దేశంలో రాజకీయాలు భ్రష్టు పడుతున్నాయి. కాదు, కాదు, తమ స్వార్థం కోసం, పదవుల కోసం, అధికారాన్ని అనుభవించడం కోసం రాజకీయ నాయకులు దేశ రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు. పార్టీ సిద్ధాంతాలను పాతర పెట్టి ‘అధికారం’ ఎక్కడ ఉంటే అక్కడికి క్యూ కడుతున్నారు. అన్నితరాల రాజకీయ నేతలకు ఫిరాయింపులు ఫ్యాషన్గా మారడం నిజంగా అత్యంత ఖండనీయం. ప్రస్తుతం రాష్ట్రంలో ఫిరాయింపుల రాజకీయం జోరుగా సాగుతున్న నేపథ్యంలో పాఠకుల కోసం ప్రత్యేక వ్యాసం…
Telangana | అనుభవించీ.. అనుభవించీ.. అధికారం చేజారేసరికి కొందరు సీనియర్ నాయకులు ఉండలేకపోతున్నారు. అందుకే అధికారం వెంటే పారా హుషార్ అంటూ పరుగులు తీస్తున్నారు. ఈ నాయకులు నాడు ‘తెలంగాణ కోసం’ అనో.. ‘బంగారు తెలంగాణ కోసం’ అనో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కడియం శ్రీహరి, కే.కేశవరావు లాంటి నాయకులు అధికారాన్ని చూసే నాడు అధికార పార్టీలోకి ఫిరాయించారనేది ఇప్పుడు స్పష్టమైంది. పదవుల్లో ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను ఇంద్రుడు, చం ద్రుడు అంటూ పొగిడారు. అధినేతకు, బీఆర్ఎస్ పార్టీకి వీర విధేయత ప్రకటించారు. ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఇలా అధికారం చేజారిందో లేదో… ఈ తలపండిన నేతలు కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిన్నటిదాక పూనకం వచ్చినట్టు ఊగిపోతూ చెడ తిట్టిన పార్టీలో చేరడం నిజంగా సిగ్గుచేటు. పేర్లు పెట్టి వ్యక్తిగతంగా బూతులు తిట్టుకున్నవారు తెల్లారేసరికి పార్టీ కండువాలు మార్చుకుంటూ, నవ్వుతూ ఫొటోలకు ఫోజులిస్తూ కనపడితే ఊసరవెల్లులు కూడా సిగ్గుపడుతున్నాయి. ఈ ఊసరవెల్లి వలస రాజకీయాలు ఒక్క తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి.
ఒకసారి పార్టీ సిద్ధాంతాలు నచ్చి, అందులో ప్రాథమిక కార్యకర్తగా ప్రవేశించి, వివిధ దశల్లో నమ్మకంగా పనిచేసిన కార్యకర్తలకే వారి శక్తి, సామర్థ్యాల మేరకు గతంలో పార్టీలు అవకాశాలు కల్పించేవి. ఈ సంస్కృతి మన దేశంలో మొదట వామపక్షాల్లో, ఆ తర్వాత జనసంఘ్/ బీజేపీలో కనిపించాయి. వారే పార్టీ జెండాలు మోసేవారు, పార్టీ సిద్ధాంతాలను బలంగా నమ్మేవారు. ఏండ్ల తరబడి ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా పార్టీ కోసం అహర్నిశలూ పనిచేసేవారు. పార్టీ కోసం ప్రాణత్యాగాలకు సైతం వెనుకాడేవారు కాదు. కొన్నిసార్లు వివిధ అంతర్గత, బాహ్య కారణాల వల్ల పదవులు వచ్చినా, రాకున్నా పార్టీని, దాని సిద్ధాంతాన్ని మనసా వాచా బలంగా నమ్మి, గాఢంగా విశ్వసించి పనిచేసేవారు. ఇప్పుడు కాలం మారింది. అలాంటి పార్టీలు, అలాం టి నాయకులు కరువయ్యారు. మారుతున్న పరిస్థితుల కారణంగా రాజీపడి బీజేపీ, వామపక్ష పార్టీలు కూడా క్రమశిక్షణకు తిలోదకాలిచ్చాయి. ఇవే కాదు, అన్ని పార్టీలు ఈ దుష్ట సంస్కృతికి గేట్లు తెరిచాయి.
అధికారం ఎక్కడ ఉంటే పోలోమంటూ అక్కడికి చేరిపోతున్నారు రాజకీయ నాయకులు.ండాలు మోసినోళ్లకు కాకుండా, వ్యక్తిగత ఎజెండాలతో కండువాలు మార్చినవాళ్లకు అవకాశాలు ఇస్తున్నంతకాలం పార్టీ ఫిరాయింపులు జరుగుతూనే ఉంటాయి. వారిపై స్పీకర్లు చట్టపరిధిలో చర్యలు తీసుకోవాలి. కానీ, స్పీకర్లు కూడా అధికార పార్టీకి అనుకూలంగానే విధేయత ప్రకటిస్తున్నారు. ఇలాంటి ఫిరాయింపు నేతలకు ప్రజలు కూడా ‘కర్రు కాల్చి వాత పెట్టినట్టు’ రానున్న ఎన్నికల్లో ఓడించి ప్రజా చైతన్య సత్తా చాటాలి. ఒక సిద్ధాంతం, కట్టుబాటు లేకుండా ఇలా పార్టీ ఫిరాయించేవారికి గట్టిగా బుద్ధి చెప్పి తీరాల్సిన సమయం ఆసన్నమైంది. ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా అనేక అవకాశాలను కల్పిస్తే, ఆ పార్టీ అధికారం కోల్పోగానే ఆ పార్టీకి కనీసం కృతజ్ఞత చూపకపోవటం నిజంగా అమాను షం. ఈ మధ్య ఒక ప్రముఖ దళిత నాయకురాలు పదవుల కోసం ఆశపడి బీఆర్ఎస్ను వీడేది లేదని గట్టిగా నమ్మబలికారు. కాంగ్రెస్ను విపరీతంగా ద్వేషించిన ఆ వ్యక్తి, తిరిగి అదే కాంగ్రెస్లోకి ఫిరాయించారు. కాబట్టి రాష్ట్ర ప్రజలు విజ్ఞత చూపి అవకాశవాద ఫిరాయింపుదారులను గుర్తుపెట్టుకుని మరీ ఓడించాలి. అప్పుడే ఫిరాయింపు నాయకులకు గుణపాఠం చెప్పినవారమవుతాం.
ఏదేమైనా ఈ పార్టీ ఫిరాయింపుల హవా కొంతకాలమే కొనసాగుతుంది. నాయకులు తమ వ్యక్తిత్వాన్ని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని, ప్రజాస్వామ్య విలువలను… పదవుల కోసం, ధనం కోసం, ఇతర వ్యాపార, ఆర్థిక ప్రయోజనాల కోసం అమ్ముకోవటానికి సిద్ధమైనప్పుడు సంతలో అంగడి సరుకవుతారే గానీ, విలువలు గల ప్రజా ప్రతినిధులు ఎప్పటికీ కాలేరు. వారు చరిత్ర హీనులుగా, రాజకీయ కళంకితులుగా చరిత్రలో శిలాక్షరాలతో లిఖించబడతారే గానీ నిష్కళంకితులు కాబోరు. ఈ అపవిత్రపు డాగు, మచ్చ చరిత్రపుటల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది.
ఎడిటోరియల్ డెస్క్