ఇప్పుడొకసారి చరిత్రను తొవ్వుకోవాలె. ఎప్పుడో జీవచ్చవాలుగా మారిన వాళ్ల అవశేషాల గురించి కాదు. ఏనాడో శిథిలమైపోయిన ఆనవాళ్ల కోసం కానే కాదు. తెలంగాణకు విముక్తి కలిగించిందెవరు? ఎవరు పోరాడారు? ఎవరు గెలిచారు? అని కూడా కాదు. పంటచేల మీది పాత ముచ్చట్లను తలుచుకోవటానికి.. అక్కడి నులివెచ్చని జ్ఞాపకాలను తడుముకోవటానికి చరిత్రను తొవ్వుకోవాలె. ఉమ్మడి ఏలుబడిలో ధ్వంసమైపోయిన సాగుబడిని.. లుప్తమైన సంస్కృతిని తరచిచూసి ఎదలు బాదుకోవటానికి తొవ్వాలె. పాలకులకు దిశచూపి.. పంటచేనుకు జీవం పోసే సరికొత్త సాగు పంచాంగం కోసం మన చరిత్రను మనమే తొవ్వుకోవాలె.
సూర్యాపేట జిల్లా కర్విరాల కొత్తగూడెంలో పది రోజుల కిందట మా పెదనాన్న వర్ధెల్లి రాములు తన 79వ యేట అమరుడయ్యాడు. సాగుబాటుతో పాటు తిరుగుబాటు కూడా జీవన గమనంలో ఓ భాగమేనని చెప్పిన మలితరం మార్క్సిస్టు ఆయన. ‘లెఫ్టే’ రైట్ అనే సిద్ధాంతాన్ని నమ్మారాయన. తన తమ్ముళ్లనే సైన్యంగా చేసుకొని దొరతనానికి వ్యతిరేకంగా దండు నడిపిన అసలుసిసలైన కమ్యూనిస్టు వర్ధెల్లి రాములు. రెక్కల కష్టం మీదనే పదెకరాలు సంపాదించి సాగు చేసిన నిఖార్సైన రైతు ఆయన.
పొద్దంతా కాయకష్టం చేసుకొని, పొద్దుగూకిన వేళ బీద, బిక్కి, బడుగు జనాలను పోగేసి ‘మాక్స్ మహనీయుడెన్నడో దారి చూపే.. ఓ సామ్రాజ్యవాద తొత్తులారా.. మీ మాటలు సాగవనుచు గర్జించె సుందరయ్య’ అని రాగం అందుకుంటే విప్లవమే గజ్జెకట్టి నర్తించినట్టుండేది. ఆ గర్జనకు మా ఊరి దొర గడీ వణికేది. ఇంకో పదేండ్లు పెదనాన్న బతుకుతాడని అనుకున్న. కానీ, అనుకోకుండా తుదిశ్వాస విడిచారు. సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డితో సహా ఎర్రజెండా కామ్రేడ్స్ అంతా వచ్చి పాడె మోసిండ్రు. కమ్యూనిస్టుగా, కర్షకునిగా, గీత కార్మికునిగా ఆయన నడిపిన ఉద్యమాలను అందరూ స్మరించారు. నివాళులు అర్పించారు.
దహన సంస్కారం చేసిన అనంతరం పాలోళ్లంతా స్నానం చేసి, ఇంటి వాకిట దీపం చూడటం ఆచారం. పుణ్య క్రియలన్నీ ఆచరించి, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చటమే పాలోళ్లుగా మేం ఆయనకిచ్చే ఘనమైన నివాళి. దహన సంస్కారం ముగిసింది. స్నానం చేద్దామని బోరు బావి దగ్గరకు వెళితే త్రీఫేజ్ కరెంటు లేదు. మా సోదరుడు ఓ పత్రికలో స్థానిక విలేకరి. ఏఈకి ఫోన్ జేస్తే కరెంటు కోత ఉందని ఆయన అన్నడు. రిక్వెస్ట్ మీద ఓ అర్ధ గంట పాటు కరెంటు వదిలిండు. ఈ తతంగాన్నంతా చూసి ‘తుంటను దించుకొని మొద్దు ఎత్తుకున్నట్టయింది మన బతుకులు’ అన్నడు మా చిన్నాన్న. ఆయనకు ఎద్దే ప్రపంచం. ఎవుసమే సర్వస్వం. ఏ రాజకీయ పార్టీ భావజాలం అంటని మనిషి. కేసీఆర్ పదేండ్ల పాలనలో జనం మొహం మొత్తి సరికొత్త పాలనను కోరుకోవడంలో అర్థం ఉంది. కానీ, రెండు నెలల పాలన.. కేవలం రెండే రెండు నెలల కొత్త ప్రభుత్వంపై ఏమిటి పెదవి విరుపు? సహజంగానే సందేహం నా మదిని తట్టింది. అప్పుడే అంత మాట అంటివెందే చిన్నాన్న అని అడిగితే కరెంటు కష్టాల మూట విప్పిండు.
