నాడు తెలంగాణ సంరక్షణార్థం మొక్కగా మొలిచి, నేడు మానై తెలంగాణకు సుజలాలు, సుఫలాలను అందించిన పార్టీ ‘బీఆర్ఎస్’. దశాబ్దకాలంలో ఆకలి తెలంగాణను అన్నపూర్ణగా, పారిశ్రామిక కేంద్రంగా, ఐటీ హబ్గా తీర్చిదిద్దిన ప్రగతిశీల పార్టీ బీఆర్ఎస్.
తెలంగాణ నూతన సచివాలయానికి అంబేద్కర్ అని నామకరణం, దానిముందు సుందరవనంలో సమున్నత అంబేద్కర్ విగ్రహ నిర్మాణం అనేవి రాజ్యాంగం, రాజ్యాంగకర్త అంబేద్కర్ పట్ల కేసీఆర్కున్న అపార గౌరవానికి చెరగని నిదర్శనం. పాలనా సౌలభ్యం కోసం చిన్న రాష్ర్టాలే శ్రేయస్కరం అన్నది అంబేద్కర్ సూచన. ఆయన ఆశయంతో ఏకీభవించినందునే, తెలంగాణ రాష్ర్టాన్నే కాదు, దాన్ని తిరిగి చిన్న జోన్లు, చిన్న జిల్లాలుగా పునర్విభజించారు. రాజ్యాంగం పట్ల కేసీఆర్కు ఉన్న నిబద్ధతకు ఇంతకన్నా నిదర్శనమేం కావాలి?
వ్యవసాయాభివృద్ధికి సాగునీటి ఆవశ్యకతను గుర్తించి ‘మిషన్ కాకతీయ’ ద్వారా సుమారు 47 వేల చెరువుల పునరుద్ధరణ, రిజర్వాయర్లు, ఎత్తిపోతల పథకాల నిర్మాణాల ద్వారా 100 శాతం సాగునీటి వనరులను పెంపొందించుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని నీతి ఆయోగ్ నుంచి ప్రశంసలందుకున్న భారతైక ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రభుత్వ, ప్రైవేట్రంగాల మధ్య పోటీని కొనసాగించడం ద్వారా ప్రజలకు నాణ్యమైన, తక్కువ ధరలకు సేవలందించారు. ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణ ద్వారానే రిజర్వేషన్లను, తద్వారా పేదల ఉపాధికి భద్రతను కల్పించగలమన్న వాస్తవాన్ని గ్రహించిన మానవీయ నేత కేసీఆర్. అందుకే ‘మీరు తెగనమ్మిన ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ తిరిగి మేం స్వాధీనం చేసుకొని పేదలకు భరోసా కలిగిస్తాం మోదీజీ’ అంటూ ప్రధానికి సవాలు విసిరిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్.
‘పేదలకు చేపనిస్తే, ఆ పూటకు భోజనం పెట్టినట్టే. చేపలు పట్టే విద్య నేర్పితే జీవితాంతం వాళ్లకు భోజనం పెట్టినట్టే’ అనే జీవిత సత్యాన్ని గ్రహించిన కేసీఆర్ నాడు 120గా ఉన్న గురుకులాల సంఖ్యను 1020కి పెంచి, వాటి నిర్వహణ బాధ్యతను ఆశయ సాధకుడైన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు అప్పగించారు. అలా ఎంతోమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలను సమున్నత విద్యావంతులుగా తీర్చిదిద్దించారు. వాళ్లలో వెయ్యి మందికి పైగా దేశ దేశాల్లో ధృవతారల్లా భాసిస్తున్నారన్నది జగమెరిగిన సత్యం. బీఆర్ఎస్ నేతలు గత ఎన్నికలకు ముందుగా మెరుపు తీగల వంటి సదరు విద్యార్థులను తెలంగాణ రప్పించి, తమ ప్రగతికి ఆ గురుకులాలే దృఢమైన పునాదులన్న వాస్తవాన్ని వాళ్ల నోటితోనే చెప్పించి ఉంటే, మేధావులకు జ్ఞానోదయం అయ్యేది.
