీఐసీఐ వాటాలూ, ఈ దేశ కుబేరుడైన గౌతం అదానీ వాటాలు కలిగి ఉన్నది. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకైన భారతీయ స్టేట్ బ్యాంకు మొన్నటి వరకు ఖాతాదారులకు డెబిట్ కార్డులు మంజూరు చేయలేని స్థితిలో ఉన్నది. నిన్న మొన్న వచ్చిన భారతీయ రూపాయి డెబిట్ కార్డుకు ముందు ప్రపంచ ప్రజల రక్తం తాగుతున్న అమెరికాకు చెందిన విసా-మాస్ట్రో డెబిట్ కార్డులనే ఇప్పటికీ వాడుతున్నారు. ఈ కార్డులను వివిధ రకాల షాపింగ్ మాల్స్లలో ఖాతాదారులు ఉపయోగించినప్పుడు మనం కొనుగోలు చేసిన షాపువారికి డబ్బులు వెంటనే చెల్లింపులు కావు కానీ మన అకౌంట్ నుండి డబ్బులు కట్ అవుతాయి. డెబిట్ కార్డుల ఓనర్స్ అంటే అమెరికా కంపెనీలు ఒకటి, రెండు రోజుల తరువాత షాపింగ్ మాల్స్ వారి అకౌంట్లలో డబ్బులు వేస్తారు. ఇలా ఈ వ్యవహారాలు నిర్వహించినందుకు వారు కొంత మొత్తంలో డబ్బులు వసూలు చేసుకుంటారు. ఈ కార్యకలాపాలు మొత్తం వారు అమెరికాలోని కాలిఫోర్నియా నగరం నుంచి నిర్వహిస్తారు. ఎస్బీఐ బ్యాంకు ఖాతాదారుల పూర్తి వివరాలు మాస్ట్రో,వీసా డెబిట్ కార్డులను మెయింటనెన్స్ చేసే సంస్థల చేతుల్లో ఉంటాయి.అంటే భారత దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ భారతీయ బ్యాంకు ఖాతాదారుల వివరాలు అమెరికా సంస్థ చేతుల్లో ఉన్నాయి. మనకు భారతీయ స్టేట్ బ్యాంకు జారీ చేసే రూపే డెబిట్ కార్డులు వచ్చినప్పటికీ ఈ వ్యవహరం ఇంకా కొనసాగుతునే ఉన్నది.
భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల విధానం కోసం వాడుతున్న ఫోన్ పే 2016లో బెంగళూరులోని ప్రైవేట్ వ్యక్తులు తయారుచేసిన ఒక యాప్. 2021- 2022 సంవత్సరంలో రూ.1646 కోట్ల ఆదాయం వచ్చిందని ప్రకటించింది. భారత దేశంలో ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్వహిస్తున్న ఫోన్పేను నలభై ఆరు కోట్ల మంది ఉపయోగిస్తున్నారు. ఇక మరో డిజిటల్ లావాదేవి లకు ఉపయోగించే గూగుల్ పే కూడా అమెరికా వారే నిర్వహిస్తున్నారు. ఇక వివిధ రకాల సమాచారం తెలియజేయడానికి వచ్చిన వాట్సప్ మన దేశంలోకి 2009వ సంవత్సరంలో ప్రవేశించింది. దీన్ని 2014 లో ఫేస్బుక్ అనే సంస్థ రూ.1.18 లక్షల కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అంటే తెలంగాణలోని ఒక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడానికి ఐన ఖర్చు. కాబట్టి ప్రజలు ప్రతిరోజు వాడుకునే చిన్న యాప్ల ద్వారా కోట్ల ఆదాయం వారికి లభిస్తున్నది.
ఫేస్బుక్ను తయారు చేసిన జుకర్బర్గ్ ఈరోజు ప్రపంచ కుబేరులలో ఒకరుగా మారారు. భారత ప్రభుత్వానికి వీటిలో ఒక్కదాన్ని కూడా బ్యాన్ చేసే శక్తిలేదు. భారత ప్రభుత్వం వాట్సప్ను బ్యాన్ చేస్తే ఇండియాలో టెలిగ్రామ్ను ఇక్కడ ప్రజలు ఉపయోగించుకుంటారు తద్వారా ఇక్కడ ప్రజల పైసలు ఈ దేశానికే ఉపయోగపడతాయి. సామ్రాజ్యవాద దేశాల యాప్లను రద్దు చేసి మన దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో భారత ప్రభుత్వం ఆధునిక యాప్లను సృష్టించాల్సిన అవసరం నేడు ఎంతో ఉన్నది. ప్రస్తు తం ప్రపంచ మార్కెట్లో డాలర్తో రూపాయి మారకం విలువ నిరంతరం క్షీణిస్తూ నేడు 80 రూపాయలకు చేరుకున్నది. ఇవన్నీ కూడా భారతదేశ ప్రజలు పేదరికంతో జీవితం గడుపుతున్నారనే విషయాన్ని తెలియజేస్తున్నాయి. ప్రస్తు తం భారతదేశం దేశ స్థూల దేశీయ ఉ త్పత్తిలో దేశీయ ప్రజల నికర ఆర్థిక పొ దుపులు ఐదు శాతం మాత్రమే ఉన్నా యి. మేకిన్ ఇండియా అంటూ నూటికి ఎనభై శాతం సరుకులు చైనా నుంచే దిగుమతి చేసుకొంటున్నది. ఆజాదీకా అమృత్ మహోత్సవాలు జరుపుకొంటున్న భారతదేశంలో భారత ప్రజల ఆర్థిక స్థితుల దుస్థితి ఇది.
-గుండమల్ల సత్యనారాయణ
95059 98838