‘సాయంత్రం ఐదింటికి కరెంటు తీస్తరు. తెల్లవారుజామున మూడు గంటలకు ఇస్తరు. తెల్లారంగ రైతులందరం బావులకాడికిపోయి మోటర్లు ఆన్ జేస్తే ఓవర్లోడ్ పడి బోరు మోటర్లు కాలిపోతున్నయి’ అని బాధపడ్డడు. ఇదే కర్విరాల కొత్తగూడెంలో ఒకేరోజు నాలుగు బోరు మోటర్లు కాలిపోయాయట. నెల రోజుల్లో 15 మోటర్లు కాలాయట. ఎవరెవరి మోటర్లు కాలిపోయాయో! గుక్క తిప్పుకోకుండా పేర్లన్నీ చెప్పిండు.
మా చిన్నాన్న చెప్తున్న కరెంటు కష్టాలు రాష్ట్రంలో ఎక్కడైనా ఉన్నాయా? ఒక్క మా ఊరులోనే ఇట్లా జరుగుతుందా? అని గూగుల్లో వెదికితే ఆశ్చర్యకరంగా పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం నాగారంలో అచ్చంగా ఇటువంటి సంఘటనే జరిగినట్టు కనిపించింది. చేతిలో కుమ్మిసట్టి, నుదిటిన వీర బొట్టు, మెడలో దండ వేసుకొని, దహన సంస్కారాలు చేయాల్సిన వ్యక్తే విద్యుత్తు అధికారులకు ఫోన్ చేస్తూ.. పుణ్య స్నానాలు ఆచరించే వరకు కరెంటు ఇడువాలని వేడుకుంటున్న దృశ్యంతో ఓ వార్త కనిపించింది. ఇట్లా అడగటం కూడా పెద్ద నేరమే అయింది. కరెంటు అడిగినందుకు పాలకులకు కోపం వచ్చింది. బాధితుని మీద కన్నెర్ర జేసిండ్రు. అనుచరగణాన్ని ఉసిగొలిపి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయించిండ్రు. దీనిపై ప్రస్తుతం కమాన్పూర్ పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.
ఇటువంటి సంఘటనలు తెలంగాణ ప్రజలకు కొత్తేమీ కాదు. ఉమ్మడి రాష్ట్రంలో ఇంతకుమించిన నరకాన్ని ప్రజలు చూశారు. నీళ్లింకిన బోర్లను చూసి కన్నీళ్లతోనే కాలమెల్ల దీసిన అనుభవం తెలంగాణది. చెరువులు ఎండిపోయి, బావుల్లో నీళ్లు లేక, రోజుల తరబడి కరెంటు రాక, పొట్టకొచ్చిన చేను వట్టిపోయి జనం మస్తు కష్టాలు పడ్డరు అప్పటి కాంగ్రెస్ పాలనలో. స్వరాష్ట్రం సిద్ధించినంక, నాడు ఆవరించిన చిమ్మ చీకట్లను చీల్చుకుంటూ సరికొత్త వెలుగులు రాష్ట్రంలోకి చొచ్చుకొచ్చాయి. ఎవుసానికి 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తు అందింది. దానికి రైతుబంధు తోడైంది. దండుగ అనుకున్న వ్యవసాయం పండుగ అయింది. జీవనోపాధి స్థాయి నుంచి ఎదిగి సాంస్కృతికంగా మళ్లీ ఎవుసం పునరుజ్జీవం పోసుకుంది. పదేండ్ల నిరంతర కరెంటు, రైతుబంధుతో రైతు సేతానం.. పతానం మారింది. నిరంతర కరెంటు, రైతు భరోసా చుట్టూ రైతు గమనం అల్లుకుపోయింది.