‘సర్వత్రా సమస్థిత మీశ్వరమ్..’ అన్న గీతాప్రబోధ ఆవశ్యకతను గుర్తించి, పతనమైన అడవులను పునరుద్ధరించేందుకు, నిర్విరామంగా పరిశ్రమించిన, వర్తమాన భారతైక నేత కేసీఆర్. ప్రతి గ్రామంలో నర్సరీల పెంపకం ద్వారా దాన్ని నిరంతర ప్రక్రియగా రూపొందించారు. హరితహారం, గ్రీన్ ఛాలెంజ్లను విజయవంతం చేసి తెలంగాణ రాజధానికి ‘క్లీన్ అండ్ గ్రీన్’ అవార్డును సాధించిన వ్యక్తి కేసీఆర్. సముద్రంలో చేరిన నదీనదాల జలాలన్నీ సముద్ర జలమే కదా? అలాగే తెలంగాణలో నివసిస్తున్న అన్ని మతాలవారిని తెలంగాణ కుటుంబసభ్యులుగానే భావించారు కేసీఆర్. తన దశాబ్ది పాలనలో ఒక్క మత కల్లోలం గానీ, ఉగ్రవాద విధ్వంసం గానీ జరక్కుండా కాపాడుతూ, ప్రపంచ పరిశుద్ధ నగరాలలోనే కాదు, ప్రపంచ ప్రశాంత నగరాలలోనూ ఒకటిగా హైదరాబాద్ను నిలిపిన సిసలైన హిందువు కేసీఆర్. ఫ్లోరైడ్ నిర్మూలన కార్యక్రమాలు నిర్వహిస్తూనే మిషన్ భగీరథ ద్వారా సుజలాలనందిస్తూ ‘ఫ్లోరైడ్ రహిత తెలంగాణ’ను రూపొందించారు. ఈ అపూర్వ ప్రజాహిత ప్రగతి కార్యక్రమాలే కేసీఆర్ దార్శనికతను, రాజనీతిజ్ఞతను చాటి చెప్తున్నాయి.
ఇక మీడియా ద్వారా ఆత్మస్తుతిని-సోషల్మీడియా ద్వారా పరనిందను చేయించి ప్రజలకు కల్లబొల్లి హామీలను, ప్రతిపక్షాలపై అభాండాలను గుప్పించి, ఊకదంపుడు ఉపన్యాసాలు దంచేసి ప్రధాని అయ్యారు నరేంద్ర మోదీ. మోదీ మార్గదర్శకత్వంలో తెలంగాణ సీఎం అయ్యారు రేవంత్రెడ్డి. మోదీ ఘనకార్యాలలో ఉదాహరణకొక్కటి. ప్రకృతి, పర్యావరణ సమతుల్యతను కాపాడాలన్న స్పృహను కోల్పోయిన మోదీ, అడవులను పునరుద్ధరించకపోగా, ఉన్న అడవులను అభిమాన కార్పొరేట్లకు అప్పగించారు. లక్షల ఎకరాల అటవీ విధ్వంసానికి వీలుగా చట్టాలను సవరించి, పర్యావరణ కాలుష్యాభివృద్ధికి రహదారి నిర్మించారు. ప్రపంచ కాలుష్య నగరాలలో అత్యధిక కాలుష్య నగరాలను కలిగి ఉన్న దేశంగాను, ప్రపంచ ప్రథమ కాలుష్య నగరమైన ‘ఢిల్లీ’ని రాజధానిగా కలిగి ఉన్న దేశంగాను భారత్ను నిలిపిన ఘనుడు ప్రధాని మోదీ.
తెలంగాణతో సహా దక్షిణ భారతానికే సమీప భవిష్యత్తులో ముంచుకురానున్న ప్రమాదం డీ లిమిటేషన్ ప్రక్రియ. నాటి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 100 శాతం కుటుంబ నియంత్రణను పాటించిన దక్షిణ భారత్లో భారీగా జనాభా తగ్గింది. అవిద్య, అంధ విశ్వాసాల కారణంగా కుటుంబ నియంత్రణను పాటించని ఉత్తర భారత్లో జనాభా భారీగా పెరిగింది. జనాభా ప్రాతిపదికన జరుగనున్న డీ లిమిటేషన్ కారణంగా ఉత్తర భారత్లో ఎంపీల సంఖ్య భారీగా పెరుగుతుంది. దక్షిణ భారత్లో ఉన్న ఎంపీల సంఖ్య తగ్గుతుంది. ఉత్తర భారతాన గల అత్యధిక ఎంపీలతో అధికారాన్ని చేపట్టగల బీజేపీ, కాంగ్రెస్లు దక్షిణ భారతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసే ప్రమాదం ఉన్నది. అంతేకాదు, అత్యధిక ఆదాయ వనరులున్న హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసే దుస్సాహసానికి కూడా వెనుకాడవు ఈ జాతీయ పార్టీలు. అందుకే తెలంగాణ మేధావులు, ఉద్యోగులు, ప్రజలు, మేధావులు జాగ్రత్తగా ఉండాలి.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు)
పాతూరి వెంకటేశ్వరరావు
98490 81889