‘ఒక వ్యక్తి తక్కువ ఆదాయంతో తనను, తనపైన ఆధారపడిన వాళ్లను సమర్థవంతంగా పోషించలేని స్థితిని పేదరకం’ అని ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త గిల్లిన్ జే గిల్లిన్ ‘సోషల్ ప్రాబ్లమ్స్’ అనే గ్రంథంలో వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నేడు తెలంగాణ రాష్ట్రం పేదరిక నిర్మూలన దిశగా దూసుకుపోతున్నది.
కేసీఆర్ ప్రారంభించిన ప్రతీ పథకం తెలంగాణ గడపగడపకు అందింది. దీం తో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. నీతి ఆయోగ్ తాజాగా వెలువరించిన ‘మల్టిపుల్ పావర్టీ ఇండెక్స్’ నివేదికనే అందుకు తాజా నిదర్శనం. విద్య, వైద్యం, పోషకాహా రం, పారిశుధ్యం, విద్యుత్తు, తాగునీరు, స్థిరాస్తి వంటి 12 అంశాలతో కూడిన ఈ నివేదిక తెలంగాణలో పేదరికం 13.18 శాతం నుంచి 5.8 శాతానికి తగ్గిందని పేర్కొన్నది. జాతీయ సగటు పేదరికం 14.96 శాతంగా ఉంది. తెలంగాణ గ్రామాల్లో పేదరికం 19.5 శాతం నుంచి 7.5 శాతానికి, పట్టణాల్లో 4.92 శాతం నుంచి 2.73 శాతానికి తగ్గింది. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 27 లక్షల మంది ప్రజలు పేదరికం నుంచి విముక్తులయ్యారని ఈ నివేదిక వెల్లడించింది.
ప్రపంచవ్యాప్త పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లో పేదరికం ఎక్కువ. ఇందుకు ప్రధాన కారణం గ్రామ సీమల్లో ఉద్యోగ-ఉపాధి అవకాశాలు లభించకపోవడం. భారతదేశం గ్రామీణ దేశం. వ్యవసాయమే దేశ ప్రజల ప్రధాన ఆర్థిక వనరు. తెలంగాణ రాష్ట్రం ఇందుకు అతీతమేమీ కాదు. కానీ, గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా సమృద్ధిగా వనరులున్నప్పటికీ తెలంగాణలో వ్యవసాయరంగం నిర్లక్ష్యానికి గురైంది. రైతు కుటుంబాల మీదనే ఆధారపడిన రైతు కూలీలకు ఉపాధి లేకుండాపోయింది. మరోవైపు చేతివృత్తులు మూలనపడ్డాయి. ఉపాధి, ఆదాయ వనరులను కోల్పోవడంతో, కొనుగోలు సామర్థ్యం లేకపోవడంతో ప్రజలు పౌష్టికాహార లోపంతో అనారోగ్యం పాలయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో ఈ పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. గ్రామీణ ఆర్థికవ్యవస్థకు గుండెకాయ లాంటి వ్యవసాయరంగానికి ప్రాధాన్యం ఇచ్చిన కేసీఆర్, అందుకవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించారు. మిషన్ కాకతీయ ద్వారా కనుమరుగవుతున్న 40 వేల చెరువులకు పునర్జీవనం పోశారు. ప్రపంచమే అబ్బురపడే రీతిలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మించారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేశారు. తద్వారా అతి తక్కువ కాలంలోనే కోటి 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి పడావుబడ్డ భూములను పంట పొలాలుగా మార్చారు. వ్యవసాయ రంగానికి 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్తునందించారు. పంటలపై రైతులకు అవగాహన కల్పించడానికి మొట్టమొదటిసారిగా వ్యవసాయ విస్తరణాధికారులను నియమించారు. సకాలంలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులను సరఫరా చేశారు. పెట్టుబడి సాయం కింద రైతుబంధు ఇచ్చారు. పండిన పంటలు కొనేందుకు ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేశారు. రైతు సంక్షేమాన్ని కాంక్షించి రైతుబంధు సమితుల ద్వారా రైతాంగానికి దన్నుగా ఉన్నారు. ఈ రైతు పక్షపాత విధానాలతోనే స్వరాష్ట్రంలో రైతాంగం మళ్లీ వ్యవసాయ బాట పట్టింది. పంట విస్తీర్ణం 208 లక్షల ఎకరాలకు పెరిగింది. రికార్డు స్థాయిలో పంట దిగుబడి 68 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి, దాదాపు నాలుగింతలై 270 మెట్రిక్ టన్నులకు వృద్ధి చెందినది. ఉద్యానవన పంటలకు చేయూతనివ్వడంతో అతి శీతల ప్రాంతాల్లో మాత్రమే పండే ఆపిల్, అంజీర్ వంటి పంటలు తెలంగాణలోనూ సాగయ్యాయి. పప్పు దినుసుల దిగుబడి గణనీయంగా పెరిగింది. మాంసం, చేపలు, గుడ్లు, పాలు, సమృద్ధిగా లభిస్తున్నాయి.