ఈ ప్రపంచంలో ఏ రెండు పుర్రెలు ఒకే తీరుగా ఆలోచనలు చేయవు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలతో ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి విభేదించారు. ప్రజలు కూడా రేవంత్రెడ్డి ఆలోచనతోనే ఏకీభవించారు. కాబట్టే, కాంగ్రెస్ పార్టీకి పట్టం గట్టారు. 24 గంటల పాటు నిరంతరం కరెంటు సరఫరా చేయడం వల్ల వృథా జరుగుతోందనేది రేవంత్రెడ్డి ఆలోచన. అందుకే అధికారంలోకి రాగానే ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టారు. దీంతో కాంగ్రెస్ రాకతో పాటే రైతుల జీవితాల్లోనూ ‘మార్పు’ మొదలైంది. నిజమే..! కొంత వృథా ఉంటే ఉండవచ్చు. కానీ, పాలకులు నిర్ణయం తీసుకున్నంత సులువుగా సాగుబడి సరళి మారదు కదా. పదేండ్లుగా ఓ తరహా సాగుకు రైతన్నలు అలవాటు పడ్డారు. రాత్రికి రాత్రే సేతనం తీరు మారాలంటే ఎట్టా మారుతుంది. ఇక్కడే రైతుకు, రేషన్ తరహాలో ఇస్తున్న కరెంటుకు మధ్య సంఘర్షణ మొదలైంది. సాగు ఒడుదొడుకుల మార్పునకు లోనైంది. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రైతాంగం అనుభవించిన సంక్షేమ కాలాన్ని కూడా ప్రస్తుత ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలె. ఒక్కసారిగా ఊహించని కరెంటు కోతలతో ఇబ్బందులు పడుతున్న కర్షకుల కష్టాన్ని అర్థం చేసుకోవాలి. ఎన్ని గంటల పాటు నాణ్యమైన, నిరంతరాయ కరెంటు ఇస్తారో.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సరఫరా చేయగలరో ముందుగానే ప్రకటించాలి. ఆ మేరకు రైతులకు అవగాహన కల్పించాలి.
సాలిరువాలు సక్కగుంటేనే ఎవుసం ఒడ్డెక్కుద్ది. కరెంటు సాలు అయితే రైతుబంధు ఇరువాలు. ఇరువాలు ఇగురంగ దున్నకపోతే కలుపు పుడుతుందని రైతులు చెప్తారు. కొన్ని ఉదాసీనతలతో రైతుబంధులోనూ కొంత కలుపు, గరక కలగలిసిందని ప్రజాకవి గోరటి వెంకన్న మండలిలో చెప్పారు. ఇప్పటికైతే కొత్త ప్రభుత్వం రైతుబంధు పట్ల సానుకూలతనే ప్రకటించింది. ఆ మేరకు రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తూ వస్తున్నది. ఖజానాలో నిధుల లభ్యతను బట్టి విడతలు, విడతలుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్న మాట వాస్తవం. రైతుబంధు అందిన రైతులు డబ్బులు పడ్డాయనే చెప్తున్నారు. ఇంకా సాయం అందనివాళ్లు కొంత ఆందోళనతో ఉన్నారు. ఇటువంటి రైతులను ఎవరైనా మీడియా ప్రతినిధులు పలకరించినప్పుడు ‘మాకింకా సాయం అందలేదు’ అని వారు చెప్తున్నారు.
అదే విషయం జర్నలిస్టులు ఓ మంత్రి వద్ద ప్రస్తావించగా.. ‘రైతుబంధు పడలేదని అన్నవాళ్లను చెప్పుతో కొట్టండి’ అని ఆయన బదులివ్వడం రైతాంగాన్ని ఖిన్నులను చేసింది. ఇటువంటి పౌరుషపు మాటలే రెండు నెలలు కూడా తిరగకముందే ప్రభుత్వాన్ని పలుచన చేస్తున్నాయి. ‘కోరి తెచ్చుకున్నప్పుడు కొట్టినా పడాలె.. తిట్టినా పడాలె’ అంటే జనం సహించరు. అన్నదాతలు ఎప్పుడూ పెట్టినవాళ్లను మనసారా ఆశీర్వదిస్తారు. కొట్టిన వాళ్లను మనసుల పెట్టుకుంటారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ప్రజా సంక్షేమం, అభివృద్ధినే ప్రజలు కోరుకుంటారు. ప్రజా ఆలోచనలకు అనుగుణంగానే పాలకుల నిర్ణయాలు ఉండాలె.
అధికారంలోకి వచ్చి రెండు నెలలే అయింది కాబట్టి, ఇదే విషయం ప్రజలకు వివరంగా చెప్పవచ్చు. ‘ఆందోళన వద్దు, మేం ఉన్నాం’ అని భరోసా నింపటానికి నాయకునికి ఇది తగిన సమయం. కానీ, విచక్షణ కోల్పోయి, అధికార మదం, పోలీసు బలం ప్రయోగిస్తామంటే జనం చరిత్రను తోడతారు. సరికొత్త చరిత్ర రాసేందుకు సన్నద్ధమవుతారు.
వర్ధెల్లి వెంకటేశ్వర్లు