Ebola Deaths : మధ్య ఆఫ్రికా దేశం కాంగోలో (Congo) ఎబోలా వైరస్ (Ebola Virus) వేగంగా వ్యాప్తి చెందుతోంది. మే 15 నుంచి శనివారం నాటికి దేశవ్యాప్తంగా 2,344 కేసులు నమోదు కాగా.. దాదాపు 930 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ (Congo Health Ministry) తాజాగా వెల్లడించింది. శుక్రవారం నుంచి 24 గంటల వ్యవధిలో 37 మరణాలు నమోదైనట్లు తెలిపింది. ప్రస్తుతం కాంగోలో నమోదవుతున్న కేసులన్నీ బుండిబుగ్యో ఎబోలా రకానివే. ఈ తరహా కేసులు నమోదవుతున్నట్లు మే 15న అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.
ఈ వైరస్ను అరికట్టేందుకు ప్రస్తుతం వ్యాక్సిన్ గానీ, చికిత్స గానీ అందుబాటులో లేవు. సాధారణంగా ఎబోలా వైరస్ జంతువులు, గబ్బిలాలకు సోకుతుంది. అది సోకిన జంతువులను వేటాడి వాటి మాంసం (బుష్మీట్) తినడంవల్ల మనుషులకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు కనిపించడానికి 21 రోజులు పడుతుంది. ఫ్లూ, మలేరియా, జ్వరం వంటి లక్షణాలు తొలుత కనిపించినా.. చివరకు అవయవాల వైఫల్యానికి దారితీసే ప్రమాదం ఉంది.
ఈ వైరస్ సోకిన వ్యక్తుల కొన్ని కేసుల్లో శరీరం లోపలా, బయటా రక్తస్రావం అవుతుంది. వైరస్ బారినపడిన వ్యక్తి శరీర ద్రవాల ద్వారా ఇది ఇతరులకూ వ్యాపిస్తుంది.