అనుభవం అన్నది భాషలోని చాలా గొప్ప పదాల్లో ఒకటి. ఎందుకంటే కనిపెంచిన తల్లిదండ్రులు, చదువు నేర్పిన ఉపాధ్యాయులు, ఇరుగు పొరుగు పెద్దవాళ్లు, సమాజంలో ఇతరులు చెప్పినా నేర్చుకోని పాఠం అనుభవం నేర్పిస్తుంది. స్వయంగా అనుభవించిన కష్టాలు, సుఖాలు మనిషికి జీవితం అర్థమయ్యేట్టు చేస్తాయి. అయితే ఈ పాఠాలు నేర్చుకోవటంలో అందరికీ ఒకే రకమైన నేర్పు ఉండదు. ఇంగ్లీషులో ఒక సామెత ఉంది.
‘చుట్టుపక్కల వారి జీవితం చూసి నేర్చుకునేవారు తెలివైనవారు, తమ తలకాయ పగిలాక నేర్చుకునేవారు తెలివి తక్కువవారు’ అని. అయితే మూడోరకం కూడా ఉన్నట్టు 2023 తెలంగాణ శాసనసభా ఎన్నికలు నిరూపించాయి. నాలుగు దశాబ్దాల కాంగ్రెస్ పాలన చూసి కూడా, అద్భుతంగా సాగుతున్న తెలంగాణ రాష్ట్ర పాలనను బీఆర్ఎస్ చేతిలోంచి తీసి కాంగ్రెస్ పార్టీకి అప్పగించిన ఓటర్లు ఈ మూడో కోవకు చెందుతారు. వీరికి ఏ పేరు పెట్టాలో ఆలోచించవలసిన విషయమే!
Telangana | 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను 44 ఏండ్ల పాటు కాంగ్రెస్ పాలించింది. సామాన్యుల కనీస అవసరాలు కూడా పట్టించుకోని ఆ పాలనలో అందరికీ కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేదు. ఇక సాగునీరు, ఇతర వనరులన్నీ ఈ దక్కన్ పీఠభూమి మీంచి కిందనున్న ఆంధ్రా ప్రాంతానికి పారాయి. ‘తలాపునా పారుతుంది గోదారి, మన చేను, మన చెలక ఎడారి’ వంటి వేల పాటల్లో ఈ ప్రాంత ఆవేదన వ్యక్తం చేశారు కవులు, గాయకులు. 1956 నుంచి కేవలం పదేండ్లలో పచ్చటి పైరులు ఎండిపోయి, నిధులన్నీ మళ్లిపోయి, ఉద్యోగాలన్నీ మాయమయ్యేసరికి, 1969లో ఒక మహా ఉద్యమం మొదలై దాదాపు 10 నెలల పాటు సాగింది. ప్రపంచంలో అతి దీర్ఘకాలం సాగిన ప్రజా ఉద్యమంగా అది రికార్డులకెక్కింది. హింసతో దానిని అణచివేసిన పాలకులు మళ్లీ యథేచ్ఛగా అదే పంథాలో దాదాపు 45 ఏండ్లు అధికారం చెలాయించారు. ఉబుకుతున్న లావాలా మళ్లీ ప్రతి దశాబ్దానికి ఉద్యమ తీవ్రత పెరిగింది. అయితే ఇందులో సమిధలైంది మాత్రం నిరాశచెందిన తెలంగాణ యువత. దాదాపు 1,200 మందికిపైగా ఆత్మహత్య చేసుకున్నా.. తెలంగాణ రాజకీయ నాయకులకు చీమ కుట్టినట్టు అనిపించలేదు. వందల ఆత్మహత్యలు జరిగినా కాంగ్రెస్, తెలుగు(ఆంధ్ర)దేశం నాయకులు నిమ్మకు నీరెత్తినట్టు వాళ్ల స్వార్థ, అవినీతి రాజకీయాలు సాగిస్తూ పోయారు.
58 ఏండ్ల పాలనలో తెలంగాణ ప్రాంతం పడ్డ కష్టాలు, వేదన వర్ణనాతీతం. అయితే ఈ గతాన్ని ఇప్పుడెందుకు గుర్తు తెచ్చుకుంటున్నట్టు? ఎందుకంటే, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ పాలన జరుగుతున్న తీరును బట్టి! వారు ఎన్నికలు గెలవటానికి వాడిన నినాదాలు, చేసిన ఆరోపణలు, గెలిచాక ప్రవర్తిస్తున్న తీరు ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం!
తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమం చేసిన తర్వాత సాధించిన తెలంగాణ రాష్ట్రంలో మొదటి ఎన్నికల్లో సహజంగానే ఉద్యమ నాయకుడి పార్టీ గెలిచింది. ‘మా సోనియమ్మ రాష్ట్రం ఇచ్చింది కాబట్టి మేమే గెలుస్తాం’ అనుకున్న కాంగ్రెస్ నాయకులు తెలంగాణ, ఆంధ్ర రెండు ప్రాంతాల్లోనూ ఓడిపోయారు. ఎందుకంటే నిజానికి తెలంగాణ ప్రజల మీద ప్రేమతోనో, అంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారన్న ఆవేదనతోనో సోనియమ్మ రాష్ర్టాన్ని ఇవ్వలేదు. ఇక తమ పప్పులుడకవన్న అవగాహన కలిగి, మళ్లీ ఇక్కడ గెలుస్తామన్న దురాశతో విధిలేక ప్రత్యేక రాష్ట్రం ఇవ్వవలసి వచ్చింది.