మానవ అభివృద్ధి నమూనాలో విద్య, వైద్యం ప్రధానమైనవి. ముఖ్యంగా పాఠశాల స్థాయిలో విద్యకు దూరమయ్యేది అట్టడుగువర్గాల పిల్లలే. సంచార వృత్తికులాలు, మారుమూల గిరిజన గూడేలలోని దళిత, బీసీ, మైనారిటీ వర్గాల బిడ్డలు చదువుకు దూరం కాకుండా దాదాపు 800కు పైగా గురుకుల పాఠశాలలను ఏర్పాటుచేశారు. విద్యతో పాటుగా నాణ్యమైన ఆహారం అందిస్తున్నారు. దీంతో పిల్లల డ్రాపౌట్స్ సంఖ్య తగ్గింది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్తో బాల్య వివాహాలు తగ్గాయి. పేదలకు వైద్య సదుపాయాలు కల్పించడానికి ప్రతీ జిల్లాకో వైద్య కళాశాలను ఏర్పాటుచేశారు. మాతా శిశు సంరక్షణ కేంద్రాల ను బలోపేతం చేయడంతో దాదాపు 72 శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లోనే జరుగుతున్నాయి. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ. హై రిస్క్ ఉన్న గర్భిణులను గుర్తించి వారికి నిరంతర సేవలందిస్తున్నారు. రక్త హీనతతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీల కోసం కేసీఆర్ న్యూట్రిషనల్ కిట్ ద్వారా పోషకాహారం అందిస్తున్నారు. అమ్మ ఒడి ద్వారా తల్లి బిడ్డను క్షేమంగా ఇంటికి చేరుస్తున్నారు. ఈ విధానాలతో రాష్ట్రంలో శిశు మరణాల సంఖ్య 2014లో 1000 మందికి 39 మంది చిన్నారుల నుంచి నేడు 21కి తగ్గింది. 2014లో 92గా ఉన్న మాతృత్వ మరణాలు 2022 నాటికి 56కి తగ్గాయి. లింగ సమానత్వాన్ని సూచించే మహిళా ఉద్యోగుల శాతంలోనూ ఎన్ఎఫ్హెచ్ఎస్-5లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఇది కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగవ్వడానికి దోహదపడింది. బ్యాంకు ఖాతా లేని వారి సంఖ్య 8 నుంచి 2 శాతానికి తగ్గింది. ప్రజల ఆర్థిక సామర్థ్యం పెరగడంతో కొంత స్థిరాస్తి కొనుగోలు చేసుకుంటూ ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు.
తెలంగాణ ప్రజల గోసను ప్రపంచానికి చాటి న నాయకుడిగా తెలంగాణకు ఏం కావాలో కేసీఆర్కు బాగా తెలుసు. తొమ్మిదేండ్లలోనే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని రాష్ర్టాన్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టించారు. దేశం కేసీఆర్ నమూనా వైపు ఎదురుచూస్తున్నది. దేశవ్యాప్తం గా కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్కు ప్రజాదరణ పెరుగుతున్నది. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా మారనున్నది.
(వ్యాసకర్త: కేయూ వైస్ చాన్స్లర్)
-ప్రొఫెసర్
తాటికొండ రమేష్