PV Narasimha Rao | అయోధ్యలో ప్రవహిస్తున్న పవిత్రమైన సరయూ నది ఒడ్డున లక్షలాది మంది హిందువుల విశ్వాసం, ఐక్యత, పోరాటానికి చిహ్నంగా దివ్యమైన రామమందిరం వెలిసింది. ఈ రామమందిరం భారతీయుల అద్వితీయమైన స్ఫూర్తికి నిదర్శనం. రాజకీయాలకు అతీతమైన స్ఫూర్తిని రామమందిరం కైవసం చేసుకుంటున్నది. అయితే మందిరం నిర్మాణ ఘనతలో సింహభాగం బీజేపీకే దక్కుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రత్యేకమైన ఈ శుభ సందర్భాన్ని మనం సంబురంగా జరుపుకొంటున్న ఈ తరుణంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు రామమందిరం నిర్మాణంలో కీలకపాత్ర పోషించారనే విషయాన్ని మననం చేసుకోవాలి.
1986లో అయోధ్య వివాదాస్పద స్థలం గేట్లు తెరిచిన నాటి నుంచి 1989లో రాజీవ్గాంధీ హయాంలో శిలాన్యాస్ చేయడం వల్ల రామజన్మభూమి అంశం తెరపైకి వచ్చింది. 1992లో అయోధ్య వివాదం పతాకస్థాయికి చేరుకున్నప్పుడు మరింత ముదరకుండా చూసుకున్నది పీవీనే. ‘మనం బీజేపీతో యుద్ధం చేయగలం, రాముడితో కాదు’ అని చెప్తూ సామరస్యపూర్వక పరిష్కారం కోసం పీవీ ఎనలేని కృషి చేశారు. 1991లో తన మొదటిస్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలోనూ అయోధ్య రామమందిరం గురించి ఆయన ప్రస్తావించారు.శాంతియుత చర్చల ద్వారా రాముడికి దివ్యమైన రామమందిరం, ముస్లింలకు అద్భుతమైన మసీదును కూడా నిర్మించాలని ఆకాంక్షించారు. ఒకవేళ చర్చలు విఫలమైతే సుప్రీంకోర్టు నిర్ణయమే అందరికీ ఆమోదయోగ్యం కావాలని తన ప్రసంగంలో స్పష్టం చేశారు.
1992లో కరసేవకులు చేసిన దాడిలో బాబ్రీ మసీదు నేలమట్టం అయింది. సెక్యులర్ పార్టీలని చెప్పుకొనే కొన్ని పార్టీల నుంచి ఆ సమయంలో పీవీ విమర్శలు ఎదుర్కొన్నారు. ‘నోరు మెదపకుండా, ప్రేక్షకుడిగా చూస్తున్నందునే’ ఈ ఘటన జరిగిందని పీవీపై ఆ పార్టీలు విరుచుకుపడ్డాయి. బాబ్రీ ఘటనలో పీవీ ప్రమేయం లేదని, స్వాతంత్య్రంతర్వాత జరిగిన అత్యంత సిగ్గుచేటు ఘటన ఇదేనని సుప్రీంకోర్టు పేర్కొంది. అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కల్యాణ్సింగ్ను దోషిగా సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించింది. అయినప్పటికీ పీవీపై విమర్శల పరంపర ఆగలేదు. ఆయన ఏ తప్పూ చేయలేదని, రాజ్యాంగం ప్రకారమే నడుచుకున్నారని లిబర్హాన్ కమిషన్ స్పష్టం చేసి ఆయనకు క్లీన్చిట్ కూడా ఇచ్చింది.
ఈ ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్యనే ఎంతో ముందుచూపుతో ఆర్డినెన్స్ ద్వారా అయోధ్యలో 67 ఎకరాల భూమిని పీవీ నరసింహారావు సత్వరమే స్వాధీనం చేసుకున్నారు. ఆర్డినెన్స్లో ఆ స్థలాన్ని సున్నితమైన ప్రాంతంగా పేర్కొనడం గమనార్హం. ఈ వ్యూహాత్మకమైన చర్య కారణంగానే అక్కడ మనం ఇప్పుడు చూస్తున్న భవ్యమైన రామమందిరం నిర్మించేందుకు వీలు కలిగింది.
ఏండ్లు గడచిన తర్వాత 2019లో సంబంధిత అన్ని పక్షాలకు ఆమోదయోగ్యమైన తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది. మసీదు విధ్వంసం అనేది ఆవేశపూరిత చర్య అని ప్రకటించింది. సీబీఐ కోర్టు అన్ని క్రిమినల్ చర్యలను నిలిపివేసింది. దీంతో వివాదం చల్లారింది. బృహత్తర రామాలయ నిర్మాణానికి మార్గం సుగమమైంది. పార్టీలు స్వప్రయోజనాల కోసం గుప్పించిన విమర్శలను పక్కనపెడితే, 67 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు పీవీ చేసిన కృషిని తక్కువ చేసి చూడలేం. అలాగే, అన్ని వర్గాలను చర్చల్లో పాల్గొనేటట్టు చేయడంలో ఆయన పోషించిన క్రియాశీలక పాత్ర, వ్యవహార నైపుణ్యం కీలకమని చెప్పాలి.
అయోధ్య వివాదం సంక్లిష్టతలను తొలగించి ఈ రోజు మనమంతా సంబురాలు జరుపుకొంటున్న భవ్య మందిరానికి పునాదులు వేసింది ఆయనే. వేలమంది సంతులు, సాధువులతో జరిపిన సమావేశాలు, ముస్లిం మతపెద్దలతో గంటలపాటు జరిపిన సమాలోచనలు ఆయన అంకితభావానికి అద్దం పడతాయి. రెండు నాల్కల రాజకీయ ధోరణుల నడుమ, నిజమైన రాజనీతిజ్ఞునిగా పీవీ నరసింహారావు నిష్కళంకంగా నిలుస్తారు. పీవీ లౌకిక విలువలు, రామమందిర నిర్మాణం పట్ల చెక్కుచెదరని అంకితభావం.. మతాన్ని, రాజకీయాలను వేరుచేసి చూసే సునిశిత దృక్పథం ఆయన నాయకత్వ ప్రతిభకు సాక్ష్యాలుగా నిలుస్తాయి. ఒక నూతన చరిత్ర ఆవిష్కృతమవుతున్న వేళ భవ్యమందిరం కోసం దార్శనిక నేతగా పీవీ చేసిన కృషిని మనం స్మరించుకుందాం. రాజకీయ నాటకాలకు అతీతమైన ఆలోచనాధోరణి గల ఆయనకు నివాళులర్పిద్దాం.
-పీవీ ప్రభాకర్రావు