ఇక రెండోది కాంగ్రెస్ వక్కాణింపులు! ప్రజల ఉద్యమంతో వచ్చింది రాష్ట్రం, కేసీఆర్ ఒక్కడు తెచ్చాడా? అని అంటారు. తెలంగాణ సిద్ధాంతకర్త డాక్టర్ జయశంకర్ ఒక విషయం చెప్పేవారు. ‘ఏ ఉద్యమానికైనా మూడు పార్శాలుంటాయి. ఒకటి ప్రజా చైతన్యం. ప్రజలకు వారి బాధలు తెలుస్తాయి కానీ, వాటి కారణాలు, పూర్వాపరాలు తెలియవు. ఆ సమాజంలోని విద్యావంతులు, మేధావులు ఈ విషయాలు వారికి అర్థమయ్యేట్టు చెప్పి, వారిని ఉద్యమానికి ఉద్యుక్తులను చేయాలి.
రెండు ఈ ప్రజలను నడిపే నాయకుడు సమర్థత, త్యాగబుద్ధి, తెలివి తేటలు ఉండి ఉద్యమంలోని ఆటుపోట్లు ఎదుర్కొనే సహనం ఉండి, కాడి వదలకుండా ఉద్యమాన్ని దాదాపు చివరిదాకా తీసుకెళ్లి, విజయం సాధించేవాడు. ఇది చాలా కష్టతరమైనది. 1969 నుంచీ తెలంగాణలో చాలామంది వారివారి సంస్థల ద్వారా, పార్టీలు పెట్టి ఉద్యమం మొదలుపెట్టారు. కానీ, విజయవంతం కాలేదు. అందుకే ఆంధ్రా నాయకులు తెలంగాణ గురించి చాలా హేళనగా మాట్లాడేవారు. ఇక ఈ నాయకుడు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేగలిగితే మూడో ప్రక్రియ జరుగుతుంది. అది కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇతర పార్టీల వారిని ఒప్పించి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి రెండు సభలలో దానిని ఆమోదింపజేయడం. దీనికి నాయకుడి సమర్థతే ముఖ్యం. ఇది ఏ మేధావి వలన కాదు, ఒక ప్రజ్ఞావంతుడైన రాజకీయ నాయకుడి వల్లనే జరుగుతుంది. అందుకే ఉద్యమ విజయం ఆ నాయకుడికే చెందుతుంది’ అని చేప్పేవారు. మరి కేసీఆర్ కదా మనకు రాష్ట్రం సాధించింది!
ఇక 2014 నుంచి 2023 దాకా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఈ రాష్ర్టాన్ని ఒక అద్భుతమైనదిగా మార్చడం, కేంద్రం నుంచి దాదాపు 40 శాతం అవార్డులు ఈ పసి రాష్ర్టానికి రావటం తెలిసినదే కదా! సామాన్యుల అవసరాలు గుర్తించి వారికి వసతులు కల్పించటం ఆయన సహృదయతకు తార్కాణమే కదా! కరోనా సమయంలో ఇతర రాష్ర్టాల వలస కూలీలను వారి స్వస్థలాలకు పంపటం దీనికి ఉదాహరణ కాదా? ఈ తొమ్మిదేండ్లలో చాలా భాగం జైళ్లు మూత పడటానికి నేరాలు తగ్గి, అతి సామాన్యులకు కూడా ఉపాధి దొరకడం కాదా? దేశంలోనే స్త్రీల భద్రతలో నంబర్ 1 రాష్ట్రంగా ఎదగటం ముఖ్యమంత్రి ఘనత కాదా? చనిపోయిన వారిని గౌరవంగా సాగనంపటం, పుట్టబోయే బిడ్డల క్షేమం కోసం గర్భిణుల ఆరోగ్యం, ఆహారం గురించి శ్రద్ధ తీసుకోవటం కేసీఆర్కు మానవ జీవితం విలువ తెలుసన్న సంగతి బహిర్గతం చేయటం లేదా? ఇక ఏరికోరి, మాటల వలలో పడి, గత అనుభవాన్ని తోసిరాజని గెలిపించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎలా ఉందో చూద్దాం! అన్నం ఉడికిందా అన్నది ఒక్క మెతుకును చూస్తే తెలుస్తుందంటారు కదా! మరి నాలుగు దశాబ్దాలు ఉడకని అన్నం తిని కూడా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ నాయకుల మాటలు ఎలా నమ్మారు? నమ్మిన ఫలితాలు చూద్దాం!
ఇంటర్మీడియట్ పరీక్షా పత్రాలు కూడా ఒక్కటే కేంద్రంలో పెట్టి, పరీక్షకులైన లెక్చరర్లను అక్కడికే పిలిచి ఆ పత్రాలు దిద్దిపిస్తారు అధికారులు. పోనీ అభయహస్తం అప్లికేషన్ ఫారాలు ఇంకొక చోటికి పంపాలనుకున్నా రూ.1800 పెట్టి కొన్న ట్రంకు పెట్టెల్లో పెట్టి గవర్నమెంట్ కారులో జాగ్రత్తగా పంపాలి కదా! రాపిడో బైకులో పంపుతారా? కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్యం ఈ ప్రజల మీద ఎంత ఉందో ఈ పాటికి తెలిసిందా? పైగా రోడ్డు మీద అవి పడ్డాయని ఉప ముఖ్యమంత్రిని అడిగితే, ‘మరి దారం ఊసిపోతే పడవా’ అని నవ్వులాటగా సమాధానం చెప్తారు. కాంగ్రెస్ను గెలిపించిన తెలంగాణవాసులారా, ఇప్పటికైనా మీ జీవితాలకు, మీ జీవిత వివరాలకు ఈ ప్రభుత్వం ఎంత విలువ ఇస్తుందో తెలుస్తున్నదా? ప్రజా పాలన, ప్రజా వాణి వింటాం అన్న ముఖ్యమంత్రికి ఆరు సార్లు ఢిల్లీ వెళ్లే సమయం ఉంది కానీ, రెండోసారి ప్రజా భవన్కు వచ్చే ఉత్సాహం లేదు, గమనించారా?
కేసీఆర్ ప్రజలను కలువరు, బయటకు రారని విమర్శించే కాంగ్రెస్ నాయకులకు ఒక్క విషయం తెలియాలి. ప్రజలకు ఇస్తామన్న సంక్షేమ పథకాలు అందకపోతే, ప్రభుత్వం తాను చేస్తానన్న పని చేయకపోతే అధికారులనో, మంత్రులనో కలవాలి గానీ పనులన్నీ సమయానికే జరుగుతుంటే ఎందుకు? మీకు ఒక విషయం తెలుసా? ఆఫీసులలో సరిగ్గా టైముకు వచ్చి టైము అయ్యేదాకా కూర్చునేవాళ్లు తక్కువ పని చేస్తారు. ఈ విషయం చాలా సర్వేలలో తేలింది.
ఇక ఇప్పుడు జరుగుతున్న విషయాలు, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చూడండి. గత ప్రభుత్వం ప్రతిపాదించిన పథకాలు రద్దు చేయటం (ఫార్మా సిటీ), జిల్లాల సంఖ్య తగ్గించటం వంటి పనులు ఏమి సూచిస్తాయి? ఇక ప్రగతిపథం మూతపడి, ప్రతి పాత పని తిరగదోడి ప్రజలలో గందరగోళం సృష్టిస్తే, ఇక వారు చేయవలసినదేమీ ఉండదని ప్రభుత్వ పన్నాగం. డిజిటల్గా కంప్యూటర్ మీద తీసుకోవలసిన అప్లికేషన్లు పది రోజులలో వర్గీకరణ చేయవచ్చు. కానీ పేపర్ మీద తీసుకున్నవి ఒక కోటి 25 లక్షలు. కనీసం రెండు నెలల సమయం పడుతుంది. ఈ లోపల ఎంపీ ఎలక్షన్లు అయిపోతాయి. పథకాలు ఇస్తాం, ఇస్తాం అని చెప్పి శాసనసభా ఎన్నికల్లో వలె సార్వత్రిక ఎన్నికలో గెలవాలని కాంగ్రెస్ పార్టీ ఉపాయం అర్థమైందా? ఒక్కసారి ఈ ఎన్నికలు కూడా అయిపోయాయంటే ఇక ఐదేండ్లు మీతో కాంగ్రెస్ ప్రభుత్వానికి పని ఉండదు. గత 44 ఏండ్లు పాలన చేసినట్టే చేసి, తెలంగాణ నిధులు తమ అధినాయకత్వానికి దోచిపెడతారు. వనరులు అదానీ, అంబానీకి కట్టబెడతారు. ఇంకా రెండు తెలుగు రాష్ర్టాలను మళ్లీ ఒకటే రాష్ట్రం లాగ కలిపే ప్రమాదం కూడా ఉంది.
2014 దాకా తమ జీవితం ఎలా ఉండిందో తెలంగాణ ప్రజలు తమ అనుభవాలు గుర్తుచేసుకోవాలి. యువత తెలియనివారికి చెప్పాలి. తాము ఏ పార్టీ పాలనలో బాగున్నామో ఆలోచించుకొని పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వే యాలి. లేకపోతే శాసనసభలోనే కాక, పార్లమెంటులో కూడా తెలంగాణ వ్యతిరేక పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఈ ప్రాంతానికి మంచి జరగనివ్వవు. ఈ సారైనా మాటల మత్తులో పడకుండా మీ అనుభవానికి విలువనివ్వండి. తెలంగాణ ప్రజలను ప్రేమించి, సేవనందించే పార్టీకి ఓటెయ్యండి.
కనకదుర్గ దంటు
89772 43484